మహారత్న

1975 నవంబరులో భారతప్రభుత్వం తీసుకున్న ఒకనిర్ణయం తాలూకు సారాంశం- "ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వ విద్యుత్తుబోర్డుల కింద జరుగుతున్న ఉత్పత్తికి సమాంతరంగా కేంద్రప్రభుత్వ పర్యవేక్షణలో ఒకప్రభుత్వరంగ సంస్థను నెలకొల్పాలి. ఈసంస్థ బొగ్గు-జలవనరులు సమృద్ధిగా ఉన్నప్రాంతాల్లో విద్యుదుత్పత్తిని చెయ్యాలి." తదనుగుణంగా జాతీయ తాప విద్యుత్తు సంస్థ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) అనే భారత ప్రభుత్వరంగ సంస్థను ఏర్పాటుచేశారు.

విద్యుత్తురంగానికి అత్యున్నత సంస్థ కేంద్ర విద్యుత్తు అథారిటీ ఈవిషయంపై అద్యయనం చేసి మేలో 1976లో 2000MW విద్యుదుత్పత్తికేంద్రాన్ని నెలకొల్పేందుకు ప్రతిపాదించారు. ఉప్పు-నిమ్మకాయ దొరికితే ఊరగాయపెట్టినట్లు బొగ్గు-నీళ్ళు నింపాదిగా ఉన్న సింగ్రౌలీ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. డిసెంబరులో కేంద్రం పచ్చజెండా ఊపింది. ముందుగా ఎంచుకున్న ఐదుప్రాంతాల్లో ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఖడియా ప్రాంతాన్ని ప్రతిపాదించారు. జయంత్ బొగ్గుగనుల నుంచి బొగ్గు, గోవిందబల్లభ పంత్ జలాశయం (రిహాంద్ జలాశయం) నుంచి నీటిని వాడుకునే దిశగా ప్రతిపాదనలు పూర్తయ్యాయి.

మొదటిదశలో 600MWకు అనుమతి లభించింది. బాలారిష్టాలన్నీ దాటుకుని 1978 ఫిబ్రవరిలో నిర్మాణం మొదలయ్యింది. ఆపై రెండొవిడతకింద మరో 1400MWకు అనుమతి జూలై 1979లో లభించింది. నవంబరు 24, 1987లో ఏడవది, చిట్టచివరిది అయిన 500MW యూనిట్‌ని గ్రిడ్‌కి అనుసంథానం చెయ్యడంతో సింగ్రౌలీ బృహత్ తాపవిద్యుత్తు గృహం (సింగ్రౌలీ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్) దేశంలోకెల్లా అతిపెద్ద తాపవిద్యుత్‌గృహంగా అవతరించింది. ఆపై ఫరఖ్ఖా, కోర్బా, రామగుండం మొదలైన చోట్ల ఉత్పత్తికేంద్రాలను నెలకొల్పారు.

1997లో నవరత్న హోదా లభించింది. ఏదైనా ప్రభుత్వరంగసంస్థ నవరత్నహోదా పొందాలి అంటే ఆరు‌అంశాలలో పనితీరు విశ్లేషించాక నూటికి కనీసం అరవైమార్కులు రావాలి. ఇలా నవరత్నహోదాను పొందిన సంస్థ ఏడాదికి వెయ్యికోట్లు లేదా సంస్థ నికరవిలువలో మూడోవంతులలో ఏది తక్కువైతే అంతవరకు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంనుంచి ముందస్తు అనుమతి అవసరంలేదు. నవరత్నహోదాతో లభించిన స్వయంప్రతిపత్తి ఎన్.టీ.పీ.సీకేగాక ఐఓసీఎల్, బీహెచ్‌ఈఎల్‌వంటి సంస్థలకు వరంగా మారింది. చిన్నచిన్నపెట్టుబడులు, ఇతరవిషయాలకు సంబంధించి అధికారగణం చుట్టూతిరుగుతూ అలిసిపోయిన ఈసంస్థలు ఒక్కసారిగా రెక్కలు విప్పుకుని గగనతలంలోకి ఎగరడం ప్రారంభించాయి. దేశవిదేశాల్లో పెట్టుబడులు, సాంకేతికసేవలు, తమరంగానికి తిర్యక్‌దిశలో ఉన్నరంగాల్లో పెట్టుబడులు, మార్కెటింగ్‌రంగం వంటివాటీలోకి ప్రవేశించడంవంటి మార్గాలద్వారా విస్తృతపరచుకున్నాయి.


ఈరోజు 30000MW సామర్థ్యంగల ఎన్.టీ.పీ.సీ. తన మూలరంగమైన తాపవిద్యుదుత్పాదనేగాక జలవిద్యుత్తు, సాంప్రదాయేతర ఇంధనవనరులు, అణువిద్యుత్తుదిశగా అడుగులేస్తుంది. ఈసమయంలో డిసెంబరు 24,2009 సాయంత్రం మూడున్నరకు కేంద్ర సమాచార ప్రసార శాఖమంత్రి అంబికాసోని చేసిన ప్రకటనతో అంతా ఒక్కసారిగా పండగవాతావరణం. నవరత్న నుంచి మహారత్నగా(just like GOOD to GREAT) ఆవిర్భవించింది.
కేంద్ర భారీపరిశ్రమలశాఖ నూరురోజుల ప్రగతిపత్రంలో భాగంగా మొదటిదశలో ఎన్.టీ.పీ.సీతో బాటుగా ఓ.ఎన్.జీ.సీ, సెయిల్ లకు మహారత్నహోదా లభించింది. ఆర్థికాంశాలను విశ్లేషించే మూడుఅంశాలలో పనితీరునిబట్టి మహారత్నహోదాను ఇస్తారు. మొదటిదశలో మూడింటికే లభించినా సమీపభవిష్యత్తులో కోల్‌ఇండియా, ఐఓసీఎల్‌ వంటి ఇతరసంస్థలకు లభించే అవకాశం ఉంది.

ఈహోదా లభించిన సంస్థలకు రూ.5000 వరకు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదు. ఈహోదాతో అంతరంగిక విషయాలలో స్వయంప్రతిపత్తి, పారిశ్రామికరంగంలో ప్రతిష్టను పొందింది. నవరత్నహోదా పొందిన సంస్థలు దేశంలోనీతరసంస్థలతో పోటీపడాలి. దేశీయవిపణిలో ముందున్నసంస్థలు అంతర్జాతీయవేదికపై పోటీపడాలన్నది మహారత్న ముఖ్య ఉద్దేశ్యం.


మూడుదశాబ్దాల క్రితం కనీసంరోడ్డుకూడాలేని నిర్మానుష్యప్రాంతంలో పడ్డ పునాదినుంచి ఎన్నోసమస్యలు. మొదట మానవవనరులు, తర్వాత ఆర్థికసమస్యలు, ఆపై సాంకేతిక సమస్యలు. పెద్దప్రాజెక్టులను నిర్మించేందుకు ఆపై ఉత్పత్తిని చేపట్టేందుదుకు సరిపడే సిబ్బందిలేమి నుంచి మానవవనరులను విదేశీసంస్థలకు అవుట్‌సోర్స్ చేసేస్థాయికి, వారిప్రాజెక్టులను పర్యవేక్షించి సాంకేతికసేవలను అందించే స్థాయికి ఎదిగింది. నిర్మాణానికి కావాల్సిన బడ్జెట్టు ఆపై బొగ్గుకొనుగోలుకు ధనంలేక సతమతమయ్యే స్థితి నుంచి లక్షకోట్ల నికరవిలువదాకా సాగింది. ఉత్పత్తిలో కీలకమైన టర్బైన్, బాయిలర్లేకాదు సహాయక యంత్రాలను సైతం దిగుమతి చేసుకునే పరిస్థితి.

సమాంతరంగా బీహెచ్‌ఈఎల్‌ సాంకేంతికంగా ఎదగడమేగాక సోదరుడిలా ఇచ్చిన స్నేహహస్తం. ప్రాజెక్టులకు కావలసిన టర్బైన్లు హరిద్వార్ ప్లాంటులో, బాయిలర్ తిరుచ్చిరాపల్లిలో, హీటర్లు హైదరాబాదులో, ఇతరయంత్రాలు మిగతాప్లాంటుల్లో లేదా జీ.ఈ., ఏబీబీ వంటి బహుళజాతి సంస్థలనుంచి కొనుగోలు. ఈరోజు ఏదైనా యంత్రాన్ని లేదావిడిభాగాన్ని సంపాదించాలంటే చాలాసులభం. కావలసిందల్లా జేబులోడబ్బే. కానీ ఆర్డరు ఇచ్చిన ఆరునెలలకి కూడా రానిరోజుల్లో మొదటితరం ఎదుర్కున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. కనీసం కుటుంబానికి సదుపాయాలు దొరకని ప్రాంతాల్లో పని. ఒకఫోనుకాల్ కోసం వారాలతరబడి నిరీక్షణ. టెంట్లల్లోనే నివాసం.

ఇన్నిసమస్యల్ని దాటుకుని ఒకప్లాంటు కడితే ఆతర్వాత బొగ్గుకొనుగోలు, సరఫరానుంచి విదుదుత్పత్తి వరకు ఎదురయ్యే ఇబ్బందులు ఒక్కొక్కదాన్ని అర్థంచేసుకుంటూ పరిష్కరించుకుంటూ ముందుకువెళ్తే బాకీలవసూళ్ళు ఇంకోసమస్య. ఇవివసూలుకానిదే కొత్తప్లాంటు సంగతి దేవుడెరుగు ఉన్నప్లాంటును నడపలేని స్థితి. సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించని రాష్ట్రప్రభుత్వాలు. నిమ్మకు నీరెత్తిన అధికారగణం.

నిర్మించిన ఏప్రాజెక్టులోనూ స్థానికులకు అన్యాయంచెయ్యలేదు. పునరావాస చర్యలకై తయారుచేసిన ఆర్&అర్ (రిసెటిల్మెంట్ &రిహాబిలిటేషన్) విథానాలను కేవలం కాగితాలకే పరిమితంకాలేదు. ప్రతిప్రాజెక్టులోనూ తు.చ.తప్పక పాటించారు. అనేకసందర్భాల్లో కేంద్రప్రభుత్వ అధికారుల నోటివెంట వచ్చినమాట "ఎన్.టీ.పీ.సీ ఆర్&ఆర్ పాలసీ ప్రభుత్వపాలసీలకన్నా మెరుగైంది." ఆసంస్థవస్తే మాబతుకులేమవుతాయో అన్న భయం ఏనాడూ ప్రజల్లో కలగలేదు. అందుకు ఉదాహరణ మనరాష్ట్రంలో నెలకొల్పిన రామగుండం మరియు సింహాద్రి. వ్యాపారలక్ష్యాలకోసం విలువలను ఏరోజూ పక్కన పెట్టిందిలేదు.


ఉత్పాదకసామర్థ్యం మొత్తం దేశసామర్థ్యంలో ఐదోవంతైనా ఉత్పత్తిలో నాలుగోవంతు ఎన్.టీ.పీ.సీ నుంచే వస్తుంది. దేశంలో ప్రతినాలుగు ఇళ్ళలో ఒక‌ఇంటిలో దీపం ఈసంస్థ ఇచ్చిన విద్యుత్తుతోనే వెలుగుతుంది.


ఆర్థికసంస్కరణలు- ఈపదం మనదేశంలో వినబడడం మొదలయినప్పటినుంచి దానిప్రభావానికి లోనుకాని రంగమంటూలేదు. బయట మార్కెట్టులో వస్తున్న మార్పులకనుగుణంగా తన పంథానుమార్చుకోనిదే ముందుకెళ్ళలేని పరిస్థితి. స్టాక్‌మార్కెట్లో పేరునమోదు, ఆర్థిక అంశాలు, ఉద్యోగుల పనితీరు, అధికార నిర్మాణం వంటి అంతరంగిక అంశాలలో మార్పులు చేసుకుని నవరత్నహోదాను పొందింది. అదేసమయంలో రాష్ట్రప్రభుత్వాల విద్యుత్తుశాఖలలో వచ్చినమార్పులవల్ల బిల్లుచెల్లింపుల సమస్యలు చక్కబడ్డాయి. ఆపై జలవిద్యుత్తులోకి ప్రవేశించింది. ఇప్పటికి మూడుప్రాంతాల్లో సుమారు 2000MW ఉత్పత్తికోసం నిర్మిస్తున్నారు.




ఈరోజు 15 బొగ్గు ఆథారిత, 7గాస్ ఆథారిత ప్లాంట్లు, అనేకప్రాంతాల్లో రాష్ట్రప్రభుత్వాలతోనూ, ఇతరసంస్థలతోనూ సంయుక్తంగా నిర్వహిస్తున్న ముప్పై పైగా ఉత్పత్తిగృహాలతో 30000MW పైగా విద్యుదుత్పత్తి చెయ్యడమేగాక మరో 18000MW పైగా ఉత్పత్తిసామర్థ్యంగల ప్లాంట్లు ఉత్పత్తిదశలో ఉన్నాయి. బీహెచ్‌ఈఎల్, కేంద్ర‌అణుశక్తిసంస్థలవంటి వాటిటొ కుదుర్చుకున్న ఒప్పందాలు, నెలకొల్పుకుంటున్న భాగస్వామ్యాలు భవిష్యత్తులో మరింతప్రగతిని సాధించేందుకు దోహదపడుతాయి.



ఒకతరంపూర్తిగా తామునడిచిన బాటలోని ముళ్లను శుబ్రంచేసిపెట్టి మేము వచ్చేసరికే జీతభత్యాల ఫలాల్నేగాక ఉద్యోగభద్రత అనే నీడని ఏర్పరచారు. ఇప్పుడు ఇచ్చినహోదా మాలాంటి కిందిస్థాయి అధికారులకి, బయటివాళ్ళకి హోదాగానే కనిపిస్తుంది. కానీ పైస్థాయి అధికారులకి అదితెచ్చిపెట్టే బాద్యత, దానితాలూకు ఒత్తిడి అనుభవించేవారికే తెలిసేది. ఇప్పటిదాకా ఏకచత్రాధిపత్యాన్ని అనుభవిస్తున్నా ఇకపై రిలయన్స్.లాంకో, టాటాలతో పోటీమరింత పెరిగే అవకాశం ఉంది. పోటీ ఆరోగ్యకరంగా ఉండి, ఆట నియమాలను పాటిస్తూ ఆడేవాళ్ళైతే ఇబ్బందిలేదు.
మహారత్నతో తెరుచుకున్న ద్వారాలు కళ్ళకు భవిష్య ఆశాకిరణాల్ని చూపిస్తున్నాయి. ఇకపై అంతర్జాతీయవేదికపై భారతకీర్తిపతాకను ఎగరవెయ్యాల్సిన బృహత్తరబాద్యత భుజస్కందాలపై ఉంచుకుని, ప్రభుత్వరంగసంస్థగా పాటించాల్సిన నియమాలు, కాపాడుకోవాల్సిన కీర్తిప్రతిష్టలను గుర్తెరిగి ముందుకెళ్ళాలి.

లిఫ్టాట

చైతన్యా! ఓసారి ఆఫోటొగ్రాఫర్ వచ్చాడేమో చూసి, వాడిని వెంటేసుకెళ్ళి స్టోర్స్, స్టీల్‌యార్డ్, ఫాబ్రికేషన్‌యార్డ్ మొత్తం ఫోటోలు తీయించు.
అలాగేసార్
****
సార్ ఫోటొలు తీయించాను.
సరే ఓసారి డైక్ దగ్గర పనెలా జరుగుతుందో చూడవయ్యా.
ఉదయమే చూసొచ్చా సార్.
ఇందాక ఏదోప్రాబ్లెం అని రాంజీ పరిగెత్తుకెళ్ళాడు ఓసారి చూసిరా.
(ఎన్నిసార్లెళ్ళాలిరా నాయనా. కాళ్లుపీకేస్తున్నాయి.)
****
చాంబర్లోంచి బయటికొచ్చి మెట్లదగ్గరకు వెళ్తుంటే ఎదురుగా లిఫ్ట్ 'ఆఆఆ..' అని నోరు తెరుచుక్కూర్చోనుంది.
ఇంతకాలానికి చిక్కావే. నేపైకెళ్లాలి అంటె బాణం కిందకి ఉంటుంది. కిందకెళ్ళాలి అంటే పైకి చూస్తుంటావ్. నీకు నార్త్ ఇండియన్ ఫీలింగెక్కువయ్యిందే. నేను తెలుగోడిని ద్రావిడుణ్ణి అని నీ రొట్టెముక్కల బుద్దిని చూపిస్తావ్. ఈరోజు నాసేవలో తరించాల్సిందే. చచ్చినట్టు నన్ను కిందకి దింపాల్సిందే అన్నానో లేదో "స్వామిరారా!" అనిపాడింది.
లోపలికెళ్ళి 'జీ'(గ్రౌండ్ ఫ్లోర్) నొక్కానో లేదో జుయ్‌మని రెండంగుళాలు కిందకి దిగింది.
నేను "ఆ.."అంటూ పైన నెంబర్లవంక చూస్తున్నా సున్నా ఎప్పుడొస్తాదా అని.
కాళ్ళుపీకట్లేదు. (ఇదేంటి కిందకి పోతుంటే కొద్దిగా పీకాలిగా)
రెండునిముషాలైనా అది రెండేచూపిస్తోంది.
అప్పుడర్థమైంది లిఫ్ట్ చెడిందని.
కెవ్వ్... కెవ్వ్... ఒసేయ్ నామీద కసి ఇలాతీర్చుకుంటావా. ఒక్కసారి బయటకి రానీ నీపన్జెప్తా.
ఒకట్రెండుసార్లు బటన్లు నొక్కా. ప్చ్
అలారం నొక్కా..లాభంలేదు.
ఇక ఇలాకాదని సెల్ తీసి బాసుకి కొట్టా.
"ఆచైతన్యా! పనెలా సాగుతుంది? అంతాఓకేనా."
నువ్వేడ దొరికావయ్యా బాబూ. త్రిలింగదేశం నుంచొచ్చి త్రిశంకుస్వర్గంలో చిక్కుకుంటే.
"సార్! లిఫ్ట్ ఆగిపోయింది. నేలోపలిరుక్కుపోయా. ఆపరేటర్కి చెప్పండి."
ఇంతలో బిపిన్ ఫోను. "చైతన్యా! లిఫ్ట్ ఇరుక్కుపోయిందా? ఇంతకీ నువ్వు లోపలున్నావా? బయటా?"
హ్మ్. టైంస్. ఇలాంటి ప్రశ్నలు మనం వేరేవాళ్లకేస్తే ఓకే. కానీ మనకేసినప్పుడే నషాలానికంటేది.
"ఒక్కనిముషం ఆగు."
పక్కన్నుంచి బాసుగొంతు." ఈడెక్కడికిపోతే వెనకాలే నేనూ పరిగెత్తాలి. ఎవడికీరాని సమస్యలు, డౌట్లు వీడికే వస్తాయి. పాతికేళ్ళుగా వాడుతున్నాం ఆలిఫ్ట్. ఎప్పుడైనా జరిగిందా."
నాటైమ్ బాబూ. ఏంచేస్తాం.
ఓపదినిముషాల్లో తలుపుబయట గొంతులినిపిస్తునాయ్.
హమ్మయ జనాలొచ్చేశారు. ఇకటెన్షన్ వాళ్ళది. వాళ్ళచావేదోవాళ్ళు చచ్చి తలుపుతీస్తారు. ఇప్పుడు గాకపోతే మరోఅరగంటకి. మరీఆలశ్యం అయితే సైటుకెళ్ళేపని తప్పిపోతుంది. అయినా ఇలాంటప్పుడుకూడా ఒక్కడినే కాకపోతే ఎవరైనా తోడుంటే ఎంతబావుండేదో."
ఇంతలో అంతరాత్మ పైన ఎక్సాస్ట్ ఫానుమీద కూర్చుని "నోర్ముసుకోరా వెథవా. లిఫ్టాట ఆడుకోను నువ్వేమైనా డెహ్రడూన్లో ట్రైనింగ్ చేశావా? నువ్వుకొడితే మైండుబ్లాక్ అవుతుందా?" అన్నాడు.
సర్లే మరీ ఊహించుకోవడకూడా తప్పేనా.
ఇంతలో ఫోను.
"మీరు ఎక్కడ ఉన్నారుసార్?"
"లిఫ్ట్లో నాయనా. ఇంతకీ నువ్వెవరు?"
"ఆపరేటర్ని సార్. మీరు ఎక్సాట్ గా ఎక్కడున్నరో చెప్పగలరా?"
"రెండో అంతస్థు"
"అక్కడీనుంచి గ్రౌండ్ ఫ్లోర్కి లెఫ్ట్ ఎందుకెక్కారు సార్?మెట్లమీద వెళ్ళిపోవచ్చుగా."
" నాఖర్మకాలి. ఒరేయ్ నాయనా నన్ను బయటకి తెప్పించావంటే మాఫ్రెమ్డుతో చెప్పి నీకు కాల్‌సెంటర్లో ఉద్యోగం ఇప్పిస్తా. నీకదే కరక్టు. ముందు నన్నుబయటకులాగేపని చూడరా."
"సార్ మీరు బాచెలర్ హాస్టల్లో ఉంటారుకదా? రవివాళ్ళ ఎదురు బిల్డింగేకదా? మీరునాకు తెలుసుసార్."
"నీకు టెంకాయకొడతా. తలుపుతీసే పని చూడరారోయ్."
"సార్ నాదగ్గర తాళం తెరుచుకోవట్లేదుసార్. వేరేదారేదైనా చూడాలి."
"హ్మ్. టైంస్."
***
బయటినుంచి బిపిన్ "చైతన్యా. భయపడకు. తెరుస్తున్నాం. తాళం వచ్చింది."
"భయంకాదు సార్. విరక్తి పుడుతుంది. ఆతాళం పనిచెయ్యదట."
"అవును. నీకెలా తెలిసింది.
"ఇప్పుడే ఫోన్‌చేసి చెప్పాడూ ఆపరేటర్ గాడు"
"సరేలే వేరేదారేదైనా ఉందేమో చూస్తున్నాం."
"నాకుతెలిసి ఒకటేదారిసార్. పైన కప్పు ఇరగొట్టుకుని తీగెపట్టుకుని పాకుతూ రావడమే."
" అంతలేదులేగానీ నోర్మూసుక్కూర్చో. నీతెలివి ఉపయోగించకు (డోంట్ యూస్ యువర్ ఓన్ బ్రెయిన్)
ఓపని చెయ్యి. మేము బయట తలుపుల్ని లాగుతాం. లోపల తలుపుల్ని నువ్వు తెరువు. అదొక్కటే దారనిపిస్తుంది"
"అలానేసార్."
గ్రేస్కల్ నాకు శక్తినిచ్చుగాక
బయటికొచ్చి చూస్తే చంద్రయాన్ చేసొచ్చిన వ్యోమగామిని చూసేందుకొచ్చినట్టు గుంపుగా జనాలు.
"మంచినీళ్ళు తీసుకో. ఏమైనా భయపడ్డావా."
"లేదుసార్. ఏముంది పదినిముషాల్లో ఎలాగోలా తెరుస్తారుగదా."
"అతను పెద్దగా భయపడ్లేదట. అక్ఖర్లేదులే."
చూస్తే గ్లాసులో ఏదో తీసుకొచ్చిన సర్వరు వెనక్కి వెళ్ళిపోతున్నాడు.
"నువ్వుమరీ భయపడుంటావేమోనని సారు ఆపిల్‌జ్యూస్ తెమ్మనాడు. నువ్వు పకపకా నవ్వుతూఉండే సరికే పంపించేశాడు. హిహిహి."
ఇక పరామర్శలు.
"అవునూ లోపల ఏబటను నొక్కావు?"
"ఆగిపోయిందని ఎలా తెలిసింది?"
"భయమెయ్యలేదా?"
"ఎంతసేపున్నావు లోపల?" (నేనేమైనా యూరీగగారిన్నా? ఎంతసేపు అంతరిక్షంలో ఉన్నానో నోట్ చేసుకోను.)
" రోజూ తిరిగేదేగదా. ఒక్కసారిగా ఆగిపోతే ఎలా అనిపిమ్చింది?"
" అన్నట్టు నీపేరు చైతన్యనా? ఇంతకాలం నీపేరు తెలీదు." (నీఎంకమ్మారేయ్.)
" మొన్న మనద్దిరం కలిసే లిఫ్ట్లో వెళ్ళాం గుర్తుందా?"
"మొత్తానికి ఈదెబ్బతో జనాలు గుట్టుగా మెట్లపై ఎక్కిదిగుతారు. కొంతమందికి పొట్టలైనా తగ్గుతాయ్."
ఇంతలో అసలీ లిఫ్టును రిపేరుచేసి ఎన్నాళ్లయింది? ఎప్పడినుంచి వాడుతున్నారు? గతంలో వచ్చిన సమస్యలు? ఇలాఇలా వాదోపవాదాలు మొదలయ్యాయి. అవి రాయకూడదు అధికార రహస్యాలు.

ఇప్పటిదాకా ఏది జరుగుతుందని భయపడ్డానో అది జరిగిపోయింది.మావానరగుంపు వచ్చేసింది. ఇక మ్యూట్ కొట్టేసి గుట్టుగా కూర్చున్నా. ఇలాంటప్పుడు మౌనమే ఉత్తమం అని అనుభవం నేర్పిన పాఠం. పైన మీకు వివరించిన యధార్థ సంఘటనలకి మసాలాదట్టించి, మంటపుట్టించి పండగ జేస్కున్నారు పింజారీకుంకలు.

సాలగ్రామ భాండాగారం 'గండకి'

విష్ణుపాదాల వద్ద జననంతో గంగకి పవిత్రత దక్కితే అవిష్ణుమూర్తినే తనలో నింపుకుని, తనఒడ్డున ఆదికావ్యానికి పురుడుపోసి పునీతమయిన నది గండకి.

హిమాలయాల్లోని నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ముస్తాంగ్ వద్ద సముద్రమట్టానికి 3900m ఎత్తులో రెండు సెలయేళ్ళ కలయికతో జన్మించిన తర్వాత సోనేపూర్ వద్ద గంగలో కలిసేవరకూ ప్రతిమలుపులో ఓనదితో స్నేహం, కొత్తస్నేహం మొదలైన ప్రతిసారీ కొత్తపేరు. ఇదీ గండకీనది గమనం.

ఓంనమఃశివాయ సీరియల్ చూసిన వాళ్లందరికీ బృందాదేవికథ గుర్తుండే ఉంటుంది. అసురరాజు నేమికి కుమార్తెగా జన్మించిన లక్ష్మీదేవి అంశ ఈమె. జలంధరుని వివాహమాడి పాతివ్రత్య ప్రమాణాలను తు.చ.తప్పక పాటించేది. జలంధరుడు బ్రహ్మవరంతో గర్వితుడై ముల్లోకాలను పీడించుకుతినడం మొదలుపెడతాడు. బృంద పాతివ్రత్యంలోనే జలంధరుని ప్రాణం ఉంటుంది. అతని దారుణాలు సహించలేని రుద్రుడు అతనితో యుద్ధానికి దిగుతాడు. అది నిజానికి పార్వతీదేవి పాతివ్రత్యానికి, బృంద పాతివ్రత్యానికి మద్య పోరాటం. జలంధరుడు తనుగెలవాలంటే గిరితనయ పాతివ్రత్యాన్ని చెడగొట్టడం ఒక్కటే మార్గమని కొన్నిదుశ్చర్యయలకు పాల్పడుతాడు. అది సహించలేని ఆమె విష్ణువును శరణువేడగా ఆయన అభయమిచ్చి "అతను తప్పుచేశాడు గనుక యుద్ధధర్మాన్ని అనుసరించి మనకు ఆస్కారమిచ్చాడు." అని చెప్పి మాయారూపంలో బృంద దగ్గరకు వెళ్ళి పాతివ్రత్యాన్ని చెడగొట్టడంతో జలంధరుడు అంతమవుతాడు. తనభార్య లక్ష్మీఅంశకు తనద్వారా పాతివ్రత్యం పోవడమేమిటో అంతా విష్ణుమాయ. ఆపై బృందకు నిజం తెలియడంతో పాషాణం కమ్మని శపిస్తుంది. బృంద గండకీనదిగా, ఆమె శిరోజాలు తులసిగా రూపాంతరం చెందాయి. ఆమె శాపాన్ననుసరించి విష్ణుమూర్తి సాలగ్రామరూపంలో పాషాణంగానూ, రావిచెట్టులో అశ్వత్థనారాయణుడిగానూ, కృష్ణతులసిగానూ, దర్భగానూ నివశిస్తున్నాడు

ఇక ప్రస్తుత భౌగోళికాంశాలను ట్టి ఆనది ప్రవాహం-

ముస్తాంగ్ వద్ద నుప్‌చ్చు-షర్‌చ్చు అనే నదులు కలవడంతో ముస్తాంగ్‌ఖోలా అనేపేరుతో ఈనది పుడుతుంది. అక్కడినుంచి వాయువ్యదిశగా ప్రవహించి కగ్బేణి వద్ద ముక్తిథామంనుంచి వచ్చే కక్‌ఖోలాను కలడంద్వారా కాలిగండకిగా పేరుమార్చుకుంటుంది.

అక్కడినుంచి దక్షిణదిశగా ప్రవహించి ధవళగిరి-అన్నపూర్ణ శిఖరాలను దాటుతుంది. ఈరెండుశిఖరాలద్యనున్న ద్రోణి ప్రపంచంలోకెల్లా అత్యంత లోతైనది. శిఖరాలకు , నది అడుగుకు మద్యనున్న వ్యత్యాసం దాదాపూ ఆరువేలమీటర్లు.
ఇక్కడినుంచి అడుగడుగునా కొత్తస్నేహాలు కలిసినప్పుడు పలకరింపులు, కొండలు అడ్డొచ్చి పాయలుగా చీలినపుడు నిట్టూర్పులు. గళేశ్వర్ వద్ద రహుత్‌ఖోలా, బేణీవద్ద మ్యాగ్దిఖోలా, కుష్మవద్ద మోడిఖోలా, రుద్రబేణివద్ద బడిగాద్ అలాఅలా.


ఆపై తూర్పుకి తనదిశను మళ్ళించి మహాభారత పర్వతశ్రేణులకు సమాంతరంగా కొంతదూరం వెళ్తుంది. ఆపర్వతాల కనుమల్లోంచి దక్షిణంగా ఉరికి దేవఘాట్ వద్ద తనప్రియసఖి త్రిశూలిని కలుస్తుంది. ఇక్కడ నారాయణిగా మళ్లీ పేరుమారిపోతుంది. అందరిలోకి తనకు ప్రియమైనవి ఏడునదులు. అందువల్ల సప్తగండకిగా కూడా పిలుస్తారు.
ఆపై హిమాలయ పర్వతపాదంగా భావించే శివాలిక్‌పర్వతాలగుండా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఉత్తరప్రదేశ్-బీహార్ సరిహద్దుల్లోని పచ్నద్, సోన్‌ నదులతో కలిసే త్రివేణి అనేప్రాంతంవద్ద మనదేశంలోకి ప్రవేశించడం ద్వారా గండకిగా పేరు మార్చుకుంటుంది. హిమాలయాల్లోంచి తనతోడు తీసుకొచ్చిన ఒండ్రును ఇక్కడ జారవిడవడంద్వారా అత్యంతసారవంతమైన భూములు ఏర్పడ్దాయి. బీహార్లోని చాంపరన్, సారంగ్, ముజఫర్‌పూర్ జిల్లాలద్వారా ప్రవహించి పాట్నా సమీపంలోని సోనేపూర్ వద్ద గంగతో సంగమిస్తుంది.

హిమాలయాల్లోని వెయ్యికిపైగా హిమానీనదాల్లోచి, ఇతరసరస్సుల్లోంచి లభించేనీటితో ఈనది ప్రవహిస్తుంది. ప్రవాహమంతా అత్యంతవాలైన పర్వతసానువుల్లోంచి కావడంతో హోరున ఉరకల పరుగులతో సాగుతుంది. అందువల్ల ఈనది వర్తక-వాణిజ్యాలకుగానీ, జలరవాణాకుగానీ పెద్దగా సహకరించదు. ఈరకమైన ప్రవాహం జలవిద్యుత్తుకు ఎంతో అనుకూలమైనది. అయినప్పటికీ మహాభారతశ్రేణుల్లోని ఒకప్రాజెక్టుతప్ప పూర్తిస్థాయిలో ఈనదిని ఉపయోగించుకునే దిశగా ప్రణాళికలు చెయ్యలేదు. మొత్తం 21000MW విద్యుదుత్పత్తికి అవకాశం ఉండగా ఇప్పటివరకు నెలకొల్పింది కేవలం 600MW. బహుశా నేపాల్ ఆర్థికస్ఠితి అందుకు కారణం అయ్యుండొచ్చు. అంతర్జాతీయ నదీజలాల ఒప్పందాలను అనుసరిమ్చి భారత్- నేపాల్ ప్రభుత్వాలు కొన్ని ఉమ్మడిప్రణాళికలు రూపొందించాయి.

నదుల అనుసంధానం ప్రాజెక్టులో ఈనది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. గంగ-బ్రహ్మపుత్ర్రనదుల మద్యభాగంలోని నదులను కలిపేప్రక్రియలొ మొదట కోసినదిని గండకీనదికి అనుసంధానం చెయ్యడం, ఆపై గండకీనదిని భారతదేశంలో ప్రవేశించేచోట బారేజిని నిర్మించి ప్రస్తుతం గంగతోకలిసే చోటుకు ఎగువన ఉత్తరప్రదేశ్లో కలిసేలా ఏర్పాటుచెయ్యలని ప్రణాళికలు చేశారు.

గండకీ ప్రవహించే హిమాలయప్రాంతం ఉపఖండామంతా విస్తరించి ఉన్నభారత టెక్టోనిక్ ప్లేటుకు, మిగతా ఆసియా మరియు యూరోపులో విస్తరించి ఉన్న యురేసియాప్లేటుకు మద్యన ఉంటుంది. వీటి కదలికల మూలంగా ఇక్కడి భూమిపొరల్లో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆఒత్తిడే హిమాలయాలు ఉద్భవించేందుకు దోహదపడ్డాయి. అందువల్ల భూస్థిరత్వం తక్కువ. అన్నపూర్ణ-ధవళగిరి మద్యన ఉన్న అత్యంతలోతైన అగాధానికి కారణంకూడా అదే. ఒత్తిడివల్ల హిమాలయాలు పెరిగినప్పటికీ వాటిపొరలు ధృడంగా లేకపోవడంతో నదిప్రవాహానికి కోసుకుపోయి అగాధాలు ఏర్పడ్డాయి. (ఒకచిన్న ఇసుకగుట్టను చేసి, దానిపైనుంచి నీటిని పోస్తే నీరు ప్రవహించే మార్గంలో ఇసుకంతా కోసుకుపోయి దారులేర్పడతాయి. అదేవిధంగా) అస్థిరమైన భూగర్భం, ప్రవాహవేగాన్ని తట్టుకునేందుకు కావల్సినంత దృడత్వంలేని పైపొరలవల్ల నదీగమనం విపరీతమైన మార్పులకు గురవుతూ వచ్చింది. గండకీమార్గం దాదాపూ ఎనభైకిలోమీటర్లు తూర్పుదిశలో జరిగింది.


ఈనదిలో దొరికే సాలగ్రామశిలలు అత్యంత పవిత్రమైనవి. వజ్రకీటమనే జీవి తనపంటితో తొలుస్తూ అందులోచేరి నివశిస్తుంది. ఆక్రమంలో వాటిపై శంకుచక్రాలు ఏర్పడుతాయి. ఈశిలలు నిజానికి సముద్రం అడుగున ఉంటాయి. మరి అంతెత్తున ఉన్న ముక్తిథామానికి ఎలా చేరుకున్నాయంటే- హిమాలయాలు ఏర్పడకముందే ఈశిలలు(అమ్మోనైట్ శిలలు) ఏర్పడ్డాయి. అప్పట్లో సముద్రమట్టానికన్నా లోతుగా ఉండేది ఈప్రాంతం. హిమాలయాలు ఎదగడంతో వాటితోపాటు ఇవీకొండెక్కాయి. ఈనది, సాలగ్రామాలు ఎంతపురాతనమో దాన్నిబట్టి అంచనావేసుకోవచ్చు. సాలగ్రామశిలలను హిందువులేగాక బౌద్ధులు సైతం పవిత్రమైనవిగా భావిస్తారు. వాళ్ళు చుమిగ్గ్యస్త (అంటే నూరుతీర్థాలు కలది అని అర్థం) అని పిలుస్తారు. ముక్తిధామం కేవలం హిందువులకేకాక బౌద్ధులకూ అత్యంతపవిత్రమైనది.

ఈనది ఒడ్డునే వాల్మీకిముని ఆశ్రమం ఉంది. ఆయన ఇక్కడే రామాయణాన్ని రచింఛాడని నమ్మకం. (తెలుగువాళ్ళు అక్కడికెళ్తే "ఇది మనఆశ్రమము ఇచట నీవు వశింపుము లోకపావనీ.." అని నాగయ్య శైలిలో పాడుకోవచ్చు.) చితావనం అనేప్రాంతంలో వన్యప్రాణి సంరక్షణకేంద్రం ఉంది. ఆర్యులు చాలాకాలం గండకీనదిని దాటి అవతలకు పోలేకపొయ్యేవాళ్ళు. ఆప్రవాహ ఉదృతికి తట్టుకుని అవతలకు చేరాలంటే అగ్నిని ఆవాహనం చేసుకోవడమే మార్గమని తలచి ఈప్రాంతాన్ని అగ్నికి సమర్పించారట. ఇవేగాక అనేక పర్యాటకస్థలాలు, వనాలు, పుణ్యక్షేత్రాలతొ ఈనది పరీవాహక ప్రాంతమంతా జీవంనింపుకుని ఉంటుంది. అనేకసాహసక్రీడలకు ఇది మంచిప్రదేశం.

విష్ణుమూర్తినే తనలో దాచుకున్న గండకి చివరకు ఆవిష్ణు పాదాలవద్ద పుట్టిన గంగలో మమేకమవడం విష్ణుమాయగాక ఇంకేమిటి?

ధనుర్మాసం సందర్భంగా ఈనది గురించి నాకు తెలిసిన విషయాలు రాశాను. ఇందులో తప్పులున్న తెలుపగలరు.
ఈరోజు మాఇంట్లో రెండు పండగలు. ఒకటి ధనుర్మాసం ఆరంభం. రెండు మాచెల్లి పుట్టినరోజు. పెళ్లయ్యాక మాబావ గరుడవాహనమెక్కించుకుని అమెరికాకి వెళ్ళడంతో ఇక్కడనుంచే పుట్టినరోజు జేజేలు బుజ్జిపాపాయి అని పాడేశా స్కైపులో. ఈటపా మాచెల్లి (మామిడిపూడి) ఉడాలి లక్ష్మిస్రవంతి కోసం.

ప్రతినిథులు

అబ్బబ్బా రోజుకి ముప్పై బహిర్గామి, ఎనభై అంతర్గామి పిలుపుల దెబ్బకి నాచెవుల తుప్పు ఒదిలిపోయింది. అదేమిటో ఈసింగ్రౌలీలో అడుగుపెట్టిన క్షణమెలాంటిదో తెలీదుగానీ ఏప్రిల్లో ఈడకొచ్చిన కాడనుంచి ఆడ జరిగే నాటకీయపరిణామాలపై చర్చించేందుకు సరైజోడీ దొరక్క నేనుపడుతున్నపాట్లు పగోడిగ్గూడా వద్దురా నాయనా.

తెలంగాణా దాదాపూ వచ్చేసినట్లే అని డిసైడైపోతే 'భిన్నత్వంలో ఏకత్వాన్ని' నిరూపించేంచుదుకు నాయకులంతా త్యాగాలకు రెడీ అయిపొయినారు. పర్లేదు ఆరేళ్ళుగా 'త్యాగమయి‌' మంచిస్పూర్తినే ఇచ్చింది. పదవుల్ని 'థూ!నాబొడ్డు' అని వదిలేస్తుంటే "పర్లేదురా మనోళ్ళు ఓటేసి గెలిపించినోళ్ళు మరీ అంత ఎదవలుకాదులే." అనుకున్నా. ఇక్కడే నాలోని అల్పజ్ఞాని బయటపడ్డాడు. ఈడ జరుగుతున్న యవ్వారాలు చూస్తే నెమ్మదిగా జ్ఞానోదయం అవుతూ ఉంది.

ఈరాష్ట్రంలో తెలంగాణా కావాలనేటోళ్ళు వద్దనేటోళ్ళు మొత్తంకలిపితే ముప్పైశాతం కూడా ఉండరు. మిగతా డెబ్బైమంది స్థితప్రజ్ఞులు( వీళ్లనే తటస్థులు అనొచ్చు). వీళ్ళకి ఎవరుచేసేది కరక్టుగా ఉంటే వాళ్లకి సపోర్ట్ ఇస్తారు. తెలంగాణాలో గొడవలు చేసినప్పుడు "ఇప్పుడింత కొట్టుకోవాల్సిన అవసరమేంది. కలిసుంటే ఏందంట ఇబ్బంది? సరే మరీ అంతలా అడుగుతుంటే ఇచ్చేస్తేపోలా." అనుకున్నోళ్ళు. తెలంగాణా ఇచ్చేయ్యండహే అనేఓడు మిగతాప్రాంతాల్లో ఉన్నారు. కలిసుంటే ఏందట ఇబ్బంది అనేఓళ్ళు తెలంగాణాలోనూ ఉన్నారు. కాకపోతే వీళ్ళు టీవీరామాయణంలో శతృజ్ఞుడిపాత్ర. పార్టీలు, మీడియా చివరికి మిగతాజనాలుకూడా వీళ్లని పట్టించుకోరు. అంటే సగటుపౌరుడన్నమాట.

మలపత్రాష్టుడు ఆమ‌'రణ‌' దీక్షతో "పరబ్రహ్మ.."పాడటంతో నాటకానికి తెరలేచింది.
నాయకులంతా పోస్టుమ్యానుల్లాగా "నీదేఊరు?" అంటూ చిరునామా అడిగిమరీ దాడిచెయ్యటంతో ఇది కిష్కిందాకాండా? యుద్ధకాండా? అర్థంకాక తలగోక్కున్నారు జనాలు. (నాకోడౌటు. అలాకొట్టించుకుణ్ణోళ్ళలో ఒక్కడైనా రియల్టర్‌గానీ, నాయకుడుగానీ కనీసం వాళ్ళచెంచాగాళ్ళైనా ఉన్నారా?)

సీనుకట్ చేస్తే...ఓవర్‌టూ డిల్లీ.
అమ్మ లెక్కలేయటం మొదలుపెట్టింది. కోస్తే ఎంత? కోయకపోతే ఎంత? మరగుజ్జులు లెక్కలేసిచ్చారు.

చిదంబరం అర్థరాత్రి అంగళ్లన్నీ మూసేసున్నా తిరిగితిరిగి రెండు నిప్పోబాటరీలు(నెల్లూర్లో తయారుచేసినాటివి) సంపాదించి రిమోట్లోవేసి అమ్మకిచ్చాడు. అసలే త్యాగమయి కదా బక్కోడి (ముక్కోడు) త్యాగాలకి ఫ్లూయిడ్లా కరిగిపోయి మీటనొక్కింది. పాపం షార్ట్ సర్క్యూట్ కొట్టింది. డామిట్! కథ అడ్డం తిరిగింది.

ఇక్కడే ప్రేక్షకులు సారీ! ప్రతినిథులు చేంజ్ కోరుకున్నారు.
రాజీనామలిచ్చేశారు. వీళ్ల అభిప్రాయాల్ని చెప్పేసినారు
కేసీఆర్‌ గొడవచేస్తున్నంతసేపు "ఆడంతయెదవా. ఇంతెదవా"అంటూ అరిచినోళ్ళ బుర్రలు ఎక్కడికెళ్ళాయో అర్థంకావట్లేదు. విడిపోదాం అన్నోడు గొడవచేశాడు, ఆస్థులు తగలబెట్టాడు అంటే అర్థం ఉంది. 'సమైక్యత‌' అనేటోళ్లకి గొడవలుచెయ్యాల్సిన అవసరం ఏంది?ఇదిఏరకంగా తెలంగాణావాళ్లకి కలిసిబతుకుదామనే భావన కలిగేలా చేస్తుంది? అంటే వాళ్ళు ఇతరులతో కలిసేబతకాలి కానీ ఇతరులకి కష్టం కలిగించేది ఏదైనా జరిగితే అదిరించో బెదిరించొ దారిలోకి తెచ్చుకుంటాం. ఈరకమైన సందేశాన్ని తెలంగాణాప్రజలకు పంపడం ఎంతవరకు సమంజసం? రాజీనామాలివ్వడం ద్వారా నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పేశాక ఈరాద్ధాంతం ఎందుకు?

అడుగడుగునా బాద్యతారాహిత్యం. కేసీఆర్ గొడవచేస్తే తెలంగాణా ఇస్తాం అని, అటుపై ఆంద్ర-సీమవాళ్లు గొడవచేస్తే గమ్ముగాఉండిపోవడం. అంటే కేసీఆర్ గొడవలేపకుంటే తెలంగాణా ఎంత వెనకబడిపోయినా పట్టించుకోనవసరంలేదు. నాయకులనుంచి వ్యతిరేకత రాకుండా ఉండుంటే ఆఆలోచన ఎంతక్రూరమైనదైనా ఒప్పుకోనుండేవాళ్ళు. అంటే ప్రజలకు ఏదిమంచో-ఏదిచెడొ చెప్పలేని స్థితిలో ఉన్నదా డిల్లీప్రభుత్వం? ప్రజలకేది మంచిదో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన బాద్యతలేదా? పార్టీకి-ప్రభుత్వానికి మద్యన సన్నని విభజనరేఖ ఉంటుంది. ఇదేమైనా పార్టీ అంతర్గతవ్యవహారమా ప్రభుత్వంలో ఎలాంటి పదవిలోనూ లేనివ్యక్తి చేత వ్యవహారం నడిపించేందుకు. కనీసం అందుకు ఎన్నుకున్నతను తటస్తుడా అంటే కాదు. నాకేమిటట అనుకునేరకం. కోతులకు పిల్లి మద్యస్థంలా జరిపించాడు.
నాటకానికి ఇంటర్వెల్ పడేసమయానికి క్లైమాక్స్ తెలిసిపోయింది.

ఈప్రజాప్రతినిథులంతా ఎవరికి ప్రాతినిద్యం వహిస్తున్నారంటారు.
రోశయ్య- బిళ్లలేని బంట్రోతుగా అమ్మకి ప్రతినిథి. ఆయనేమీ మాట్లాడకుండా గుట్టుగా కూర్చున్నా బావుండేది. ఏదోపెద్దాయన అనుకునేవాళ్లం. 'నిమిత్తమాత్రుణ్ణి‌' అనటమెందుకు.
కేసీఆర్- రాజకీయ నిరుద్యోగులకు ప్రతినిథి.
లగడపాటి- పెట్టుబడిదారులకు ప్రతినిథి.

వాళ్లవాళ్ల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకి ప్రజలమద్య చిచ్చుపెడుతున్నారు. సంబంధాలు చెడిన తర్వాత కలిసిబతకడంలో అర్థమేమిటి? అంటే డిల్లీవాళ్లకి (కాంగ్రెస్సేకాదు. ఏప్రభుత్వమైనా) విడగొడితేనే రాజకీయభవిష్యత్తు అనుకున్నరోజు ఏకేసీఆరూ అవసరంలేదు. కేక్ కోసేస్తారు. వీళ్లని నమ్ముకుని కలసుండటం అంటే కుక్కతోక- గోదారే. ఒక్కటిమాత్రం నిజం. వ్యక్తులస్వార్థానికి ప్రాంతాలమద్య అగాథాలు ఏర్పడ్డాయి. ఇప్పట్లో ఆఅగాథంపూడే అవకాశాలు మృగ్యం.
ఇప్పటికీ నేచెప్పేదొకటే -" తెలుగోడా కలిసే ఉందాం. కారణాలు అడగొద్దు. నేచెప్పలేను."

కలిసే ఉందాం

తెలంగాణా- హైస్కూల్లో చదువుకునే రోజుల్లో విన్నా మొదటిసారి ఈపదం. అప్పుడు మాసారు చెప్పాడు మనరాష్ట్రంలో మూడుప్రాంతలురా అబ్బయ్యా. కోస్తా, తెలంగాణా మరియు రాయలసీమ అని ఉన్నాయి అని మాపులో చూపెట్టాడు. ఆతరవాత మనం అరవోడినుంచి రాష్ట్రాన్ని ఎలా సాథించుకుంది తెలిసొచ్చింది. మనపుణ్యమాని మరిపదిభాషలకి సొంతగూళ్ళు ఏర్పడ్డాయి. ఇక్కడదాకా కథబానే ఉంది. మిగతాది మనకందరికీ తెలిసిందే. కాకపోతే నాకు చిన్న అనుమానాలున్నాయి. సందేహ నివృత్తి చెయ్యగలరా?


ప్రత్యేకరాష్ట్రం అడిగారు బానే ఉంది. మద్యలో పొట్టిశ్రీరాములు ఏమిచేశాడు? ఆయనని ఎందుకు కించపరచడం? ఆయన నిరాహారదీక్షని శాంతియుతంగానే చేశాడు. కాంగ్రెస్సువాడయినా అథిష్టానానికి భయపడలేదు. అన్నింటికీమించి తెలుగోళ్లకి ఏమికావాలో చెప్పాడే తప్ప తమిళుడిని పల్లెత్తుమాటన్న దాకలాలు లేవు. ఆయన చనిఫొయాకే గొప్పతనం తెలిసొచ్చింది జనాలకి. ఆతర్వాతే విగ్రహాలు వెలిశాయి. ఇవేవీ ఆయన బతుకున్నప్పుడు కోరుకుందికాదు. ఆయనచేసిన పోరాటం 'విశాలాంద్ర‌' కొరకే తప్ప తెలంగాణా విలీనం కోసంకాదు. ఆంద్రరాష్ట్రం ఆంద్రప్రదేశ్‌గా మారింది ఆయనపోయిన తర్వాత కొన్నేళ్ళకి. మరి ఆయనపై ఎందుకు ద్వేషం?


తెలంగాణా ఆంద్రలో విలీనంకాకముందు ఏంత అభివృద్ధిని సాథించింది? అక్కడికెళ్ళి ఇతరులు బాగుపడ్డారు. ఇదినిజం. మరీ అంత అసూయైతే ఎలా? ఏమి వేరేప్రాంతాలకి వెళ్ళినోళ్ళు బాగుపడకూడదా? తెలంగాణానుంచి నాగపూరు, ముంబాయికి వెళ్ళి వ్యాపారాలు చేసేవాళ్ళెంతమంది? బెంగుళూరులో ఉద్యోగాలుచేసేవాళ్లలో తెలంగాణావాళ్ళు లేరా? ఆప్రాంతం వెనకబాటుతనానికి వేరెవరోకాదు అక్కడి భూస్వామ్యవ్యవస్థే కారణం. వాళ్లు అటు మద్యతరగతివాళ్ళను ఎదగనీకుండాచేసి ఇంకోపక్క కోట్లలో పన్ను, లక్షల్లో బిల్లులు ఎగవేసి పబ్బం గడుపుకున్నారు. దానికి సామాన్యుడు బలయ్యాడు. తొంభైలకి ముందు అక్కడ సక్రమంగా బిల్లులు కట్టేవాళ్ళేంతమంది? ఇది నేను(కోస్తావాడిని) చెప్పేదికాదు. కరీంనగర్లో పుట్టిపెరిగిన నాస్నేహితుడు చెప్పిన కారణం.

.
తెలంగాణా ఎదగగలేదన్నది నిజం. కానీ దానికి ఈతరప్రాంతాలవాళ్లని బాద్యుల్ని చెయ్యడమేంటి? ఎంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు కాలేదు. మనతెలుగోడని గర్వంగా చెప్పుకునే పీవీకూడా ఈప్రాంతంవాడెకదా?(ఆయన్ని కేసీఆర్ కలిసినప్పుడు అంతగా స్పందించలేదని విన్నా అప్పట్లో)


కేసీఆర్ని తిడితే తెలంగాణాని తిట్టినట్లా? వైఎస్నో, బాబునో చివరికి మన్మోహన్ని తిట్టినా ఒకరాజకీయ నాయకుడిని తిట్టినట్లు. కానీ అదేంచిత్రమో కేసీఆర్ దగ్గరికొస్తే మేటర్ మారిపోద్ది. నిజానికి ఉద్యమానికి కేసీఆర్ ఒకగుదిబండ. రాజకీయంగా నెగ్గుకురాలేక ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న నీచుడు. వాడివల్ల నష్టపోయినోడు తెలంగాణావిద్యార్థే కదా? అలాంటప్పుడు కనీసం మాటమాత్రానికైనా మంచిచెప్పాలి కదా? చోద్యంచూస్తూ వాళ్లని వాడుకున్నాడు. ఎవడండీ ఈరోజుల్లో చదువులు పక్కనపెట్టి ఉద్యమాలంటూ తిరిగేది? ఎవడి ఒత్తిళ్ళు వాడివి. ఎవడిపోటీ వాడిది. ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణా వేరు. కేసీఆర్ వేరు. తెలంగాణా కేసీఆర్ మీద ఆథారపడలేదు. కేసీఆరే తెలంగాణాపై ఆధారపడ్డాడు.


విడిపోతాం అనుకున్నోళ్ళు విడిపోండి. దానికోసం ఇతరులపై బురదజల్లడం ఎందుకు? మద్రాసునుంచి ఇక్కడికొచ్చారు మీకోస్తావాళ్ళు అంటుంటారు కొంతమంది. అవును ఎక్కడ అవకాశాలుంటె అక్కడికొస్తాం. హైదరాబాదుకెలా వెళ్తున్నారో బెంగుళూరు, నోయిడా, గుర్గావ్ కీ అలానేవెళ్తున్నారు. కాకపోతే సమస్య ఎక్కడొచ్చిందంటే ఈసమస్య గురించి ఎవడు మాట్లాడినా వాళ్లవాళ్ళ లాభనష్తాలకు అనుగుణంగానే మాట్లడుతారు. కోస్తావాళ్లయినా, సీమవాళ్లైనా చివరికి తెలంగాణావాళ్ళయినా. ఎవడూ గతిలేక రావట్లేదు అక్కడికి.


అక్కడ అవకాశాలు సృష్టించిమ్దెవరు? ఇదినేను వాదించడానికో తగువులాటకో కాదు.వాదించుకునేందుకు రెండుపక్కలా బలమైన పాయింట్లు ఉంటాయి.లేకుండే ఇవ్వాలా వద్దా అన్న విషయంపై ఇంతనాన్చుడు జరగదు.
తెలంగాణా కావలనుకున్న వాళ్లకి తెలుగుతల్లి విగ్రహాలతో, గీతాలతో ఏం పని? వాటిలో ఎక్కడైనా తెలంగాణాని తక్కువచేసి చూపారా? ఉమ్మడి మద్రాసురాష్ట్రం నుంచి విడిపోయేప్పుడు తమిళభాషని, అక్కడి సంస్కృతిని ఎవడూ హేళనచెయ్యలేదే? మనకేమి కావాలో అడగడంలో ఒక పద్దతి ఉంటుంది. ఆపద్దతి తెలీని మూర్ఖులచేతిలోకి ఉద్యమం పోవడమే ఈవిషసంస్కృతికి మూలకారణం. వీళ్లచేతిలో తెలంగాణా ఉంటె ప్రత్యేకరాష్ట్రమైన తర్వాత దానికి ఒరిగేది శూన్యమే.




తెలంగాణాకు మించిన కరువు రాయలసీమలో ఉంది. ఉత్తరంద్రలోనూ అదేస్థితి. నెల్లూరు,ప్రకాశాలు పర్వాలేదు. అంతకుమించి కోస్తాలో ఇరగదీసేంత అభివృద్దేమీ లేదు. అసలీ గందరగోళానికి మూలకారణం కృష్ణా, గుంటూరోళ్ల నోటిజిలే కారణం. ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదినిజం. ఇక తెలుగు అనే విషయానికొస్తే నిజంగా తెలంగాణావాళ్లంత భాషాభిమానులు ఉండరు. మనఊళ్ళలోకి ఇంగ్లీషుమీడియమొచ్చి ఎన్నేళ్ళయింది. ఈమద్యలో మనభాషెంత మారింది? మరి శతాబ్దాలుగా నిజాంహుకుం మద్యన ఉర్దూలోనూ చదువుతూకూడా అక్కడ తెలుగుబట్ట కడుతుందంటే ఎవడిగొప్ప.
చివరిగా- " తెలుగోడా కలిసే ఉందాం. కారణాలు అడగొద్దు. నేచెప్పలేను."

గీతాసారం




ఈభూమిని కొందరు పుణ్యభూమి అంటే మరికొందరు కర్మభూమి అంటారు. ఇంకొందరు ధర్మభూమి అంటారు. శాస్త్రాలకు పురిటిగడ్డగా కొనియాడుతారు. ఈగడ్డపై ధర్మానికి శాస్త్రం పుట్టింది, అర్థానికి శాస్త్రం పుట్టింది, మోక్షానికి శాస్త్రం పుట్టింది, కామానికి శాస్త్రం పుట్టింది. అద్భుతమైన వైద్యశాస్త్ర గ్రంధాన్ని చేతికిచ్చి చదువుకో అంటే రోగికి వ్యాధి నయంకాదు. నిపుణుడైన వైద్యుని పర్యవేక్షణే మార్గం. అలానే శాస్త్రాలు అరిగించుకుని పరమపథం చేరేలా మార్గదర్శనం చెయ్యడానికి పురుషోత్తముని గొంతునుంచి ఉద్భవించిన అమృతకలశం ఈభూమిని పునీతంచేసింది.

ఈసారి అమృతంకోసం సాగరాన్ని కాక విజయుని సహస్రారాన్ని వేదికగా చేసుకున్నాడు. అతనిమనసులో యుద్ధబీతి అనే హాలాహలం ఉద్భవించే వరకు వేచిచూశాడు. కాకపోతే ఒకచిన్నతేడా. మొదటిసారి అమృతభాండం ప్రాణంభయంతో పొందింది కాబట్టి పంచడంలో పక్షపాతం అవసరమైంది. కానీ ఇప్పుడు ఉద్భవించింది తనబిడ్డలకు మార్గాన్ని చూపేందుకు. కాబట్టి సమానంగా పంచాడు. ఈకలశం చేసే హితం కేవలం హిందువులకో, ఉపఖండవాసులకో, లేక మనుషులకో కాదు. సమస్థ చరాచరసృష్టికి.


యుగాలుమారినా తన స్వయంప్రకాశంలో చిటికెడైనా తరుగులేకుండా చీకటిని పారద్రోలేందుకు అనుష్టుప్ రూపంలో వెలుగుతూనేఉంది. ఎలాంటి గందరగోళం సృష్టించకుండా, పాటించాల్సిన ధర్మాన్ని- నడవవల్సిన మార్గాన్ని అతితక్కువ నిడవిలో తెలియజేస్తూ ఋజుమార్గంలో నడుస్తూ నడిపిస్తూ ఉంది.


ఆకలశంలోంచి కొన్నిచుక్కలు మనగొంతులో పోసేందుకు ఎందరోమహానుభావులు కృషిగావించారు. ఇటీవలికాలంలో శ్రీశ్రీశ్రీ విద్యా ప్రకాశానందగిరిస్వామి గారు దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి కేంద్రంగా నెలకొల్పిన శుకబ్రహ్మాశ్రమం ద్వారా మానవాళికి గీతాసారాన్ని అందించారు.

గీతా సారం:

* ఏమి జరిగిందో, అది బాగా జరిగింది.
* ఏమి జరుగుతోందో, అది బాగా జరుగుతోంది.
* ఏమి జరగబోతోందో, అది కూడా బాగానే జరగబోతోంది.
* నీది ఏది పోయింది, ఎందుకు నీవు బాధ పడుతున్నావు?
* నీవు ఏమి తెచ్చావని,
* అది పోయిందని బాధ పడుతున్నావు?
* నీవు ఏమి సృష్టించావని అది నష్టపోయిందనడానికి?
* నీవు ఏమి తీసుకున్నావో, ఇక్కడ నుంచే తీసుకున్నావు.
* నీవు ఏమి ఇచ్చావో, ఇక్కడనే ఇచ్చావు.
* ఈవేళ ఏది నీదో, అది న్నిన్న ఎవరిదో మరెవరిదో అయిపోతుంది.
* పరివర్తన సంసారం యొక్క నియమం

కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన
మాకర్మఫలహేతుర్భూః మాతే సంగోస్త్వకర్మణి

ఈరోజు మద్యాహ్నం తృష్ణక్క 'గీతాసారం' మెయిల్ చేసేంతవరకు ఈరోజు గీతాజయంతి అన్నసంగతి గుర్తులేదు. ఈసందర్భంగా టపారాసేందుకు కుదరట్లేదని, తన తరపున నన్నుపెట్టమని చెప్పిమ్ది. ఇప్పటికి తీరింది టపారాసేందుకు. ఈటపా స్వర్ణముఖిలో పబ్లిష్ అయినప్పటికీ తృష్ణ టపాగా భావించగలరు.

శ్రీమద్రమారమణ గోవిందో హారి!

శబరి ఎంగిలి ఆరాముడు ఒక్కసారి తింటే మారాముడుమాత్రం మాఎంగిలి ప్రతివారం తినేవాడు.
మాతాతకి (అమ్మనాన్న) ఆయన తండ్రిద్వారా రామమందిరంలో అర్చకత్వం లభించింది. దాంట్లో నాచిన్నప్పుడు ప్రతిశనివారం భజన అనే బృహత్తరకార్యక్రమం జరిగేది. ఆభజనకి మాతాత, వెంకట్రామశెట్టీ (హార్మోనియం), సుబ్బులుశెట్టి (మృదంగం), ఇంకా బ్యాంకు మస్తానయ్య, పాలశివయ్య, చెంచయ్య ఇలా ప్రత్యేక ఆహ్వానితులు. అక్కడ తాళాలు ( అంటే గొళ్లెంపెట్టేవి కాదు. అదొక వాద్యం) వాయించాలంటే సీనియారిటీ ఉండాలి. మనలాంటి పిల్లబ్యాచీకి దొరకవు. వాటిపక్క "ఆ..!" అంటూ చూసుకుంటూ చేతులతోనే కొట్టుకునేవాళ్లం.మరోవిషయం ఏవిటంటే పాడేవాళ్లకి కొన్నిపాటలపై పేటేంటుహక్కులు ఉంటాయి. వాటిని వారికే సొంతమైన హావభావాలను చూపిస్తూ, గమకాలను ఇరికిస్తూ, కొన్నిలైన్లను మళ్లీమళ్లీ పాడుతూ అంటే రామదాసు కీర్తనల్లో "యెవడబ్బా సొమ్మని రామచంద్రా!" అని తిట్టి తరువాత సముదాయించడం, "ఉన్నావా? అసలున్నావా?.. " అని ఆయన ఉనికినే ప్రశ్నించడంలాంటివి. వాటిని వేరేవాళ్లెవరైనా పాడితే మనోభావాలు దెబ్బతింటాయి. కొన్నిసార్లు ఈతగాదాలు తీర్చేందుకు అయోద్యనుంచి అయ్యవారే దిగివచ్చేలా సాగేవి.

అన్నిపాటల్లోకి మనకు బాగా నచ్చేది "పవమాన సుతుడుపట్టు పాదారవిందమునకు నీనామరూపమునకు నిత్యజయమంగళం...సాకేతపురనివాస ..ప్రహ్లాదనారదాది భక్తూలు పొగడుచున్న నీనామరూపమునకు నిత్యజయమంగళం." ఎందుకంటే ఈమంగళంపాడితే తర్వాత ప్రసాదాలే. మరి భజన అన్నపదం వింటే బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రసాదం అనే పదం వినపడుతుంది కదా.

శనివారం సాయంత్రం దాన్ని తయారుచేసే పని అమ్మమ్మది. మొదట్లో అలసందులు ఉడికించేది. భలే ఉండేవి. కానీ తర్వాత గుగ్గిళ్లకి మెనూ మార్చేశారు. ఆరాముడేమో ఏదిపెట్టినా ఫీలవ్వడు. కానీ *తోకలేని*వాడిని నాబాధ ఎవ్వడికి చెప్పుకోను. రాత్రి ఎనిమిదికి మొదలవ్వుతుంది భజన. ఈప్రసాదం మాత్రం ఆరోగంటకల్లా పూర్తయి "వారాయ్..!" అని పిలుస్తూ ఉంటుంది. తాతేమో దానిపక్క చూసినా ఒప్పుకోడు. కానీ హోమ్‌మినిష్టర్ మాత్రం రాజ్యాంగ సవరణలు పెడుతుంది. ఆయనకాదనడు. లేడు. అంటే ఇక హోంరూల్ వచ్చేస్తుంది.

ఇక్కడ అమ్మమ్మగురించి కొద్దిగా వివరించడానికి ప్రయత్నిస్తా. (చిన్న ప్రయత్నం మాత్రమే.) భారతదేశంలో పిల్లలహక్కుల గురించి పోరాడేవాళ్లు, వాళ్లగురించి రాసేవాళ్లు ఈవిడని పట్టించుకోలేదు అనిపిస్తుంది నాకు. పిల్లలకు పెద్దలకు తేడా చూపకుండా అందరికీ చిక్కటి కాఫీనే ఇస్తుంది. ఈఒక్కటి చాలనుకుంటా మీకు. ఆమె ఉద్దేశ్యంలో పిల్లాడు పదోఏడు వచ్చేవరకు చదువులు, పలక-బలపం, హోంవర్కు ఇలాటివి ఆలోచించకూడదు. అప్పటివరకు కడుపునిండా పాలుతాగి. కంటినిండా నిద్రపొయ్యి రోజులో ఇంకా గంటో అరగంటో మిగిలితే ఊరిమీద ఊరేగాలి. ఇలా పదేళ్లు గడిపిన తర్వాత ఇకచాలు అని పిల్లవాడు స్వచ్చందంగా ఒప్పుకుంటే అప్పుడు బడికి పంపాలి. ఒకవేళవాడు కాదుకూడదు అంటే వాడు ఒప్పుకునేంత వరకు బలవంత పెట్టకూడదు. బాలకార్మికవ్యవస్థనైనా ఒప్పుకుంటుంది కానీ బాలవిధ్యావ్యవస్థను ఉపేక్షించలేదు.
ఇలాంటి మహామనీషి నేను అలా ప్రసాదం (సారీ అప్పుడది నైవేద్యం. పూజయినాకే ప్రసాదంగా మారుతుంది.) వంక చూస్తుంటే తట్టుకోగలదా. తాత అలా బయటికి వెళ్ళడంతోటే నాకోగిన్నెలో పోసి "తొందరగా కానీరా." అనేసి వెళ్లిపోయేది తలుపు దగ్గరికి. ఆసమయానికి నాఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్లకీ ఓపిడికెడు.
అలా అలా వారాలు దొర్లిపోతుంటే ఒకబలహీన సమయంలో తాత కంటపడింది ఈదృశ్యం. " సాయంత్రం అనంగా నేను చేస్తే రాత్రి ఎనిమిది దాకా మొదలు పెట్టరు. ఆతర్వాత ఒకటిన్నరగంటకి మీభజనలు పూర్తయితే అప్పటిదాకా అలమటించాలా పిలకాయలు. వీళ్లని పస్తుంచి ఆయనకి పెట్టమన్నాడా ఆరాముడు. (పాపం తాతకి రాముడితో డైరెక్టు కాంటాక్ట్స్ లేవు. ఆయన అభిప్రాయం కనుక్కుందాం అంటే.) మీరూ మీభజనలూ. దానికి మళ్లీప్రసాదాలూ. అవి తాక్కూడదని పిల్లలకి పస్తులూ.... " ఇలా ఇంకా ఏవేవో న్యాయపరమైన, ధర్మసకంటం కలిగింఛే ప్రశ్నలు వదిలేసరికే తాత మ్యూట్ బటను నొక్కేశాడు.

ఇక కార్తీకమాసం వస్తే మొదలయ్యే సీజను అక్కడినుంచి స్వాములు ఇరుముడికట్టుకుని బస్సెక్కేదాకా ఉంటుంది. మొదట్లో ఈభజనలుకూడా మామందిరంలోనే జరిగేవి. తర్వాత హౌస్‌ఫుల్‌ కావడంతో అలఘనాథస్వామిగుడి కళ్యాణమండపానికి మారింది. ఇక్కడ పాట మారింది. "సత్యముజ్యోతిగ వెలుగునయా.." మొదలవడంతోనే త్రిశూలం సినిమాలో "సుప్రభాతం..సుప్రభాతం" అని కృష్ణంరాజు పాడడంతోనే గోడలుదూకుతూ పరిగెత్తే పిల్లల్లా వచ్చేవాళ్లం. తర్వాత శరణాలు, స్వాములకి భిక్ష. వెంటనే మనకు టిఫిను( మాపిన్నికొడుకు దాన్ని అలానే పిలిచేవాడు.) ఇక్కడ మరో అట్రాక్షన్ పాటలు. సినిమా అలా రిలీజయ్యిందోలేదో దానికి రీమిక్సుకొట్టి మద్యలో అక్కడక్కడా శరణాలు ఇరికిచ్చి వాళ్లుచేసే విన్యాసాలు అసలుపాటను మరిపించేస్తాయి. ఈసారి మగధీర, జోష్ రీమిక్సులు ఎలా ఉన్నాయో? ఎమో?

అమృతభాండం

"రేయ్ ఎక్కడున్నావహే. నేను రైలుదిగి అరగంట."
"వస్తూన్నా ఉండరా."
---------
"ఎక్కడ ఎక్కడ"
"నీ ఎదురుగానేరా"
"నువ్వుకాదహే. పొట్లాలు."

వాడి బాగ్‌లోంచి బట్టలు బయటికి దొర్లబోసి
అడుగున ఉన్న నగిషీలు చెక్కిన చెక్కపెట్టె
దానికొక తాటికాయంత తాళం
తాళంవేసి గొళ్ళెం మరిచారు.
తెరిస్తే





ఆపక్కనే పిల్ట్రీ భాండం.

"పిల్ట్రీ కొత్తది తెమ్మన్నా గదరా."
"తాత దగ్గరున్న పిల్ట్రీ పంపుతున్నా. కొత్తది తెచ్చేందుకు టైమ్ దొరకలేదు" అని చెప్పిందిరా అమ్మ.
"సుసంపన్నమైన బహువిధమైన మాతాత వారసత్వ సంపద నాకు గర్వకారణం." అని చెప్పేసి దాన్ని చేతిలోకి తీసుకుంటే కెవ్వ్

కిందకలక్టరు కన్నా పైన చిల్లులగిన్నె ఒక మిల్లీమీతరు పెద్దది.

పళ్లుబిగబట్టి గట్టిగా ఒత్తితే క్లెమోర్‌మైన్‌లా ఎగిరింది.

"పైగిన్నెని గట్టిగా ఒత్తము. దాన్ని నీపై ఉంచనిస్తే చాలు" అని కిందదాంతో శాంతి ఒప్పందం కుదుర్చుకుని తెల్లజెండా ఎగరేశా.

"ఇంతకీ పొయ్యెక్కడరా నీయబ్బా? పాలు, డికాక్షను కాచేదెలా?"

"పద పక్కీదిలోనే యుటెన్సిల్‌షాపుంది."

"కుంపటి, బొగ్గులు, కిరసనాయిలు, అగ్గిపెట్టె.." అనుకుంటూ అన్నీ పట్టుకొచ్చాం.

ఇక
నే రాయనక్ఖర్లేదు. కింద దృశ్యమాలిక.
























ఇదంతా చేసేసి అలిసిపోయింది నేననుకుంటే డికాక్షన్‌లో వేలేశారన్నమాటే.
మనకు పాకశాస్త్రంలో ప్రావీణ్యం గురించి అన్నప్రాశనరోజే చెప్పాగదా.


పైనకనిపించేది అశోక్ అని మనబాల్యమిత్రుడు.
అలావాడు కాఫీకాస్తుంటే నేను బ్యాక్‌గ్రౌండ్‌లో
"స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం..."
"ఆనాటి ఆస్నేహమానందగీతం.."
"సింగారాలపైరుల్లోనా బంగారాలే.."
"చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో.."
ఇలాటివి పెట్టాను. మద్యలో "ముస్తాఫా ముస్తాఫా " అందామంటే అందులో వినీత్, అబ్బాస్‌లకి వచ్చిన సమస్యలు మాఇద్దరి మద్యనా రాలేదు కాబట్టి విరమించుకున్నా.







ఇలా కాఫీగ్లాసు పక్కనెట్టుకుని టపాలకి వ్యాఖ్యలు రాసుకుంటూ ఈజీవితం సాగిపోతే...
మొత్తానికి చలిపులిపంజా దెబ్బకి మనకొక పెయిన్‌కిల్లర్ దొరికింది.

కాఫీ గురించి నాకు (నాకుమాత్రమే తెలిసిన నిజాలు)

హంస పాలు-నీళ్లు కలిపి ఇస్తే పాలు తాగి నీల్లని వదిలేస్తుంది. అదే కాఫీ ఇస్తే?

డికాక్షను తాగి పాలు వదిలేస్తుంది.

కురుక్షేత్రంమద్యలో కృష్ణుడు గొంతుబొంగురుబోయేలా అరిచీ అరిచీ గీతను చెప్పినా అర్జునుడూ, కపిరాజు తప్ప ఇంకెవ్వరూ వినలేదు. ఎందుకని?

అదేసమయానికి ద్వారకనుంచి పాలెత్తుకొచ్చి కాఫీ కాయటం మొదలెట్టారు యాదవులు. గీత కావాలంటే ఘంటసాల కాసెట్టుకొని ఎన్నిసార్లయినా వినొచ్చులే అని అటెల్లి పోయారంతా. అర్జునుడు పాపం నీల్‌డౌన్ పొజిషన్‌లో ఉండేసరికే తప్పించుకోలేక పోయాడు. కపిరాజు మాత్రం ఝెండాకి అటుపక్క దాపెట్టేశాడు. అంతా విష్ణుమాయ.

ఎన్నితలలు కొట్టినా ఉపయోగం లేకపోతే అప్పుడు విభీషణుడు వచ్చి" రామా! మాయన్న పెద్దపిల్ట్రీ పొట్టలో పెట్టుకోనున్నాడు దాన్ని గురిచూసికొట్టు." అన్నాడట.

శరద్ చంద్రికోత్సవం

ఇది మూడువారాల కిందటి సంగతి. అయినా ఈరోజు రాస్తున్నాను అంటే ఇంతకాలం కుదర్లేదు అని అర్థం అయుంటుంది. ఇన్నిరోజుల తరువాత కూడా గుర్తుపెట్టుకుని రాస్తున్నాను అంటే విషయంలో మాంచివిషయం ఉంది అన్నసంగతికూడా అర్థం చేసుకున్నారు కదా. ఇక విషయానికి వస్తే

అది అక్టోబర్ మూడోతేదీ శనివారం ( ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి). మద్యాహ్నం మూడుకావస్తోంది. బిపిన్‌చేతిలో ఏదో కరపత్రం. విషయం అడిగితే శరద్‌చంద్రికోత్సవ్ అన్నాడు. విజయదశమి తరువాత వచ్చే పున్నమిరోజు ఈఉత్సవాన్ని చేస్తారట ఈప్రాంతంలో.

ఇక్కడ శరదృతువు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందరూ వసంతం అంటారు గానీ నాకుమాత్రం శరదృతువు అంటే చాలా ఇష్టం. వసంతఋతువులో చెట్లుచిగురించును, కోకిల పాడును అని పుస్తకాల్లో చదవటమేగానీ ఎప్పుడూ చైత్రవైశాఖాలు గ్రీష్మంలానే ఉంటాయి. అదేశరదృతువైతే అప్పటికే వానలు కురవడంతో ( ఇదికూడా గతకాలపు జ్ఞాపకాలే) చల్లగా అలాగని మరీ హేమంతశిశిరాల్లా చలీ ఉండదు. పైగా దసరా, దీపావళి మొదలైన కాబినెట్‌ర్యాంకు పండుగలు వచ్చేదీ ఈఋతువులోనే. దసరాకి రిలీజైన కొత్తసినిమాలు క్లిక్ ఐతే సీజనుమొత్తం బిజీ.

ఆరోజు సాయంత్రం నుంచి ఆరుబయట రంగస్థలాలు ఏర్పాటు చేసి సంగీత-సాహిత్య-నాట్యాల ప్రదర్శనలు ఇస్తారు. మాటౌన్‌షిప్‌లో దాదాపు పదిహేనేళ్ల నుంచి నిర్వహిస్తున్నారట. ప్రతిసారిలాగే ఈసారికూడా మాశివాలయమే వేదిక. "నువ్వువస్తావా" అన్నాడు. కొద్దిగా అలోచిస్తుంటే "మద్యలో రెండుసార్లు ప్రసాదాలు" అని అనటం అందుకు ఒకమిల్లీసెకను రియాక్షన్‌టైమ్‌లో సరేననటం జరిగిపోయాయి.

సాయంత్రం భోజనాలు ముగించి త్వరగా వెళ్ళి కూర్చుందాం అంటే ఎప్పటిలాగే చిన్నచిన్న బాతాఖానీలు.

అక్కడికివెళ్లేసరికే

ఇంకాపూర్తిస్థాయిలో మొదలయినట్లులేదు. జనాలు అటుఇటూ కదుల్తూనే ఉన్నారు.
ఇంతలో కేరళసంప్రదాయనృత్యం మోహినీఆట్టం. ఇద్దరుయువతులు 'ఫిలాసఫీఆఫ్‌లైఫ్' అన్న విషయంపై ఒక నృత్యరూపకం ప్రదర్శించారు. ఎందుకో అదిసాగుతున్నంతసేపు మనసులో "మౌనమే నీబాస ఓమూగమనసా" పాడుకుంటూ ఉన్నా. ఇంకో రెండురూపకాల తరువాత వాళ్లకి సన్మానం. ఒక పెద్దాయన (పేరుగుర్తులేదుకానీ 'పద్మశ్రీ'), ఆయనకుమార్తె, వాద్యబృదం మొత్తంకలిపితే పదిమంది ఎక్కడో కేరళనుంచి వచ్చారు.


అప్పటికి జనాల్లో కొంతమంది కార్యక్రమాలు తమ 'అంచనాల'ను చేరకపోవటంతో నెమ్మదిగా వెనుదిరగటం ప్రారంభించారు. పదినిముషాల తరువాత గోల కొద్దిగా సద్దుమణిగింది.


తరువాత హిందుస్తానీ సంగీతం 'పద్మవిభూషణ్ గిరిజాదేవీ' ( ఈమె పేరువినని వాళ్లకి చిన్నమాట. దక్షిణాదిలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఎలానో ఉత్తరాదివాళ్లకి ఈమె అలా.) ఆరోజు ఉజ్జయినిలో కచ్చేరీకి పోవల్సినామె అంతదూరం ప్రయాణం కష్టం అనడంతో, మావాళ్లు ఒప్పించి తీసుకొచ్చారు. మా సహోద్యోగుల్లో కొంతమంది చెల్లెల్లు, భార్యలు, పిల్లలు ఆమెకి శిష్యులట. బ్రహ్మాస్త్రంగా వాళ్లని ప్రయోగించారు ఒప్పించేందుకు. ఎనభైఒక్క సంవత్సరాల వయసు తాలూకు అలసట ఆమెగొంతులోగానీ, ఆహార్యంలోగానీ కనిపించలేదు. ఆమెవయసు తెలిశాక పక్కన ఉన్న విజయ్‌గాడు "జాక్సన్‌గాడు కుప్పిగంతులేసి యాభైఏళ్లకే కళ్లుతేలేస్తే ఈమెనిచూడరా!" అన్నాడు. ఇంతలో నిర్వాహకుడు పాండేగారు మైక్‌ అందుకుని "జాక్సన్‌ ఆత్మశాంతికోసం రెండునిముషాలు మౌనం." అనటం కాకతాళీయం.


కొంతసేపటికి శరదృతు కోకిల గొంతు సవరించుకుంది. మహదేవున్ని ధ్యానిస్తూ మొదలుపెట్టిన కొద్దినిముషాలకి జనాల్లో కలిప్రభావం దూరమైంది. ఒకకృతి మాటౌన్‌షిప్‌లోని పాతశిష్యబృదంతో కలిసి పాడిన తరువాత, ఆమెవెంట వచ్చిన వాద్యబృదంతో కొనసాగించింది. ఒక్కటి, ఇంకొక్కటి, మరొక్కటి అలా మేము అడగటం ఆకోకిల కొమ్మలను దాటినంత సులువుగా రాగాలు మార్చటం. ఆరెండుగంటలు ఎలాసాగిందో పున్నమిచంద్రుడికే తెలియాలి. కృతిమద్యలో ఆమె ఆపినప్పుడు (ఉద్దేశ్యపూర్వకంగా) శిష్యులలో ఒకరివైపు చూడటం, వెంటనే వాళ్లు అందుకోవటం. సరిగా కొనసాగిస్తే చిన్న చిరునవ్వుతో ఆశీర్వాదం. తడబడితే చూపుతోనే చిన్నమందలింపు వెంటనే తనే స్వయంగా అందుకోవడం. శిష్యులు నాలుక్కరుచుకుంటూ ఒకరిమొహాలు ఒకరు చూసుకొని నవ్వుకోవడం. చివర్లో ఆమెమాటలు " చిన్నప్పుడు నాగురువు పాడించాడు. తరువాత నాశిష్యులు పాడిస్తున్నారు. నేను నిమిత్తమాత్రురాలిని."

ఇంతలో ఆరతిసమయం అయింది. దానితరువాతే ప్రసాదం అన్నవేగులసమాచారంతో కదనోత్సాహంతో ఉరికి రెండుకప్పుల ఖీర్, నాలుగులడ్లు, దోసెడు నమ్కీన్ ఎత్తుకుని వచ్చికూర్చున్నా.


తరువాత ప్రదర్శన గ్రామీఅవార్డుగ్రహీత, పద్మశ్రీ విశ్వమోహన్‌భట్ గారి 'మోహనవీణ'. గిటార్‌లోని తంత్రులలో మార్పులుచేసి అందులో వీణానాదం వచ్చేలా చెయ్యటం ఆయన ప్రత్యేకత. అలా మార్చినగిటార్‌కి మోహనవీణ అని పేరుపెట్టుకున్నారు. అర్థరాత్రి పన్నెండున్నరపైన మొదలైన స్వరవిలాసం మూడుదాకా సాగింది. ఆయనకు తోడుగా వచ్చిన తబలావిద్వాంసుడు( పేరుగుర్తులేదు. ఉస్తాద్ బిరుదు ఉంది.) కూడా బాగాపేరున్నవాడే. వాళ్లిద్దరూ వాళ్లకి మాత్రమే అర్థమయ్యేభాషను అందరికీ అర్థమయ్యేరీతిలో మాట్లాడుకున్నారు.


ఇంతలో పాండేగారు వచ్చి ప్రేక్షకుల్లోని కొంతమందిని పిలిచారు. వాళ్లది మాటౌన్‌షిప్‌కాదు. ఇక్కడినుంచి దాదాపు యాభైమైళ్లదూరంలోని సీధీఅనే పట్టణం చేరి అక్కడినుంచి ఇంకో పదికిలోమీటర్లు బస్సు ఆపై కొండల్లో నడుచుకుంటూ పోతే వాళ్లగూడెం. అంతదూరం వచ్చిన ఇలాంటి కళాభిమానులచేత సన్మానం చెయ్యించుకుంటేనే మీ కళకి నిజమైన గుర్తింపు అనడం, భట్‌గారు చిరునవ్వుతో ఒప్పుకోవటం జరిగాయి. కొద్దినిముషాలపాటు ఉద్వేగం నింపిన సంఘటన ఇది. చివరగా తనకు గ్రామీని సంపాదించిపెట్టిన రాగాన్ని వాయించాడు.

అప్పటికి మూడయ్యింది. నెమ్మదిగా కళ్లుమూతలు పడుతున్నాయి. ఇంతలో మళ్లీ ఆరతి అన్నారు. అంటే మళ్లీ ప్రసాదం. భల్లేభల్లే అనుకుంటున్న నాదగ్గరికి వేగులు చేదువార్తతో ఎదురొచ్చారు. రెండుసార్లు ఇచ్చేందుకు తెచ్చిన ప్రసాదం మొదటివాయకే ఆవిరైపోయింది. "ఇది దారుణం. ప్రసాదాన్ని సరిగా అంచనా వెయ్యలేక పోతే ఎలా? ఇదిపౌరహక్కులకు భగం. అరవైనాలుగు కళల్లో ఇది ఇరవైనాలుగోది. శరద్‌పూర్ణిమ రోజు కళాకారులకి జరిగిన అన్యాయం. శక్తిరూపమైన జీర్ణశక్తితో ఆటలాడుతారా?" అంటూ ప్రశ్నించబోయిన నేను" ఒక్కసారి నువ్వు ఇందాక తిన్నప్రసాదం కాదుకాదు అర్థరాత్రి నాస్తా గుర్తు తెచ్చుకో?" అన్న మాటలతో మిన్నకుండిపోయా.


ఇంతలో ప్రముఖ హిందుస్తానీ గాయకులు రాజన్-సాజన్‌ సోదరద్వయం గొంతువినడంతో వచ్చి నాస్థలంలో కూర్చున్నా. అప్పుడు మొదలుపెట్టిన లలితసంగీతం ఉదయం ఆరువరకు సాగింది. నేనుమాత్రం ఐదున్నరకే ఇంటిముఖం పట్టాను.
అక్కడకూర్చుని ఎలాంటినొప్పితెలీకుండా ఆస్వాదించాం. ఇంతమంది ప్రముఖులను ఒప్పించడం, వాళ్లకి, తోటిబృందానికి సౌకర్యాలు కల్పించడం, గౌరవాలకి భగంకలుగకుండా చూసుకోవడం ఎంతకష్టం. నిర్వాహకుల అంకితభావానికి నిజంగా నిజంగా చేతులెత్తి నమస్కరించాలి.


ఈజీవితానికి సరిపడా జ్ఞాపకాలతో నిద్రలోకి జారుకున్నా. ఇప్పటికి ఎన్నోరాత్రులు జాగారం ( శివరాత్రికి కాదు.) చేశాను. కొన్నిసార్లు పరీక్షలకి, ఇంకొన్నిసార్లు సినిమాలు చూస్తూ, మరికొన్నిసార్లు ఇంటర్‌నెట్. కానీ ఆరాత్రిమాత్రం ఎక్కడా మనసులో అలసట, కళ్లలో నిద్ర, ఒంట్లో నిస్సత్తువ అన్న మాటేలేదు. ఎనిమిదికి లేచి టిఫిన్ చెయ్యటానికి వెళ్తే నిద్రలేమి లక్షణాలేలేవు. ఏవిటో మాయ.

రిహాంద్

గతంలో నేను సోన్‌నది గురించిరాశాను. రిహాంద్ అనే చిన్ననది, సోన్‌నదికి ఉపనది, గురించి రాద్దాం అనుకున్నా. మొదలుపెట్టాక ముందు సోన్ గురించి చెప్తేకదా ఇది తెలిసేది అని విషయాన్ని అటుపక్కకు తిప్పాను.

ఇక రిహాంద్ విషయానికి వస్తే అది చత్తీస్‌ఘడ్‌లోని సర్గుజా అనేప్రాంతంలో పుడుతుంది. వింధ్యపర్వతసానువుల్లోని మణిపాల్ పీఠభూమి దగ్గర సముద్రమట్టానికి సుమారు 1100మీటర్ల ఎత్తున దీనిజన్మస్థానం ఉంది. అక్కడి నుంచి ఉత్తరదిశగా సోనభద్రజిల్లాగుండా ఉత్తరప్రదేశ్‌లో ప్రవేశించి, చోపన్‌దగ్గర సోన్‌నదిలో కలుస్తుంది. సోన్‌నదిరంగు ఆప్రాంతపు మట్టిరంగులో కలిసిపోయి ఉంటుంది. అందువల్ల ఉపగ్రహచిత్రాలద్వారా దానిమార్గాన్ని గుర్తించడం కష్టం. రిహాంద్‌ నీలిరంగులో, కృష్ణవేణికి డూప్ అన్నమాట, ఉండటంతో ముందుదీన్ని గుర్తించి, ఆతోకతో సోన్‌దగ్గరకి చేరుతారు. దీనికి మహన్, మోర్ని, గగర్, గల్ఫుల్లా మొదలైన పిల్లనదులు ఉన్నాయి.

కేవలం 160కిమీ ప్రవహించి మరోనదిలోకలిసిపోయేనది రిహాంద్. ఇలాంటి నదులు మనదేశంలో కోకొల్లలు. అయినా దానికంటూ ఒకగుర్తింపు దక్కింది అంటే దానివెనుక ఒకమహనీయుని కృషి ఉంది. ఆమహనీయుడు ఎవరంటె అభినవ విశ్వకర్మ, ఆధునికభారత నిర్మాతల్లో ముందువరుసలో నిలబడే ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య.


అతితక్కువ దూరంలోనే అంటే కొన్నిపదుల కిలోమీటర్లలోనే ఈనది సుమారు 750మీటర్లు కిందకి దూకుతుంది. ప్రవాహమార్గం పూర్తిగా కొండల్లోని ఇరుకైన సందుల్లో, ఋతుపవనాల సమయంలో పెద్దపెద్దబండలను సైతం దొర్లించేవేగంతో గమనం ఈనదికి వరం. ఒక జలవిద్యుత్తుప్రాజెక్టు రూపుదిద్దుకునేందుకు దోహదపడింది. సోన్‌నదిలో కలిసేచొటుకి 45కిమీ ముందు పీపరి-రేణుకూట్ అనే గ్రామాలదగ్గర రిహాంద్ బహుళార్థసాథక ప్రాజెక్టు 1966లో రూపుదిద్దుకుంది.934మీ పొడవు, 91మీ ఎత్తు ఉన్న ఈకాంక్రీటుడ్యాం గురుత్వసిద్థాంతాన్ని ఉపయోగించి రూపొందించారు.


నీటిని నిలువ ఉంచడంద్వారా కలిగే ఒత్తిడి డాంవెనుక భాగంపై పడుతుంది. దానివల్ల డాం ముందుకుజరగడమో, లేక దొర్లిపడిపోవడమో జరుగుతుంది. ఈబలాన్ని ఎదుర్కునేందుకు డాంలో వాడి పదర్థపుభారం ఉపయోగపడుతుంది. ఈసూత్రంద్వారా నిర్మించే డాంలను గ్రావిటీడాం అంటారు. నాగార్జునసాగర్‌డాం కట్టేసమయంలో మొదటసిమెంటుకాంక్రీటును ఉపయోగించాలి అనుకున్నారు. అయితే స్థానికంగా లభించే నల్లరాయిని పరీక్షించగా అది నిర్మాణానికి ఉపయోగించవచ్చు అని ధృవీకరించారు. ఆతరువాత డిజైన్‌లలో చేసిన మార్పుల కారణంగా చాలాఖర్చు తగ్గిందట.


ఈడాంకట్టండం ద్వారా ఏర్పడిన జలాశయానికి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు గోవింద్‌వల్లభ్‌పంత్ పేరిట జీబీపంత్ జలాశయం అని పేరుపెట్టారు. 10625 మిలియన్ల ఘనపుమీటర్ల సామర్థ్యంగల ఈజలాశయంలోకి 13344చదరపు కిమీ ప్రాంతంలో పడ్డ వర్షపునీరు చేరుతుంది. 466చదరపు కిమీ వైశాల్యంలో విస్తరించి ఉన్న ఈజలాశయం మనదేశంలోని మానవనిర్మితజలాశయాల్లో అతిపెద్దది. అంతర్జాతీయ సాంకేతికప్రమాణాలు అందుకోగల అతికొద్ది భారతీయ కంపెనీల్లో ఒకటి అయిన హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఈనిర్మాణాన్ని అతితక్కువ వ్యవథిలో పూర్తిచేసింది. ఇటీవల ముంబాయిలోని బాంద్రా లింక్‌బ్రిడ్జిని కట్టిందికూడా వీళ్లే.
ఒక్కొక్కటి 50మెగావాట్ల సామర్థ్యంగల ఆరుయూనిట్ల ద్వారా 300మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోంది. దీనివల్ల ఈప్రాంతంలో అనేక పరిశ్రమలు స్థాపించారు. ప్రత్యక్షంగా రెండులక్షల హెక్టార్లకు, పరోక్షంగా ఐదులక్షల హెక్తార్లకు సాగునీరు లభిస్తుంది. ఈనిర్మాణంద్వారా వరదనియంత్రణ వ్యవస్థ అభివృద్ధి చెయ్యగలిగారు. ఈప్రాంతంలో బొగ్గుగనులు విస్తారంగా ఉండటంతో థర్మల్‌విద్యుత్తుప్లాంటులు జలాశయంనీటిని ఉపయోగించుకుని తమ ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. ఈఒక్కప్రాంతంలోనే దాదాపు 15000మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. ఈజలాశయం ఒడ్డునే ఎన్‌టీపీసీ తనమొదటిప్లాంటును 1977లో మొదలుపెట్టింది. ఇప్పుడు జలాశయానికి మూడు వైపులా మూడుప్లాంటులలో ఉత్పత్తిని కొనసాగిస్తుంది. రిహాంద్‌నది సోన్‌లో కలిసేముందు మరొకచిన్న ఆనకట్ట ఓబ్రావద్ద ఉంది.
పాత వందరూపాయలనోటుపైన ఒక ప్రాజెక్టుబొమ్మ ఉండేది గుర్తుందా? చాలాకాలం అది నాగార్జునసాగర్ అనుకొనేవాడిని. ఈమద్యనే తెలిసింది అది రిహాంద్‌ప్రాజెక్టుది అని.

కొత్తనేను

అది 2007 సంవత్సరం జూలై. రెండో సెమిస్టరు తర్వాత చెయ్యాల్సిన సమ్మర్ ఇంటర్న్ షిప్ పూర్తిచేసి ఒకవారం ఇంటిదగ్గర ఉండి తిరిగి హాస్టలు చేరా. గోవింద్‌గాడు వచ్చి "ప్లేస్‌మెంట్ ఎక్సామ్ రిజల్ట్ వందిరిచి. నీయుం,శశికళాఉం టాపర్స్. ఒరు ఆయిరం మట్టుం పోదుం" అని సొల్లి వెళ్ల్లాడు. ఆడబ్బు చలానా కట్టి ఆరశీదు ప్లేస్‌మెంట్‌సెల్‌లో ఇచ్చి వ్చచ్చేశాం.

"మొదటి కంపెనీ టీసీఎస్ బావా" అని విభాగాడు. "సర్లేరా నేనెలాగు వాటికి కూర్చోనుగా.ఎల్ అండ్ టీ . ఎప్పుడు." అని అడిగా. "కొంచెం టైమ్ పడుతుంది" అని చెప్పాడు. సాయంత్రంవచ్చి" బావా! అది ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు ఇంతవరకూ అగర్వాలు పుస్తకం అట్టకూడా చూడలేదు. అసలు ఆప్టి, రీజనింగ్ ఎలా ఉంటుందో చూద్దాం." అన్నాడు. ఇంతలో హరిగాడు వచ్చి "దాని తర్వాత సీ.టీ.ఎస్ వెంటనే ఐ.బీ.ఎమ్." అన్నాడు. మళ్లీవిభాగాడు " ఒకసారి చూద్దాం బావా. నేను కూడా ప్రిపేర్ కాలేదు" అన్నాడు. వాడుకూడా ఇంటర్న్ షిప్ కోసం డిల్లీ వెళ్ళొచ్చాడు. వాళ్లక్లాస్‌కి రెప్ కావడంతో ముందుగావచ్చి ప్లేస్‌మెంట్ చూస్కోవాల్సి వచ్చింది. సర్లేరా చూద్దాం అన్నాను.

రాత్రి పడుకునే ముందు ఆలోచనలు..." నాకు అసలు సాఫ్ట్వేర్ అంటేనే పడదు. ఎందుకో నామైండ్‌సెట్‌కి కుదరదు అనిపించింది. కొన్ని అలా ఫిక్స్ ఐపోతా. తర్వాత నన్నుమార్చాలంటే కష్టమే. 2000 డిసంబరు 08 కౌన్సిలింగ్‌లో సివిల్ సీటు వచ్చినప్పుడే అనుకున్నా ఇక జీవితానికి నేను సివిల్ ఇంజనీరుని అని. మానాన్న ఐతే ఎంసెట్ అప్లికేషన్ నింపేరోజే అన్నాడు నువ్వు సివిల్. అంతేరా అది నిర్ణయం ఐపోయింది అని. అమ్మకి మాత్రం నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు అవ్వాలి అని. ఇంట్లో త్రాసు ఎప్పుడూ నాన్నపక్కే తూగుతుంది. నాకు ఉద్యోగం వచ్చి ఆమాట ఇంట్లోచెప్తే. ఈమాట రెండునెలల క్రితం అయ్యుంటే బావుండేది. కానీ ఈరోజు పరిస్థితివేరే. నాకు ఒక ఉద్యోగం వచ్చింది అని చెప్తే ఇంట్లో ఎగిరిగంతేసేయ్యరు. కానీ ఈమాట అమ్మకి కొంత ఊరట." మొత్తానికి దానికి కూర్చుందాం అని నిర్ణయించుకుని విభాగాడికి చెప్పా.

ఇద్దరం కలిసి ప్లేస్‌మెంట్ వెబ్‌పేజ్‌లో రిజిస్టర్ చేస్కుని వచ్చాం. హరిగాడిని అడిగితే "లేదుబావా" అన్నాడు. సరే ఆరోజుకైనా త్వరగా లేవాలిగా. ఏడుకల్లా లేచి, స్నానం- సంద్యలు పూర్తిచేస్కుని ఫార్మల్ తొడుక్కుంటుంటే ఎవడొ మనల్ని ఫాలో అవుతున్న ఫీలింగ్. తిరిగి చూస్తే అరుణ్ గాడు. ముసిముసి నవ్వులు. "ఇప్పం నాన్ ఒరు సీరియస్ కారెక్టర్‌. ఎణ్ కిట్టా కామెడీ వేండా తంబీ" అన్నా. అయినా మారలేదు. సరే ఒక పదినిముషాలు కామెడీలు వేసి తిరిగి సీరియస్‌గా మెస్‌కి వెళ్తే అక్కడా సేమ్‌సీన్. అరగంట కామెడీ తర్వాత మళ్లీ సీరియస్.

ఇప్పుడు బార్న్‌హాల్‌లో పీపీటీ ఏస్తున్నారు అంటే జెమినీ సర్కస్ చూసే ప్రేక్షకుల్లా వెళ్తున్నారు జనాలు. కూర్చునేవాళ్లు, కూర్చోనివాళ్లు అన్నతేడా లేదు. బల్క్ కంపెనీ, అందునా టీసీఎస్. వీటన్నిటి మించి సీజన్ ఓపెనింగ్. అక్కడి నుంచి ప్లేస్‌మెంట్‌సెల్‌కెళ్లి మానంబరు తీస్కుని నోటీస్‌బోర్డ్‌లో చూస్తే నాకు పదకొండుకనుకుంటాఆన్‌‌లైన్ ఎక్జాం. సరేనని బుహారిలో చాయ్ తాగి అలా నలుగుర్నీ కెలికి (ఒక్కోడు అగర్వాల్ పుస్తకాన్ని తెగరుబ్బి- తెగతాగినారు.) వచ్చి కూలబడ్డా.

పరీక్షరాసి భోజనానికి వెళ్తే ఒక్కొక్కరి మొహంలో ఒక్కొక్క హావభావం. కొంతమంది స్థితప్రజ్ఞులు( మేకపోతులు), ఇంకొంతమంది నిగర్వులు( కనిపిచ్చినోడినల్లా ఈప్రశ్నకేమి జవాబు ఆప్రశ్నకేమి జవాబు అని తినేస్తున్నారు), మరికొంతమంది భోళాశంకరులు( నాపరీక్ష బాల్చీ తన్నేసింది అని ఏడుస్తున్నారు). ఇక ఎగ్జిట్‌పోల్ నివేదికలు, గతేడాది గణాంకాలతో కుస్తీపట్టేవాళ్లు. మిగతాకాంపస్సుల్లో అనుభవాలను ప్రసారంచేసేవాళ్లు. అబ్బో జాతర.

మొత్తానికి ఫలితాలు వచ్చాయి. మద్యాహ్నం గుంపుచర్చలు. దానికి వెళ్లొచ్చి, విభాగాడితోబాటు కొంచెంసేపు జననాడిని , జ్యూసు కడుపులో పోస్కుని ఫలితాలు కోసం వెళ్తుంటే సేఫ్టీగాడు ఎదురొచ్చి " నువ్వు క్లియర్ అయ్యిపోయావు బావా. విభాగాడిపేరు నాకు గుర్తులేదు." నీయబ్బా అనీట్టుకుంటూ పరిగెత్తాం. హమ్మయ్య వాడిపేరు కూడా ఉంది. ఇక ఇంటికి ఒకకాల్ చేసి విషయం చెప్తే ఊహించినట్లే "హ్మ్. సరేరా."

సాయంత్రం బనానాలీఫ్‌లో హరి, కొండి, రాకీతో విందు. ఇక మనసు ఊరుకోదుగా. అప్పటికే స్టైపండు పండింది. అమ్మకి ఒకచీర తీస్కుని పదకొండుకి బస్సెక్కేశా. ఐదుకి కోయంబేడు ఎనిమిదిన్నరకి ఇంట్లో." అలా నాజీవితానికి మొదటిఉద్యోగం వచ్చింది. ఇక మూడొసెంలో పూర్తిగా ఉద్యోగం అన్న ఆలోచనేలేదు.
మమ్మల్నిచూసి హరికూడా మనసు మార్చుకుని సీటీఎస్‌కి కూర్చున్నాడు. ఉద్యోగం వచ్చిన తరువా వాళ్లనాన్నకి ఫోన్‌చేసి "నాన్నా! నాకు ఉద్యోగం వచ్చింది. నీచిన్నకొడుకు గురించి నువ్వుదిగులుపడాల్సిన అవసరంలేదు. ఇక ఎవరొచ్చి ప్రశ్నించినా నీదగ్గర జవాబుంది." నేను జీవితంలో మర్చిపోలేని మాటలివి.

నాలుగోసెం మొదలైంది. నేను కోర్‌కంపెనీలకు కూర్చుంటా ఆంటే కొన్ని శక్తులు అడ్డుపడాయ్. నిజానికి ఇవే నన్నుగతంలో ప్రభావితం చేశాయ్.ఇప్పుడూ వాటిగురించి అనవసరం. అప్పటికే అన్ని ముఖ్యమైనవి అయిపోయాయి. ఇక మిగిలింది రెండు మూడు. వీళ్ళు ఉన్నవన్నీ వృధాచేసి ఇప్పుడు నాపుట్టి ముంచేశారు. ఇక ఆఫ్‌కాంపస్‌కి వెళ్లాలి అని డిసైడ్ అయ్యా. అందరూ వద్దుబావా రిస్క్.నిజమే కానీ తప్పదు.

ఇక ప్రతిబుధవారం హిందూలో ఆపర్చునిటీస్, నౌకరీ, మాన్‌స్టర్. మొదట జిందాల్. విజయవంతంగా నింగికెగసి భూకక్ష్యకి చేరింది. తర్వాత చూస్తే పీఎస్.యూల్లో వర్క్ ప్రొఫైల్, పాకేజీ బావుంది. చర్చిస్తే అన్నింటికన్నా అవే ఉత్తమమైనది. ఐఐటీల్లో, ఎన్ఐటీల్లో చదివేవాళ్లు ఎక్కువ వాటిలోనే ఉంటారు అని తెలిసింది. మొదటిది హెచ్‌పీసీఎల్. డుమ్మాకొట్టింది. తర్వాత ఎన్‌టీపీసీ. విజయం. కానీ నాకు ఇష్టమైనది బీ.హెచ్.ఈ.ఎల్. నాన్న చాలాసార్లు అనేవాడు.కానీ కుదర్లేదు.

ఇంతలో విభాగాడు ఫోను. బావా ఎల్ అండ్ టీవాడు నిన్ను- నన్ను పిలుస్తున్నాడు. వాకే అదికూడా విజయం. దాంట్లోనే ఉండిపోదాం అనుకున్నా. ఐ.ఓ.సీ.ఎల్, ఓ.ఎన్.జీ.సీ ల నుంచి పిలుపు. కానీ అంతగా పట్టించుకోలేదు. ఇంతలో కొన్ని‌అంశాలు ప్రభావితం చేశాయి. ఇక పీ.ఎస్.యూకి వెళ్లాలి అనిమనసు. ఎలా అనుకున్న సమయంలో ఇంటికి పోస్టు అందులో ఎన్.టీ.పీ.సీ నుంచి లేఖ. వెళ్లి కంపెనీలో చెప్పేశా. మావాడు ఇంటర్వ్యూ అవ్వకముందే ఎందుకు చెప్పావు అని నస. కానీ ఖచ్చితంగా వస్తుందని నాకనిపిచ్చేసింది. ఎక్కడిదో ఆధైర్యం తెలియదు.

పీజే‌ఎన్ పిలిచి దాని రిజల్టువచ్చేదాకా నీకు పని అప్పగించలేమ్ అన్నాడు. సరే అని వచ్చేశా. ఇంటికి వేళ్లలేదు. ఫలితాలు రావల్సిన దానికన్నా ఒకవారం ఆలస్యం ఐంది. కొద్దిగా దిగులు. తిరువళ్ళూరు వెళ్లి చాలా ఏళ్లైంది అని గిరిగాడితో చెప్పి అక్కడికి బయల్దేరా. వాడూవస్తా అన్నాడు. మద్యలో వెంకటెసూ.ముగ్గురం కలిసి వెళ్లి వీరరాఘవస్వామి దర్శనం చేస్కుని మల్లిగాడి రూంకి వెళ్లాం. పిల్లిలాగా చప్పుడు చెయ్యకుండా నెట్ ఓపన్ చేసి చూశా. ఏనుగెక్కి మెరీనాబీచ్ వరకు ఊరేగా. వెంటనే అమ్మకి, అశోక్‌కి ఫోన్. దాంతో ఐ.ఓ.సీ.ఎల్, ఓ.ఎన్.జీ.సీ. పట్టించుకోలేదు.

విభాగాడినుంచి ఫోను. బావా ఈనెల 29 స్నాతకోత్సవం. అందరం కలుద్దాం. దానికోసం బయల్దేరుతుంటే అప్పుడే ఇంటినుంచి అమ్మఫోన్. ఒక శుభవార్త. పాపని చూసెళ్లిన వాళ్లు అమ్మాయి నచ్చింది అన్నారు.
అందరం కలిసి ఎగ్మూరులో రైలెక్కాలి. మనకు చేజింగ్‌ లేకపోతే మనసొప్పుకోదుగా. అందుకే మద్యలో అక్కడా ఇక్కడా పెత్తనాలు చేసి వచ్చేసరికే టైమ్ అయిపోయింది. ఇక అక్కడికి వెళ్తే కష్టం అని గిండీనుంచి నేరుగా తాంబరం చేరాను. ఎవ్వరూ భోజనంచెయ్యలేదంటే రైలొచ్చేసరికే టిఫిన్లు కట్టిచ్చిపెట్టా. తెల్లవారేసరికే కాంపస్‌లో.

బార్న్‌హాల్‌లో ఫంక్షను. గౌను, ఇతర సరంజామా తీస్కుని అక్కడికి వెళ్లాం. అందరికీ అక్కడే ప్రకటించా. వెలగాల్సిన బల్బులు వెలిగాయి. మాడాల్సిన బల్బులు మాడి చెత్తబుట్టలో పడ్డాయి.చివరికి నాపాకేజే క్లాసులో టాప్ అందులో కోర్.
సెప్టెంబరు తొమ్మిది వైద్యపరీక్షలు. ముందు నోయిడాలో పవరు మానేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో నమోదుచేస్కొని అక్కడి నుంచి బదర్‌పూరు ప్లాంట్‌లోని ఆసుపత్రిలో పరీక్షలు. ఈప్రామ్తం నాకు ముందుగానే తెలుసు. ఆమద్యలో ఒక కంపెనీ చెప్పటం మర్చిపోయా. ఎయిర్ ఫ్లూయిడ్ అని ఒక కంపెనీ ఇంటర్వ్యూకి వచ్చా. కాకపోతే మొద సంవత్సరం జీతం చాలాతక్కువ అనేసరికే నేను రెండొసంవత్సరంలోనే చేరుతాలే అనిచెప్పి వచ్చేశా. అదీగాక ఎల్ అండ్ టీ వాళ్ల డిల్లీ ఆఫీసు ఇక్కడే ఉంది. ఇక పద్నాలుగో తేదీ సర్టిఫికేట్ల తనిఖీ.
16 సెప్టంబరు 2008 మామిడిపూడి సుబ్రహ్మణ్య చైతన్య నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ( భారత ప్రభుత్వ రంగ సంస్థ) అనే నవరత్నలో కార్యనిర్వాహక శిక్షితుడుగా (ఎక్జిక్యూటివ్ ట్రైనీ) చేరాడు. నిన్నటికి ఒక సంవత్సరం.
ఎన్నోకొత్త విషయాలు నచ్చేవి (గుర్తుంచుకొని ఆచరిద్దాం అనుకొనేవి)- నచ్చనివి (అప్పుడే మర్చిపోయేందుకు యత్నించినవి), ఎంతోమంది కొత్తమనుషులు నచ్చినవాళ్లు (ఫోను నంబరు అడిగి తీస్కున్నా)- నచ్చనివాళ్లు( కనిపిస్తే ఒకనవ్వు), కొత్తప్రదేశాలు నచ్చినవి - నచ్చనివి, కొత్తపద్ధతులు నచ్చినవి (సరేచూద్దాం అనుకున్నా) - నచ్చనివి(వదిలేద్దామ్ అనుకున్నా) కొత్తకొత్తవి ఇంకెన్నో . మొత్తానికి కొత్తగా నాకునేను. ఇంటీకివెళ్తే చుట్టాల్లో కొత్తనేను. ఫోన్ చేస్తే స్నేహితులకి కొత్తనేను.
--
M.S.Chaithanya
101082
ET08 Civil
NTPC Singrauli
Shaktinagar
Sonabhadra UP 231222

అన్నప్రాశన

పుట్టినప్పటి నుంచి అమ్మ, అమ్మమ్మల దగ్గర. దాదాపూ ఎనిమిదో తరగతి దాకా అమ్మమ్మ దగ్గరే. ముందే చెప్పాకదా అమ్మమ్మ ఇల్లు- తాత బడి అని. ఇక ఊర్లోనే పిన్ని, అత్త, చిన్నమామ మొదలైన స్టాండ్‌బై ఆప్షన్లు. ఎప్పుడైనా అమ్మ ఊర్లో లేదంటె, ఎప్పుడో ఎలక్షను డ్యూటీమీద తప్ప ఆమె ఊరిని వదలదు, ఇన్ని ఇళ్లమద్య పెద్దగా లోటు తెలిసేదికాదు.

ఆమెచేతి ముద్దతింటూ అలాఅలా పెరిగి పెద్దైపోయా. మొదటిసారి ఇంటరు చదివేసి అల్లూరి సీతారామరాజులాగా దేశాకాలమాన పరిస్థితులు తెలుసుకుందామని నెల్లూరులో హాస్టల్లో చేరా. అక్కడ సత్రంభోజనం మఠంనిద్ర. మళ్లీ ఇంజనీరింగుకి ఊళ్లోనే. ఉదయాన్నే అన్నంబాక్సు పట్టుకుని జరుగుమల్లి-కొత్తపాళెం బస్సెక్కితే సాయంత్రం కాఫీకి కర్రీస్ మల్లాం. తరువాత కాన్‌పూర్లో, త్రిచీలో ఇంటరుకి డిటో. అక్కడి నుంచి పురుషుడను అని నిరూపించుకునేందుకు నోయిడా మీదుగా వారణాసిలో ఉద్యోగం. ఎక్కడికి వెళ్లినా మనకు తోడు నలుడు భీముడు వాళ్ల ఆర్కుట్ కమ్యూనిటీలోంచి ఎవరో ఒకడిని పంపుతూనే ఉన్నారు.


అసలు ఈకథ అంతా ఎందుకు అంటే... ఇన్ని సౌకర్యాల మద్య మనకు కాపసాశ్త్రంలో( దాని స్పెల్లింగుకూడా సరిగా రాదు) అదీ పారిస్థితి. వంటలో నాకొచ్చిందల్లా అమ్మ ఎప్పుడైన కుక్కర్‌లో అన్నీ పడేసి, వైయిట్ పెట్టి "ఒరెయ్ మూడు విజిల్లు సరేనా " అంటే కరక్టుగా లెక్కపెట్టి ఆపెయ్యటం.

వండడంలో కే.జీ దాటక పోయినా తినడంలో మాత్రం పీ.జీ. ఎవరు ఏది వండినా తప్పులెంచకుండా గిన్నెని ఖాళీచేసి కడుపునింపెయ్యగం. ఈవిషయంలో మామ్మకి నేనొక గుడ్‌బోయ్.

ఇక బ్లాగు లోకంలోకి వచ్చేసరికే నలభీములు, సునీతగారు ఎట్సెట్రా ఒక్కొక్క వంటా వర్ణిస్తుంటే చదివి కడుపునింపుకుంటున్నాను. ఈమద్య తృష్ణగారు కూడా పొయ్యిరాజేశారు. ఇంతలో మొన్న పాప ఆన్‌లైన్‌లో చిన్న షాకు. "అన్నా! (అదెప్పుడూ అలా పిలవదు. అలా ఊహించుకుంటుంటా. అందుకే ఆ ఆశ్చర్యార్ధకం.) నేనుకూడా బ్లాగు మొదలెట్టా. స్రవంతివటిల్లు అని."

అప్పుడనిపించింది ఇక్కడ ఏదో లెక్కతప్పుతోంది అని. తినేవాళ్లంతా వంటగాళ్లు కానక్ఖర్లేదు. కానీ వండేవాళ్ల్లంతా తినేవాళ్లే. అంటే తినేవాళ్లు యూనివర్సల్ సెట్ అయితే వండేవాళ్లు అందులో ఒక సబ్‌సెట్. వండేవాళ్లు ఎక్కువై తినేవాళ్లు తగ్గితే సమతుల్యం దెబ్బతింటుంది అందుకే ఈరోజు నుంచి వీలు చిక్కినప్పుడల్లా ఒక్కొక్క పదార్ధాన్ని ఎలా తినాలో రాయాలని డిసైడ్ అయిపోయా.
ఈరోజు అన్నప్రాశన( కాబట్టి ఆవకాయను పెట్టట్లేదు.)

  1. ముందు వేడివేడిగా ఆవిర్లువచ్చేప్పుడు(ఉఫూ ఉఫూ మంటూ ఊదుకుంటూ అయినా) అన్నాన్ని ప్లేటులో వేసుకోండి.
  2. కొద్దిగా వెన్నముద్దనిగానీ నెయ్యిని గానీ దాంట్లో వెయ్యండి. ఆవేడికే కరిగి అంతా కలిసిపోవాలి.
  3. ఇప్పుడు కొద్దిగా ఉప్పువెయ్యండి.అన్నం మరీ ముద్దగాకుండా పొడిపొడిగా కలపండి.
  4. వేడితగ్గి గోరువెచ్చగా అయినప్పుడు ముద్దలు చేస్కుని ప్లేటులో పెట్టుకోండి.
ఇప్పుడు అమ్మ లేదా అమ్మామ్మ లేదా నానమ్మ దగ్గర కూర్చోండి.
ఇప్పుడు మనకి ముద్దలు కలిపే ఓపిక వాళ్లకి ఉండదు కాబట్టే ఆరెడీమేడ్ ముద్దల సెట్టింగ్ అన్నమాట.
ఒక్కక్కొక్కటీ తీసుకుంటూ ఇది అమ్మముద్ద, ఇది నాన్నముద్ద, ఇది స్వర్ణముఖిముద్ద, ఇది నెమలికన్నుముద్ద అలాఅలా ఖాళీచేసేయ్యండి.
ఇంతకీ అమ్మావాళ్లను ఎందుకు పిలవమన్నట్టు అంటే పూర్తయ్యిన తరువాత కొంగుతో మూతి తుడుచుకోవాలిగా.
ఇప్పుడు అసలు డ్యూటీ.
పరుపుమీద ఎల్లకిలా పడుకుని పైన గిరగిరా తిరుగుతున్న తెల్లటి క్రాంప్టన్& గ్రీవ్స్ ఫాన్ వంకచూస్తూ నిద్దర్లోకి జారుకోవడం.

గురుభ్యోన్నమః

ఈ ప్రపంచంలో తల్లి తండ్రీ లేనివాడు మనకు ఎలాగైతే దొరకడో( వాళ్లెవరో తెలియనివాళ్లుంటారు గానీ లేనివారు ఉండరు.) గురువులేని వాడు దొరకడు. తల్లిదండ్రులు ఎవరికైనా మానవరూపాల్లోనే కనిపిస్తారు. కానీ గురువు మాత్రం అందరికీ ఆరూపంలే ఉండాలి అనిలేదు. ఎక్కువ మందికి లభించేది ఆరూపంలోనే అయినా కొందరికి ఈప్రకృతే గురువు. మరికొందరికి వాళ్ల అనుభవాలే గురువై పాఠాలు నేర్పితే ఇంకొందరికి స్వప్నదర్శనాలు. అతను త్రిగుణాత్మకుడు. సర్వధర్మాలకు, సర్వదేవతలకు, సర్వతీర్ధాలకు మూలం గురుపాదంగా భావించే భారత సంస్కృతి ఆయన గొప్పతనాన్ని ఎంతోఉన్నతంగా నిర్వచించింది.

మనిషి పుట్టిన తరువాత కొంతకాలానికి తల్లిదండ్రులను వదిలి విద్యకోసం ఆపై భుక్తికోసం దూరంగా ఉంటాడు. పెళ్లయి గృహస్థు, అటుపై వానప్రస్థం. లేదా అన్నీ త్యజించి సన్యాసిగా మారవచ్చు. మనిషిదేనినైనా త్యజించవచ్చుగానీ గురుపాదాన్ని మాత్రం కడవరకు స్మరించాలి. అంటే మనజీవితంలో మిగిలిన బంధాలన్నీ తాత్కాలికం. ఒక్క గురుపథం తప్ప.

గురువు నిర్వచనానికి విగ్రహరూపంగా, ఆస్థానానికి అలంకారంగా నిలిచినవాళ్లు మన పురాణాల్లోను, చరిత్రలోను ఎందరో మహానుభావులు. అలానే గురువు సూచించిన మార్గాన్ని పాటించి పునీతులైన మహనీయులు కోకొల్లలు. గురుశిష్యపరంపరకు ఆది మహదేవుడు. ఆయన ద్వారా విష్ణువు, బ్రహ్మ, శక్తి, పరాశరుడు, వ్యాసుడు అలానే శంకరభగవత్పాదులు మొదలైన వారు. వీరిద్వారా వ్యవస్థీకృతమైన గురుశిష్య పరంపర అత్యున్నతం, గంగాజలం, హిమశిఖరం, మహాసముద్రం. మనజాతికి జీవకొమ్మ.

ఆధునిక భారతంలో వారికి ప్రతిరూపంగా నిలిచిన వారిలో అగ్రగణ్యుడు రాధాకృష్ణన్. ఒక ఉపాధ్యాయుడు ప్రధమపౌరునిగా ఎదిగిన పరిణామం ప్రతివ్యక్తికి స్పూర్తిమంతం. విలువలతో కూడిన జీవితం, తర్కంతోనిండిన ఆలోచనలు, దూరదృష్టితో తీసుకొనే నిర్ణయాలు భావితరాలకు ఆయనను ఒక స్పూర్తిప్రదాతను చేశాయి. దేశంలోని ప్రతి ఉపాధ్యాయుడు తనవృత్తిని (బతకలేని బడిపంతులు అని హేళనచేసినా సరే) గర్వంగా చెప్పుకునేలా చేశాయి.
ఆర్ధశాస్త్రంలో పట్టాపుచ్చుకుందామన్న కోరిక. కావలసిన పుస్తకాలు కొనలేనిపేదరికం. విధి తత్వశాస్త్రంవైపు నడిపింది. దూరపు బందువు దగ్గర ఉన్న ఆపుస్తకాలే చదవాల్సి వచ్చింది. తరువాత కొంతకాలం బందరులో, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేసి తత్వవేత్తలకు పుట్టినిల్లైన బెంగాలుకి వెళ్ళారు. కలకత్తాలో ఉత్తరాది అహంభావుల మద్య తన విజ్ఞానాన్నే పెట్టుబడిగా తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నారు.

"మీవంటి మేధావి ఇక్కడకాక మాదేశంలో కనుక చదివి ఉంటే.." అన్న ఒక దొరగారికి "నిజమైన భారతీయుడు అక్కడికి విద్యను దానం చేయడానికి వస్తాడేగానీ బిచ్చమెత్తుకునేందుకు కాదు." అని చెప్పిన ఆయన తరువాతి కాలంలో ఆక్సుఫర్డుకి బోధకునిగా వెళ్లి తనమాటని నిలబెట్టుకున్నాడు. మదనమోహనమళవ్యా తన మానసపుత్రిక అయిన బెనారస్ హిందూవిశ్వవిద్యాలయానికి రూపమిచ్చేందుకు సహాయం కోరడంతో వయోభారాన్ని లెక్కచేయకుండా కలకత్తా విశ్వవిద్యాలయంలో పనిచేస్తూనే వారాంతాల్లో కాశీకి వెళ్ళి అక్కడి బాద్యతలను నెరవేర్చాడు.

స్వాతంత్ర్యానంతరం ఇక్కడి వ్యవస్థలను పునరుద్ధరించడానికి, ముఖ్యంగా విద్యావ్యవస్థ, ఆయన చేసినకృషి మరువలేనిది. ఆయన సూచనలను చాలాభాగం అమలుచేసినప్పటికీ కొన్నింటిని కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం పక్కనబెట్టారు. అందులో ముఖ్యమైనది వేదగణితం. దానిలోని అంశాలను పాఠ్యాంశాలుగా పెట్టండి. లేని పక్షంలో ఆవిజ్ఞానం మరుగున పడిపోతుంది. తద్వారా జరిగేనష్టం కేవలం హిందువులకో, భారతీయులకో కాదు సమస్త మానవాళికి. అంటూ ఆయన చేసిన సూచన అరణ్యరోదన అయింది. ఇప్పుడు కొన్ని దశాబ్దాల తరువాత ఈతరానికి దాని మూలాలు లేకుండా పోయాయి. అయినా ఎవరికీ ఆనష్టం పట్టదు.

గురుశిష్యసంబంధాలను మెరుగుపరిచే గురుకుల వ్యవస్థను పునరిద్ధరించండి అన్నారు. అప్పటి ఆర్ధికస్థితి ప్రభుత్వానికి అనుకూలించలేదు. తరువాత కొంతకాలానికి మొదలుపెట్టినా ఆరంభశూరత్వమే అయింది. మతప్రాదికనదేశ విభజనను వ్యతిరేకించిన మేధావులను ఏకంచేసి ఆయన కొనసాగించిన ప్రయత్నాలు దురదృష్టవశాత్తూ సఫలంకాలేదు.
తన తల్లిదండ్రులనుంచి నేర్చుకొని జీవితాంతం ఆచరించిన భారతీయజీవన విధానం ప్రతి వ్యక్తికీ శిరోధార్యం. ఆయన జీవితంలో అనేకప్రాంతాలవారిని, మతధర్మాలను అనుసరించేవారిని, అనేక జాతీయులను కలిశారు. ఎక్కడా తనాచరించే ధర్మంలో ఎదుటివారు వేలుపెట్టి చూపలేని విధంగా జీవించారు. తత్వశాస్త్రంలో ఆయన రచించిన గ్రంధాలు మణిపూసలు. ప్రాశ్చాత్య ప్రపంచాన్ని భారతావనివైపు చూచేలాచేశాయి. భారతీయ తత్వశాస్త్రం ఆయన రచించిన గ్రంధాలలో ఉన్నతమైనది. భారతీయ సంస్కృతికి, అందులోని ఔన్నత్యానికి నిజమైన ప్రతినిధి భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్.

ఒకప్రశ్న

" అధ్యక్షా!" ఈమాట ఎవరు అన్నా వెంటనే గుర్తొచ్చే పేరది. కాకపోతే ఇప్పటిదాకా సరదాగా ఇకపై కొంతబరువుగా. శాసనసభలో స్పీకర్‌కి కొంతసమయం పడుతుంది సర్దుకొనేందుకు. ఇకపై తాము విమర్శలను సంధించాల్సిన వ్యక్తి వేరొకరు అంటే విపక్షనాయకులకీ ఈఇబ్బంది తప్పదనుకొంటా. ప్రజలు, అభిమానులు, కార్యకర్తల సంగతి సరేసరి. మీడియాకి కొద్దిగా మినహాయింపు.

నిన్న మద్యాహ్నం వరకు తెలియదునాకు. 3పైన అమ్మఫోన్ చేసి హెలికాప్టర్ దారితప్పిందనిచెప్పింది. అదేమీకాదులేమా అనిచెప్పాను. దారితప్పితే సమాచారం ఎలా తెలుస్తుంది, దాన్ని ఎలా నియంత్రిస్తారు వివరించేసరికే ఆమె కొంచెం కుదుటపడింది. అంతలో ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి కొంచెం వివరంగా చెప్పాడు.
సాయంత్రం ఇంటికి వచ్చిచూస్తే ఇంకా గాలింపు అన్నారు. ఎదో అలజడి మనసులో.మళ్ళీ అమ్మఫోను. ఆయనభార్య గుర్తొస్తే మాత్రం అయనకేమీ కాకూడదు అనికొరుకుంటోంది మనసు. చాలా మంచావిడ. తానునమ్మిన దేవుడిని ఎప్పుడూ మరవలేదు. అంత పెద్దింటికోడలైనా, భర్త ముఖ్యమంత్రైనా ఎప్పుడూ అహంభావం చూడలేదు ఆమెకళ్లలో. రాత్రంతా ఫోన్లు. అధికారులకి కునుకులేదు. మీడియా వేడివేడి వ్యాపారాలతో బిజీ. నాయకులు వంతులేస్కొని శోకాలు( గ్లిజరిన్ లేకుండా). ఎవరి లెక్కలు వాళ్లవి. సీటుకోసం రాత్రి ఎన్ని సిట్టింగులు జరిగాయో? ఒక కాళరాత్రి అలా దొల్లుకొంటూ పోయింది.

సూర్యుడితోగూడ మనసుల్లో ఆశ చిగురించింది. ఎమైనా తెలిసిందా అని నిద్రకళ్లతోనే టీవీలముందు. ఒక్క ప్రకటన ఆశలన్నింటినీ చిదిమేసింది. ఎక్కడో మనసులో వెలితి, ఏదోకోల్పోయామన్న బాధ, గుండెబరువు ఎంతో తెలిసొచ్చిన క్షణాలు. విన్న తరువాతకూడా కళ్లుమూస్కొంటే సాక్షాత్కారం అవుతున్న చిరునవ్వు. మొత్తం ఐదుమంది అన్నారు. ఇద్దరు పైలెట్లు. వాళ్లు శిక్షణాసమయంలోనే వీటికి సిద్ధపడతారు. సెక్యూరిటీ ఆఫీసరు ఒకరు. ఈయన వృత్తికూడా అలాంటిదే. వై. ఎస్. తన ఫాక్షనిస్ట్ అనుభవాలతో మనసు సిద్ధపడిపోయి ఉంటుంది. ఇక మిగిలింది సుబ్రహ్మణ్యం. పాపం ఆయన ఊహించనిది. ఒక కార్యదర్శిగా ముఖ్యమంత్రితోకూడా హెలికాప్టరు ఎక్కుతున్నాం అనేది హోదాగా ఊహించుకొనే వృత్తి.

ఇంతలో మళ్లీ మొదలయ్యాయి వీధినాటకాలు. మీడియా నాలుగు సినిమా పాటలతో, ఎస్సెమ్మెస్‌లతో శవం మీద చిల్లర ఏరుకుంటుంది. నాయకులు శోకాలు ఢిల్లీకి వినిపించాయి. సీటుకావలనేవారు గుట్టుగా బేరాలు. మనకు అంతలేదులే అనుకొనేవాళ్లు "జగన్" (కనీసం మంత్రిపదవైనా దక్కుతుందని.) ఆమాద్మీ మాత్రం తమ నాయకుడిని తలుస్తూ కళ్ళొత్తుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన పైన వచ్చిన విమర్శలేవీ గుర్తులేవు, తానేపార్టీయోకూడా మరిచాడు, మొన్న ఓటు ఎవరికివేశాడొ ఆలోచించాల్సిన అవసరం లేదనుకొన్నాడు.

రాజరెడ్డివాళ్ల అబ్బాయి, డాక్టరు రాజయ్య, ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డి, కడప ఎంపీ వై. ఎస్., ప్రతిపక్షనాయకుడు వై. ఎస్., ముఖ్యమంత్రి ఎదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి వీటిని ఉత్సాహంగా పలికిన నాలుక ఇప్పుడు ఆపేరు ముందు వేరొకటి పెట్టాలి అంటే తడబడుతోంది. ఆమహాతల్లి ని బొట్టులేకుండా చూడాలంటే ఆఊరోళ్లకి ఎంత ఇబ్బందో?
ఎక్కడైనా అల్లర్లు లెస్తాయేమో (ఎవరైనా లేపుతారేమో.) అధికారుల్లో అలజడి. ఇంత ఉద్రిక్త పరిస్థితుల్లోనూ శాంతిభద్రతలను అదుపులో ఉంచిన యంత్రాగం నిజంగా అభినందనీయులు. ఎదైనా తప్పుజరిగితేనే వీళ్లు గుర్తొస్తారు మనకు. ఇలా చక్కబెట్టినప్పుడు ఎవరూ పట్టించుకోరు.

ఆఊరికోసం (ఈరోజుల్లో కనీసం సొంత ఊరి గురించి ఆలోచించేవాళ్లు ఎంత మంది.), దానిబాగు కోసం ఎన్నికలలు కన్నాడో. ఆయనకి మునుపు ఆప్రాంతాన్ని పట్టించుకొన్న నాధుడేలేడు. ఇక భవిష్యత్తుకూడా అంతేనేమో.
పార్టీవిషయానికి వస్తే, నేనుగెలిపిస్తా అని పలకగల్గిన ఖలేజా ఎవరికి ఉంది? 2014లో రాహుల్ ప్రధాని అవ్వాలంటే ఆంధ్ర ఎంతముఖ్యమో తెలిసిందే. మరి అప్పటికి ఎవరిపై ఆధారపడాలి? మొన్న ఎలక్షన్లలో వై.ఎస్.ని చూసి ఎంతమంది ఓటేశారు? సోనియాని, రాహుల్‌ని చూసి ఎంతమంది ఓటెశారు?

ప్రభుత్వంవిషయంలో పరిస్థితి ఇంకా దారుణం. అంతపెద్ద ప్రణాళికలు, ప్రాజెక్టులు, పధకాలు నిర్వహించాలంటే మాటలుకాదు. అన్నింటికంటే ప్రధానమైంది ప్రాజెక్టుల్లో అవినీతి. ఇప్పటిదాకా ఇచ్చిన మామూళ్లు చెల్లవు. దందాలు మళ్లీ మొదటికి వస్తాయి. చాలవరకు ప్రాజెక్టులు ఆలస్యం అవడానికి కారణం అదే. ఒకరొచ్చి మొదలు పెడతారు. పర్సంటేజీలు లెక్కేసుకొని పంచేసుకొంటారు. ఇంతలో ప్రభుత్వం మారటం. మళ్లీ బేతాళుడు చెట్టెక్కడం. ఇదంతా సర్దాలి, ఆరోపణల్ని కోర్టుల్లో, శాసనసభలో ఎదుర్కోవాలి. ఇంతదాకా కుక్కిన పేనుల్లా ఉన్న అసమ్మతి ఇక బుసలుకొడుతుంది. అధిష్టానం దగ్గర మాటనెగ్గించుకోగల పట్టు ఎవరిదగ్గర ఉంది?

కాలం తనపంధా కొనసాగిస్తుంది. తనదైన శైలిలో జవాబు చెప్తుంది. ఇప్పుడుమాత్రం తనమౌనరూపాన్ని నిశిరాత్రిలాగా భరించి, రేపటిసూర్యుడికోసం ఎదురుచూడాలి. ఐతే కుటుంబపెద్దగా ఆయనలేమిని అందరికంటే ఎక్కువ అనుభవించేది భార్యాబిడ్డలే. ఆకాలందగ్గర జవాబు దొరకనిప్రశ్న వాళ్లదగ్గర ఒకటి ఉంది.

సుడికొద్దీ

రోజూలాగానే ఆవులిస్తూ ఫైలు తిరగేస్తున్నా. పక్కకి తిరిగి సూత్తే రవన్న కూడా సేం సీన్.
అబ్బా ఈజీవితం శానా బోర్ గురూ అనుకొంటూ ఉంటే ట్రింగ్.. ట్రింగ్ .. ఇంటర్‌కాం మోగింది.
ఇటైపు చైతన్య అటైపు ఎవురూ.
నేను చైతుగాడి బాసు గాడిని.దెబ్బకి వదిలింది నిద్ర
"ఆర్యులకు సుప్రభాతం మీకు ఏరకంగా సేవలు "అందించగలను ( అంటె నెను ఉండెది సాకేతిక సేవల విభాగం)
"ఎంటనే ఉన్నఫళంగా నారూంకి వొచ్చేయ్."
"వాకే సారు" అంటూ మూడో ఫ్లోరునుంచి ఉరికా.
లిఫ్ట్ వేరేకాడ ఉంది దీన్ని నమ్ముకుంటే కుదరదు అని ఒక 50 కెలోరీలు ఉపయోగించి రెండతస్తులు దిగా. నడుస్తున్నానే గానీ మనసులో కొంచెం టెన్షన్. మామూలేకదా. అసలే ఆ మృతికా పరీక్షల వాడు లేటు చేస్తున్నాడు అడిగితే ఆకశం పక్క దిగ్గులు చూస్తాడు. ఇంకో రెండు పనులు మొదలవబోతున్నై. వేటి గురించి అడుగుతాడొ. మనదగ్గర సమాచారం ఉందో లేదో?
బాసు కేబిన్ ముందు కొంచెం చొక్కా సర్దుకొని లోపలికి వెళ్ళా.
లోన ఫాక్స్ మిషనుకాడ మూర్తి, ముందు కుర్చీలో బిపిన్, పక్కన శ్రీవాస్తవ అందరిపక్కా చూశా ఏమైనా హింటు ఇస్తారేమోనని. ప్చ్ లభంలేదు.
నేను ఒకకుర్చీలో కూర్చోబోతుండగా "ఆగు" అన్నాడు.
గుండెఝల్లుమంది. ముందు ఆయన చెబితేతప్ప కూర్చునే వాడిని కాదు. కానీ ఆయన నువ్వురావటంతోనే కూర్చో ఆతరువాతే ఏవిషయం ఐనా మాట్లాడు అన్నాడు చాలాసార్లు. పూటకి పదిసార్లు తిరిగేవాళ్లు మీరు వచ్చిన ప్రతిసారీ లాంచనాలంటే కుదరదు అన్నాడు. ఇప్పుడేమో ఇలా. ఏవిటొ ఈబాసులు. ఎప్పటికీ అర్ధంకారు. కవులంతా ఆడవాళ్లను గూర్చి అంటారు కానీ ఎవరైనా ఆఫీసులో పనిసేత్తెగా తెలిసేది వీళ్లని అర్ధం చేస్కోవటం ఎంతకష్టమో?
లేచి వెనక ఆబీరువామీద ఉండే కవరుతీస్కో అన్నాడు.
దానిదగ్గరకు పోతుంటే కొంచేం శుభశకునాలే కలిగాయి.
కవరుతీసి సూతే అందులోలడ్డు, జిలేబీ, మిక్సరుపొట్లాం, మైసూరుపాకు మొదలైనవి.
నా ఆత్రంగమనించాడొ ఏమో.. అన్నీకాదు కొంచేం పక్కవాళ్లకుకూడా ఉంచు అన్నాడు.
సరే అందాం అంటే అప్పటికే నోరు బిజీ.తలని అడ్డానికి రెండుసార్లు ఆడించి అది తప్పుడు సంకేతమని నాలుగుసార్లు నిలువుకు ఆడించా.అబ్బా ఎంతమంచిబాసో.
పుణ్యంకొద్దీ పురుషుడు.. దానంకొద్దీ బిడ్డలు
సుడికొద్దీ బాసులు.
దీన్ని సదివినోల్లు ఓసారి మీబాసులసేతకూడా సదివించండి. భూమ్మీద ఇంకా ఇలాంటోళ్లు ఈకలికాలం ఉన్నారని తెలుస్తాది. మీబాసుకు తెలుగురాక పొతే తెంగ్లీష్లోనో హింగ్లీషులోనో అనువదించండి.

నమోహిందు మాతా



నమోహిందు మాతా సుజాత నమో జగన్మాత
మాతా నమోహిందుమాత సుజాత నమో జగన్మాత

విపుల హిమాదృలే వేణీభరముగ
గంగాయమునలే కంఠ హారముగ
ఘనగోదావరి కఠిసూత్రముగా
కనులకు పండువ ఘటించుమాతా

నమోహిందుమాతా సుజాత నమోజగన్మాత

గోలుకొండనీ రత్నకోశమట
కోహినూరు నీజడలో పువ్వట
తాజమహలు నీ దివ్యభవనమట
ఆహాహా నీభాగ్యమే మాతా

నమోహిందుమాతా సుజాత నమోజగన్మాత


ఈగేయం మాచిన్నప్పుడు పాడేవాళ్లం. రాసిన మహానుభావుడి పేరు తెలీదుగానీ పాడేసమయంలో ఆయన భావావేశం మమ్మల్నితాకేది. ఇందులో తమాషా ఏమిటంటే గతంలో ప్రార్థనా సమయంలో ఆలపించేవాళ్లు. ఎవరైతే హిందూత్వం అనేది మతంకాదు, దానికి మూలాలులేవు అంటూ వాదించారో వాళ్లే ఇందులోని 'హిందుమాత ' అనేపదం మతతత్వం అంటూ వాదన లేవనెత్తారు. తమ్ముళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయి పాడటం ఆపండి అని ఆజ్ఞ. కొంతకాలానికి ఆతమ్ముళ్ల మనోభావాలు వందేమాతరంతో కూడా దెబ్బతిన్నాయి.

రాష్ట్ర పర్యటన

శ్రీ శ్రీ శ్రీ సుబ్రహ్మణ్య చైతన్య గారి రాష్ట్ర పర్యటన విజయవంతంగా పూర్తయ్యింది. గతనెల 25న వారణాసి నుంచి రైలుమార్గం ద్వారా రాష్ట్రంలోకి సిర్పూరు-కాగజ్‌నగర్ వద్ద ప్రవేశించారు. పర్యటనలో భాగంగా పలువురు అధికారులు, నాయకులు కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రొటోకాల్ సమస్యల కారణంగా వీలుపడలేదు. భద్రతా కారణాల దృష్ట్యా మీడియాను అనుమతించలేదు. 27న స్వగ్రామానికి చెరుకొన్న ఆయన మొదటిమూడు మూడు రోజులు వ్యక్తిగత పనులతో బిజీగా గడిపారు. ఆపనుల వత్తిడి కారణంగా మూడురోజుల్లో 5కిలోలు పెరిగారు( అంటె అన్నంలో తల్లిప్రేమ కొంచెం ఎక్కువైంది అన్నమాట.)

నెల్లూరులో స్నేహితుని పెళ్లికి వెళ్లి పూర్వాశ్రమపు హితులను కలిశారు. తరువాత ఇంటికివెళ్లి 2రోజులు మళ్లీ తల్లిప్రేమను నింపుకొని చుట్టుపక్కల గ్రామాల్లోని అభిమానులను కలిశారు. 5వతేదీ వరకు జిల్లాలోని వివిధప్రాంతాలను దర్శించి, సింహపురి బండికి భాగ్యనగరానికి చేరుకొన్నారు. నగరపర్యటన వివరాలు ఆయన మాటల్లోనే.

6వ తేదీ ఉదయం 8కి హైదరాబాదుకు చేరుకొన్నా. నేను చెన్నై బెంగుళూరు, డిల్లీ, మంగుళూరు, వారణాసి, కాన్‌పూరు, తిరుచ్చి, ఎర్నాకులం మొదలైన ఊర్లన్నీ తిరిగానుగానె ఈ ఊరితో నాకున్నది బీరకాయ పీచు చుట్టరికం. మొదటిసారి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్‌కి( అప్పట్లో ఒక్కచోటే జరిగేది.) 2000 డిసంబరులో వచ్చాను. తరువాత 2003లో జే.ఎన్.టీ.యు. లో ఒక పేపరు ప్రెజెంట్ చెయ్యటానికి వచ్చాను. రెండుసార్లు ఉదయం నారాయణాద్రి దిగి సాయంత్రం చార్మినార్కి తిరుగుప్రయాణం. నాకు తెలిసింది సికిందరాబదు స్టేషను, కూకట్‌పల్లి, మాసాబ్‌టాంక్. మూడొసారి 2008 మేలో జిందాల్ వాడు ఇంటర్వ్యూకి పిలిచాడు. ఈసారైనా సిటీచూద్దాం అంటే వాడుకూడ ఏంజీరోడ్డులో పెట్టాడు. ప్రాజెక్ట్ సమర్పణ అనే బృహత్కార్యాన్ని పూర్తిచేయాల్సి రావటంతో కనీసం స్నేహితుల్నైనా కలవకుండానే వేళ్లిపోవాల్సి వచ్చింది. అలా హైదరాబాదు అనేది నాకు ఒక ఎండమావిలా తయారైంది. ఎవరైనా ఏవిషయంపైన ఐనా మాట్లాడుతూ ఉంటే వాళ్లలోకి ఎంచక్కా దూరిపోయి నోటికొచ్చింది వాగేసే నేను అనబడే నేను ఒక్క హైదరాబాదు గురించి మాత్రం ఫక్తుశ్రోతలా మారిపోతాను. నాకు హైదరాబాదు తెలుసు. నేను విన్న టాంకుబండు, సెక్రటేరియట్, ఖైరతాబాద్, మాదాపూర్, కూకట్‌పల్లి, మైత్రీవనం( స్నేహపుతోట), తార్నాక, మొదలైన ప్రాంతాలతో నాకునేనుగా ఒక భాగ్యనగరాన్ని కట్టుకొన్నా. ఎప్పుడు హైదరాబాదు పేరు విన్నా మనసు నానగరంలోకి వెళ్ళి చక్కర్లుకొట్టి ఒక అరగంట తరువాత తిరిగివచ్చేది. మొత్తానికి పవనుగాడి పెళ్ళిపుణ్యమా అని 3రోజులు అక్కడే ఉండేలా ప్లాన్ చేస్కొన్నా.

రైలు దిగిన వెంటనే మావాడికి ఫోనె చేస్తే రేతిఫైల్(ఈపదం అర్ధం కావడానికి అరగంట పట్టింది. అదికూడా బోర్డుచూసిన తరువాత.) బస్టాండుకి వచ్చి కాచిగూడ రమ్మన్నాడు. అక్కడ హోటల్ మంజీరలో రూము. స్నానంచేసి కోఠిమీదుగా దిల్‌సుఖ్‌నగర్ వెళ్లి పెళ్ళికొడుకు బట్టల్లోని పవన్ గాడిని కనీసం పలకరించకుండా ముందు భోజనం బంతుల్లో కూలబడ్డా. తరువాతవాడే వచ్చి అందరినీ వాళ్ల ఇంట్లో పరిచయం చేశాడు. అక్కడినుంచి పంజాగుట్టలో గిఫ్టు ఒకటికొనుక్కొని తిరిగి కాచీగూడ వెళ్ళిపోయాం. రాత్రి 1వరకు పెళ్ళిచూసి మావాడిని అంకుల్‌నిచేసి వచ్చేశాం.

ఉదయం హరిగాడిని అడిగితే హబ్సీగూడా వెళ్తున్నా అన్నాడు. వాడితోగూడా ఉస్మానియా మీదుగా హబ్సిగూడకి చేరి నేను నాచారంపక్క ఒకచుట్టువేశాను. తిరిగివచ్చేసరికే వాడుకూడా పనిముగించుకొని నాతోకలిశాడు. సాయంత్రం అమీర్‌పేట్ బిగ్ మూవీస్‌లో అడవికి తికెట్లు తీశాను అని మా శనిగాడు ఫోన్ చేశాడు. నగరంలో మొదటిసినిమా వాడిది ఎందుకు తీశావురా అంటె అవే చవగ్గా దొరికాయిరా అన్నాడు. సినిమాచూసి( దాన్ని సినిమా అన్నందుకు క్షమించాలి. 100 టికెట్‌లో 70రూపాయలు నిషాకే అనుకోవచ్చు.) అక్కడే రాజధాని భోజనం కానిచ్చి మూసాపేట్ మీదుగా కూకట్‌పల్లికి వెళ్లా.

ఉదయానేలేచి తిరిగి రూంకి వచ్చి ఖాళీచేసి బంజారాహిల్స్ లో ఇంకో ఫ్రెండ్‌ని వెళ్లా. వాడేదో పరీక్ష ఉంది అంటే నేను జీవీకే1లో స్నేహితుడా చూసొచ్చా. (పర్లేదు. కామెడీఎ ఉంది. నానిఒగాడితో హీరోయిన్ బానే పోటీపడింది. పెద్దగా లాజిక్కులు తీయకుండా కేవలం ఎంజాయ్ మాత్రమె చెయ్యాల్సిన సినిమా.) వాడింకా రాలేదు అంటే రూంలోనే ఓయ్ కూడ కవర్ చేశా. ఇంతలో ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసి స్నేహపుతోటకి రారా అంటే అక్కడికివెళ్ళి అలానాల్గు వీధులు తిరిగి అందాల్ని వీక్షించి రీలోడ్ అయ్యాను. అక్కడే రాత్రికి నాగపూర్‌బస్సుకి టికెట్ తీస్కొని తిరిగి రూంకెళ్ళి ఫ్రెండ్స్ తో ఓగంట హస్కేసి బాగ్ సర్దుకోని 10కి బయల్దేరా. ఒకటి మాత్రం నిజం. నేను ఇప్పటిదాకా చూసిన అన్ని సిటీల్లోకి హైదరాబాదే బెస్ట్. చెన్నైలో అరగంటకే విసుగొచ్చేది. బెంగుళూరులో మొదటివారం పర్లేదుకానీ తరువాత చాలా స్లోగా ఉంటుంది లైఫ్. బద్దకం చాలా పెరుగుతుంది. ఇక డిల్లీ విషయానికి వస్తే మనంకొంచెం తక్కువమాట్లాడుకొందాం. నోయిడా పర్లేదు. మిగతా ఊర్లూ అంతే. కానీ ఇక్కడ ఎంతతిరుగుతున్నా శరీరం చురుగ్గానే గానే ఉంది. అన్నింటికీ మించి బస్సుబోర్డులు తెలుగులో ఉంటాయి కాబట్టి ఆసుఖమేవేరు.

అలా రాష్ట్రపర్యటన ముగించి 9వతేదీ ఉదయం నాగపూరు చేరుకొని, అక్కడ రాబోతున్న కొత్తప్రాజెక్టులో పనిచేస్తున్న తన మాజీ రూంమేట్‌ని కలిసి వెరైటీచౌరస్తాలో సాయంత్రంవరకు గడిపి, అక్కడినుంచి జబల్‌పూర్‌కి బస్సులో చేరుకొన్నారు. అక్కడున్న పాతస్నేహితులను ఇద్దరిని కలిసి రాత్రికి శక్తిపుంజ్‌కి తిరిగి నివాసానికి చేరుకొన్నారు.
ఇంత తిరిగిన పనికిమాలిన వాడికి కోతికొమ్మచ్చి కొనేందుకు తీరికలేదు. క్షమించగలరు.

విధిబలీయమైనది బాబయ్యా

ఉదయాన్నే లేచా .

పళ్లుతొముకొని రోడ్డుమీద పడ్డా.

అలాకాళ్లీడ్చుకొంటూ పోయి షాపు వాకిట్లో ఆగా.

కళ్లు ఎగరేసాడు 250గ్రా. ఇండెంట్ పెట్టాను.

మరీ తక్కువేమో అన్నాడు. 300గ్రా. చేశా. ఉదయానే సావుబేరం అని నసుగుతూ సర్లే అని సర్దుకొన్నాడు.

కుర్చీలో కూలబడ్డా. కొంచెం సేపటికి నిద్రపట్టేసింది. కొంచెం సుఖంగా అనిపించింది.

సడెన్‌గా కళ్లు తెరిచిచూసేసరికే ఘోరం జరిగిపోయింది.








దిక్కుమాలినోడు 300 తీస్కోమంటే అరకిలో తీసుకొన్నాడు.
వచ్చే వారంలో ఇద్దరి పెళ్లిళ్ళు ఉన్నాయి. వెళ్ల్లాలా? వద్దా? ఒకవేళ వెళ్లినా అక్కడ వీడియోవాడి కళ్లలో పడకూడదు.


విధిబలీయమైనది బాబయ్యా విధిబలీయమైనది

జలము-ద్రవ్యరాశి

యజుర్వేదంలో చెప్పబడిన ప్రకారం:
ఆకాశాత్పతితంతోయం యధాగచ్ఛతి సాగరం
సర్వదేవనమస్కారహ కేశవం ప్రతిగచ్చతి

దీనిభావం: అకాశమ్నుంచి వర్షించే ప్రతినీటిచుక్క ఎలాగైతే వివిధమార్గాలగుండా ప్రయాణించి చివరికి సాగరాన్ని చేరుతుందో మనం ఏరూపాన్ని ధ్యానంచేస్తూ నమస్కరించినా అది ఆకేశవునికే చెందుతుంది.

భూమిపైన వర్షించేనీరు మేఘాలు సాగరానమునుంచి స్వీకరిస్తుంది. ఆనీటిలో కొంతభాగం నదుల ఉపరితలంలో ప్రవహిస్తే, మరికొంతభాగం అంతర్వాహినిగా తనగమనాన్ని కొనసాగిస్తుంది. ఇంకొంతభాగం భూగర్భంలో నిలువ ఉన్నప్పటికీ ఆస్థితి శాశ్వతంకాదు. కొంతకాలానికి నెమ్మదిగా భూగర్భంగుండా సాగరాన్ని చేరుకోవలసిందే. ఉపరితలంలో ఉన్ననీటిలో కొంతభాగం ఆవిరైనప్పటికీ అది తిరిగి ద్రవీభవించి కిందైనా పడాలి లేదా మేఘాలలో ఐనా కలవాలి. అంటే భూమిపై ఆవరించి ఉన్న వాతావరణాన్ని ఒక వ్యవస్థ పరిగణిస్తే అందులో ఉన్న నీటిపరిమాణం స్థిరం.

ద్రవ్యనిత్యత్వ నియమము:

ఒకవ్యవస్థలోని ద్రవ్యరాశి, అందులో చోటుచేసుకొనే చర్యలతో నిమిత్తంలేకుండా, స్థిరము. దానిని ఒకస్థానమునుంచి మరొకస్థానికి, ఒకరూపమునుంచి మరొకరూపానికి మార్చగలమే కానీ నాశనంచేయటంకానీ సృష్టించటంకానీ చెయ్యలేము. కానీ ఈనియమాన్ని నిర్వచించినప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు, ముఖ్యంగా సాపేక్షసిద్ధాంతంపై, క్వాంటంసిద్ధాంతంపై పరిశొధనచేసేవారు, వ్యతిరేకించారు. ద్రవ్యరాశి -పదార్ధం మద్య కొంత సంఘర్షణ చోటుచేసుకొంది. ఎలక్ట్రాన్ వంటి భారరహిత పదార్ధాలు వ్యవస్థకు శక్తితోపాటు కొంత ద్రవ్యరాశిని కూడ అందజేస్తాయి అన్నది వీళ్లవాదన. ఈవివాదానికి కారణం వాళ్లు ద్రవ్య్రాశిని శక్తిని విడివిడిగా, పరస్పరం ఎలాంటి సంబంధంలేని రాశులుగా పరిగణించారు.

ఈసమస్యను పైన చెప్పిన శ్లోకంలోని రెండవ వాక్యం పూర్తిచేస్తుంది. అంటే నమస్కారం అనేది శక్తికి ప్రతిరూపంగా భావించి, ద్రవ్యరాశితోపాటుగా శక్తికిగల సంబంధాన్ని వివరించారు.

ఆత్మ-శక్తి

అలవాటు ప్రకారం ఈరోజు కూడలిలో ఉన్న టపాలను చూస్తున్నాను. అందులో ఒకటి కొంత ఇబ్బంది పెట్టింది. వాళ్లను వ్యక్తిగతంగా ప్రశ్నించే హక్కునాకు లేదు. ఎందుకంటే అదివాళ్ల బ్లాగు. పూర్తిగా వాళ్లకు సొంతం. అక్కడ అనవసరమైన వ్యాఖ్యలు రాయటం వాళ్లతో వ్యక్తిగతంగా ఘర్షణకు దారితీస్తుంది అని భావించి అక్కడ రాయలేదు. ఇది నాబ్లాగు కాబట్టి నా అభిప్రాయాలను రాస్తున్నాను.

భగవద్గీత

అధ్యాయం 2: సాంఖ్యయోగము 22వ శ్లోకం

వాసాంసి జీర్ణాని యథా విహాయనవాణి గృహ్ణాతి నరోపరాణి

తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సమ్యాతి నవాని దేహి


అధ్యాయం 2: సాంఖ్యయోగము 23వ శ్లోకం

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః

న చైనం క్లేదయంత్యాపోన శోషయతి మారుతః

పైరెండింటి అర్ధాలు చాలా మందికి తెలుసు. క్లుప్తంగా చెప్పాలంటే " ఆత్మను సృష్టించలేము. నాశనము చెయ్యలేము. అది ఒక రూపమును వదిలి మరొక రూపమునకు మారుతూ ఉంటుంది."


ఆధునిక శాస్త్రాలను అనుసరించి:


శక్తినిత్యత్వ నియమము:

ఒక వ్యవస్థలోని శక్థి స్థిరం.దానిని సృష్టించలేము. నాశనము చేయలేము. అది ఒక రూపము నుంచి మరొక రూపానికి మారుతూ ఉంటుంది.

పైరెంటిలోని సారూప్యతను అర్థం చేసుకొనేందుకు పెద్దగా కష్టంకాదు అనుకొంటా.

ఏమతం గుడ్డిగా తనధర్మాన్ని పాటించండి అని చెప్పదు. సైన్సులో ఎంత తర్కం ఉందొ దానిలో అంతకుమించిన ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. దాన్ని అర్ధం చేసుకోలేకపొతే మనలోపమే. అందుకు మతాన్ని తక్కువచేయటం ఎందుకు? ఇప్పుడు మనం సైన్సు అని పిలుచుకుంటూ చదువుకొంటున్న సైన్సు పుట్టి మహా అయితే 800 సంవత్సరాలు. మరి అంతకుముందు మనిషి జీవితంలో ఉన్నతమైన ప్రమాణాలులేవా ?

చెల్లెలి స్నేహం- అమ్మమ్మ నొప్పులు

మా ఇంట్లోంచి కెవ్వుమని కేక వినిపిస్తే పక్కింటోళ్లు కారణమేందో ఊహించడానికి పెద్దసమయం తీసుకోరు. తొంభైశాతం దానికి కారణం మాచెల్లి ఏపామునో తేలునో చూసుంటుంది. అదేంటోగాని పాకేజంతువులేవైనా తనని వెతుక్కొంటూ వచ్చేవి. నల్లకీచో తేలో కనీసం నెలకొకసారైనా పలకరించకపోతే మనకి వారంరోజులు కూడలిపక్క రాకపోతే ఎంత బాధపడుతామో అంతకంటే ఎక్కువ విలపిస్తాయి. పరుపుమడతల్లొనో, రోలువెనకాలో, టాయిలెట్లలోనొ హెల్లొ అనకపోతే దిగులుపడేవి. అదేంటొ మాకు ఎవ్వరికీ కనిపించమన్నా కనిపించవు.
ఒకసారి అమ్మ ఇంట్లోంచి సందులోకి వెళ్తుంటే వెనకాలే వెళ్లింది. ఉన్నట్టుండి కెవ్వ్.అమ్మకు కనిపించలేదు గానీ ఇదిమాత్రం తోకను చూసేసింది. ఈమద్యే పెల్లైంది. అత్తారింటికివెళ్లిన వారానికి అడ్రస్ వెతుక్కొంటూ వచ్చేసింది ఒకపిల్లపాము. వాళ్లకి కొత్తకదా పాపం బాగ గాబరాపడ్డారు. వెంటనే వాళ్లమామగారు "అమ్మాయీ ప్రతినెలా కాలాస్త్రికివెళ్లి పూజచెస్కొనిరా " అన్నాడు. ఇలా ఎందుకో కొంతమందిపై వాటికి అలా ప్రేమ- అభిమానం- ఆప్యాయత తన్నుకొస్తుంటాయి. ఈమద్య ఇక్కడ వర్షాలు మొదలయ్యాయి. తొలకర్లు పడేప్పుడు కలుగులో ఉక్కపోత భరించలేక బయటకి వస్తుంటాయి. ఇక్కడ కొంచెం ఎక్కువగా వస్తుంటాయి. రెగ్యులర్గా వాకింగ్ చేసే పాములు, షాపింగ్ చేసే పాముల్ని చూస్తున్నా ఇక్కడ. మూడురోజులుగా ఒకపిల్లపాము మాదగ్గరికి సాయంత్రం 7పైన వస్తుంది. పచ్చ పచ్చగా దానిపై ముక్కుపొడిరంగు టాటూలు వేస్కొని భలేముద్దొస్తోంది బుజ్జిముండ. మా వివేక్‌గాడు దానికి 'చింటూ' అనిపేరుకూడా పెట్టేశాడు.

మా అమ్మమ్మ గురించి రాయాలి అంటే నేనువేరే బ్లాగు తెరిచి రోజుకో టపారాసినా రామానందసాగర్ సీరియళ్లలా సంవత్సరాల తరబడి సాగుతుంది. దాదాపు 8వతరగతి వరకు అమ్మమ్మదగ్గరే ఉన్నాను. చిన్నప్పటినుంచి తాతదగ్గరే చదువుకొన్నాను కాబట్టి తాతబడి-అమ్మమ్మ ఇళ్లు. నేను పుట్టకముందు ఆమెకి ఆరోగ్యంబాలేక చాలాకాలం అవస్థలు పడింది. తరువాత కోలుకొంది. అంతాబానే ఉంటుందికానీ మందులుమింగేది కాదు. "డాక్టరు వేస్కోమన్నాడు" అని తాత అంటే "వాడా ఆవెధవ హస్తవాసి మంచిదికాదు. నాకు ఎమిబాలేదో వాడిమొహం వాడికేమి తెలుసు." అనేది. ఎక్కువ వాదిస్తే "అసలువాడు నిజం డాక్టరుకాదు. వాడు దొంగసర్టిఫికేట్లతో వైద్యం చేస్తున్నాడు. ఏదో ఒకరోజు పోలీసులు వాడిని కటకటాల్లో(చిన్నప్పుడు ఈపదం నాకు అర్ధం అయ్యేదికాదు.) తోస్తారు" అని శపించేది. తరువాత కొంతకాలానికి మాఊరికి ప్రసన్నకుమార్ (ఈనకి 6వేళ్లు ఉండేవి ఒకచేతికి. ఆరేళ్లడాక్టరు అనిపిలిచేవాళ్లు. కొంతకాలానికి ఆర్.ఎల్ డాక్టరుగా మారిపోయింది.) అనే ఆయన వచ్చాడు. మాఊరి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రి కావటంతో ఆయన్ని ప్రత్యేకంగా పిలిపించారు మాఊరికి. ఇప్పుడు నింస్‌లో ఉన్నారు. ఇక ఆమెకి మందులు వేసుకోక తప్పేదికాదు. కొంతకాలానికి మందులషాపు మీద మొదలుఎట్టింది. "డాక్టరు మంచిమందులు రాస్తున్నాడు గాని వాడు వేరేమందులు ఇస్తున్నాడు. అవినకిలీవి. ఆడాక్టరు చేతిరాత అర్ధంకాదు వీడు ఇచ్చేవి నిజం మందులో కాదో చూద్దామంటె. కాబట్టి నేనువేస్కోను." మందులువేస్కుంటుందోలేదో చూస్తారని వాటిని ఎక్కడోదాచిపెట్టి వేస్కున్నానేది.
ఇంతజరుగుతున్నా ఒకటి మాత్రం ఒక్కరోజు మిస్సైనా ఒప్పుకోదు. ప్రతిరోజూ ఊరిప్రజలు ఆమె ఆరోగ్యంగురించి కొంచెంసేపు మాట్లడి అయ్యో సుశీలమ్మా నీకుకాకపోతే ఇన్నిబాధలు. ఎలాభరిస్తున్నావమ్మా అంటూ ఆదరించి పోవాలి. ఎవడైనా కొంతకాలం రాలేదంటే తరువాత చిక్కినప్పుడు అయిపోయాడే. నేను ఎప్పుడైనా ఆమెదగ్గరికి వెళ్లి మాట్లాడకపోతే అమ్మ దగ్గర "వాడిని నేను ఎలా చూసుకొన్నాను. ఎలా సాకాను. ఇదానాకు మిగిలింది." అంటూ పాపం అమ్మ బుక్కైపోయేది.
ఇంతమందిలో చెంచయ్య అనే వ్యక్తి ఉండేవాడూ. " అమ్మా! ఈఊరినిండా ఇంత మంది ముదనష్టపు ముండాకొడుకులు ఉంటె ఆదిక్కుమాలిన జబ్బులు నీకేరావాలా. అన్నపూర్ణమ్మ తల్లిలాంటివి నీకేందమ్మా ఇన్ని కష్టాలు. అయ్యో! ఇంకెందుకు నేపోతా. కొంచేం నెయ్యి ఉంటే పెట్టుతల్లీ." ఈమెదగ్గర్నించి అలాంటివి వసూలుచేస్కోవటం ఎంతకష్టమో అందరికీ తెలుసు. అప్పటిదాకా పరవసించి వింటున్నామెకాస్తా అటుతిరిగి ఏదొ పనిచేస్తున్నట్టు నటించేది. "అమ్మగారి మనసు నాకు తెలుసు. ఆచేతితో ఎంతమంది అన్నదానం చేసిందో నేనెలా మర్చిపోగలనూ...." ఇలా మొత్తానికి నెయ్యితో మొదలుపెట్టి పచ్చడి, సాంబారు అలా అలా గిన్నెనింపుకు వెళ్లేవాడూ. నాకు తెలిసి మా అమ్మమ్మదగ్గర తీసుకెళ్లేసత్తా ఇతనికి ఒక్కడికే ఉంది. పాపం మాట్లాడుతూనే మారామమందిరం వాకిట్లోనే చనిపోయాడు. ఈవిషయం ఇక్కడ టపా పెట్టానని తెలిస్తే ఇంట్లోవాళ్ళు ఎగరేసి ఎగరేసి తంతారు.