మహారత్న

1975 నవంబరులో భారతప్రభుత్వం తీసుకున్న ఒకనిర్ణయం తాలూకు సారాంశం- "ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వ విద్యుత్తుబోర్డుల కింద జరుగుతున్న ఉత్పత్తికి సమాంతరంగా కేంద్రప్రభుత్వ పర్యవేక్షణలో ఒకప్రభుత్వరంగ సంస్థను నెలకొల్పాలి. ఈసంస్థ బొగ్గు-జలవనరులు సమృద్ధిగా ఉన్నప్రాంతాల్లో విద్యుదుత్పత్తిని చెయ్యాలి." తదనుగుణంగా జాతీయ తాప విద్యుత్తు సంస్థ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) అనే భారత ప్రభుత్వరంగ సంస్థను ఏర్పాటుచేశారు.

విద్యుత్తురంగానికి అత్యున్నత సంస్థ కేంద్ర విద్యుత్తు అథారిటీ ఈవిషయంపై అద్యయనం చేసి మేలో 1976లో 2000MW విద్యుదుత్పత్తికేంద్రాన్ని నెలకొల్పేందుకు ప్రతిపాదించారు. ఉప్పు-నిమ్మకాయ దొరికితే ఊరగాయపెట్టినట్లు బొగ్గు-నీళ్ళు నింపాదిగా ఉన్న సింగ్రౌలీ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. డిసెంబరులో కేంద్రం పచ్చజెండా ఊపింది. ముందుగా ఎంచుకున్న ఐదుప్రాంతాల్లో ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఖడియా ప్రాంతాన్ని ప్రతిపాదించారు. జయంత్ బొగ్గుగనుల నుంచి బొగ్గు, గోవిందబల్లభ పంత్ జలాశయం (రిహాంద్ జలాశయం) నుంచి నీటిని వాడుకునే దిశగా ప్రతిపాదనలు పూర్తయ్యాయి.

మొదటిదశలో 600MWకు అనుమతి లభించింది. బాలారిష్టాలన్నీ దాటుకుని 1978 ఫిబ్రవరిలో నిర్మాణం మొదలయ్యింది. ఆపై రెండొవిడతకింద మరో 1400MWకు అనుమతి జూలై 1979లో లభించింది. నవంబరు 24, 1987లో ఏడవది, చిట్టచివరిది అయిన 500MW యూనిట్‌ని గ్రిడ్‌కి అనుసంథానం చెయ్యడంతో సింగ్రౌలీ బృహత్ తాపవిద్యుత్తు గృహం (సింగ్రౌలీ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్) దేశంలోకెల్లా అతిపెద్ద తాపవిద్యుత్‌గృహంగా అవతరించింది. ఆపై ఫరఖ్ఖా, కోర్బా, రామగుండం మొదలైన చోట్ల ఉత్పత్తికేంద్రాలను నెలకొల్పారు.

1997లో నవరత్న హోదా లభించింది. ఏదైనా ప్రభుత్వరంగసంస్థ నవరత్నహోదా పొందాలి అంటే ఆరు‌అంశాలలో పనితీరు విశ్లేషించాక నూటికి కనీసం అరవైమార్కులు రావాలి. ఇలా నవరత్నహోదాను పొందిన సంస్థ ఏడాదికి వెయ్యికోట్లు లేదా సంస్థ నికరవిలువలో మూడోవంతులలో ఏది తక్కువైతే అంతవరకు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంనుంచి ముందస్తు అనుమతి అవసరంలేదు. నవరత్నహోదాతో లభించిన స్వయంప్రతిపత్తి ఎన్.టీ.పీ.సీకేగాక ఐఓసీఎల్, బీహెచ్‌ఈఎల్‌వంటి సంస్థలకు వరంగా మారింది. చిన్నచిన్నపెట్టుబడులు, ఇతరవిషయాలకు సంబంధించి అధికారగణం చుట్టూతిరుగుతూ అలిసిపోయిన ఈసంస్థలు ఒక్కసారిగా రెక్కలు విప్పుకుని గగనతలంలోకి ఎగరడం ప్రారంభించాయి. దేశవిదేశాల్లో పెట్టుబడులు, సాంకేతికసేవలు, తమరంగానికి తిర్యక్‌దిశలో ఉన్నరంగాల్లో పెట్టుబడులు, మార్కెటింగ్‌రంగం వంటివాటీలోకి ప్రవేశించడంవంటి మార్గాలద్వారా విస్తృతపరచుకున్నాయి.


ఈరోజు 30000MW సామర్థ్యంగల ఎన్.టీ.పీ.సీ. తన మూలరంగమైన తాపవిద్యుదుత్పాదనేగాక జలవిద్యుత్తు, సాంప్రదాయేతర ఇంధనవనరులు, అణువిద్యుత్తుదిశగా అడుగులేస్తుంది. ఈసమయంలో డిసెంబరు 24,2009 సాయంత్రం మూడున్నరకు కేంద్ర సమాచార ప్రసార శాఖమంత్రి అంబికాసోని చేసిన ప్రకటనతో అంతా ఒక్కసారిగా పండగవాతావరణం. నవరత్న నుంచి మహారత్నగా(just like GOOD to GREAT) ఆవిర్భవించింది.
కేంద్ర భారీపరిశ్రమలశాఖ నూరురోజుల ప్రగతిపత్రంలో భాగంగా మొదటిదశలో ఎన్.టీ.పీ.సీతో బాటుగా ఓ.ఎన్.జీ.సీ, సెయిల్ లకు మహారత్నహోదా లభించింది. ఆర్థికాంశాలను విశ్లేషించే మూడుఅంశాలలో పనితీరునిబట్టి మహారత్నహోదాను ఇస్తారు. మొదటిదశలో మూడింటికే లభించినా సమీపభవిష్యత్తులో కోల్‌ఇండియా, ఐఓసీఎల్‌ వంటి ఇతరసంస్థలకు లభించే అవకాశం ఉంది.

ఈహోదా లభించిన సంస్థలకు రూ.5000 వరకు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదు. ఈహోదాతో అంతరంగిక విషయాలలో స్వయంప్రతిపత్తి, పారిశ్రామికరంగంలో ప్రతిష్టను పొందింది. నవరత్నహోదా పొందిన సంస్థలు దేశంలోనీతరసంస్థలతో పోటీపడాలి. దేశీయవిపణిలో ముందున్నసంస్థలు అంతర్జాతీయవేదికపై పోటీపడాలన్నది మహారత్న ముఖ్య ఉద్దేశ్యం.


మూడుదశాబ్దాల క్రితం కనీసంరోడ్డుకూడాలేని నిర్మానుష్యప్రాంతంలో పడ్డ పునాదినుంచి ఎన్నోసమస్యలు. మొదట మానవవనరులు, తర్వాత ఆర్థికసమస్యలు, ఆపై సాంకేతిక సమస్యలు. పెద్దప్రాజెక్టులను నిర్మించేందుకు ఆపై ఉత్పత్తిని చేపట్టేందుదుకు సరిపడే సిబ్బందిలేమి నుంచి మానవవనరులను విదేశీసంస్థలకు అవుట్‌సోర్స్ చేసేస్థాయికి, వారిప్రాజెక్టులను పర్యవేక్షించి సాంకేతికసేవలను అందించే స్థాయికి ఎదిగింది. నిర్మాణానికి కావాల్సిన బడ్జెట్టు ఆపై బొగ్గుకొనుగోలుకు ధనంలేక సతమతమయ్యే స్థితి నుంచి లక్షకోట్ల నికరవిలువదాకా సాగింది. ఉత్పత్తిలో కీలకమైన టర్బైన్, బాయిలర్లేకాదు సహాయక యంత్రాలను సైతం దిగుమతి చేసుకునే పరిస్థితి.

సమాంతరంగా బీహెచ్‌ఈఎల్‌ సాంకేంతికంగా ఎదగడమేగాక సోదరుడిలా ఇచ్చిన స్నేహహస్తం. ప్రాజెక్టులకు కావలసిన టర్బైన్లు హరిద్వార్ ప్లాంటులో, బాయిలర్ తిరుచ్చిరాపల్లిలో, హీటర్లు హైదరాబాదులో, ఇతరయంత్రాలు మిగతాప్లాంటుల్లో లేదా జీ.ఈ., ఏబీబీ వంటి బహుళజాతి సంస్థలనుంచి కొనుగోలు. ఈరోజు ఏదైనా యంత్రాన్ని లేదావిడిభాగాన్ని సంపాదించాలంటే చాలాసులభం. కావలసిందల్లా జేబులోడబ్బే. కానీ ఆర్డరు ఇచ్చిన ఆరునెలలకి కూడా రానిరోజుల్లో మొదటితరం ఎదుర్కున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. కనీసం కుటుంబానికి సదుపాయాలు దొరకని ప్రాంతాల్లో పని. ఒకఫోనుకాల్ కోసం వారాలతరబడి నిరీక్షణ. టెంట్లల్లోనే నివాసం.

ఇన్నిసమస్యల్ని దాటుకుని ఒకప్లాంటు కడితే ఆతర్వాత బొగ్గుకొనుగోలు, సరఫరానుంచి విదుదుత్పత్తి వరకు ఎదురయ్యే ఇబ్బందులు ఒక్కొక్కదాన్ని అర్థంచేసుకుంటూ పరిష్కరించుకుంటూ ముందుకువెళ్తే బాకీలవసూళ్ళు ఇంకోసమస్య. ఇవివసూలుకానిదే కొత్తప్లాంటు సంగతి దేవుడెరుగు ఉన్నప్లాంటును నడపలేని స్థితి. సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించని రాష్ట్రప్రభుత్వాలు. నిమ్మకు నీరెత్తిన అధికారగణం.

నిర్మించిన ఏప్రాజెక్టులోనూ స్థానికులకు అన్యాయంచెయ్యలేదు. పునరావాస చర్యలకై తయారుచేసిన ఆర్&అర్ (రిసెటిల్మెంట్ &రిహాబిలిటేషన్) విథానాలను కేవలం కాగితాలకే పరిమితంకాలేదు. ప్రతిప్రాజెక్టులోనూ తు.చ.తప్పక పాటించారు. అనేకసందర్భాల్లో కేంద్రప్రభుత్వ అధికారుల నోటివెంట వచ్చినమాట "ఎన్.టీ.పీ.సీ ఆర్&ఆర్ పాలసీ ప్రభుత్వపాలసీలకన్నా మెరుగైంది." ఆసంస్థవస్తే మాబతుకులేమవుతాయో అన్న భయం ఏనాడూ ప్రజల్లో కలగలేదు. అందుకు ఉదాహరణ మనరాష్ట్రంలో నెలకొల్పిన రామగుండం మరియు సింహాద్రి. వ్యాపారలక్ష్యాలకోసం విలువలను ఏరోజూ పక్కన పెట్టిందిలేదు.


ఉత్పాదకసామర్థ్యం మొత్తం దేశసామర్థ్యంలో ఐదోవంతైనా ఉత్పత్తిలో నాలుగోవంతు ఎన్.టీ.పీ.సీ నుంచే వస్తుంది. దేశంలో ప్రతినాలుగు ఇళ్ళలో ఒక‌ఇంటిలో దీపం ఈసంస్థ ఇచ్చిన విద్యుత్తుతోనే వెలుగుతుంది.


ఆర్థికసంస్కరణలు- ఈపదం మనదేశంలో వినబడడం మొదలయినప్పటినుంచి దానిప్రభావానికి లోనుకాని రంగమంటూలేదు. బయట మార్కెట్టులో వస్తున్న మార్పులకనుగుణంగా తన పంథానుమార్చుకోనిదే ముందుకెళ్ళలేని పరిస్థితి. స్టాక్‌మార్కెట్లో పేరునమోదు, ఆర్థిక అంశాలు, ఉద్యోగుల పనితీరు, అధికార నిర్మాణం వంటి అంతరంగిక అంశాలలో మార్పులు చేసుకుని నవరత్నహోదాను పొందింది. అదేసమయంలో రాష్ట్రప్రభుత్వాల విద్యుత్తుశాఖలలో వచ్చినమార్పులవల్ల బిల్లుచెల్లింపుల సమస్యలు చక్కబడ్డాయి. ఆపై జలవిద్యుత్తులోకి ప్రవేశించింది. ఇప్పటికి మూడుప్రాంతాల్లో సుమారు 2000MW ఉత్పత్తికోసం నిర్మిస్తున్నారు.




ఈరోజు 15 బొగ్గు ఆథారిత, 7గాస్ ఆథారిత ప్లాంట్లు, అనేకప్రాంతాల్లో రాష్ట్రప్రభుత్వాలతోనూ, ఇతరసంస్థలతోనూ సంయుక్తంగా నిర్వహిస్తున్న ముప్పై పైగా ఉత్పత్తిగృహాలతో 30000MW పైగా విద్యుదుత్పత్తి చెయ్యడమేగాక మరో 18000MW పైగా ఉత్పత్తిసామర్థ్యంగల ప్లాంట్లు ఉత్పత్తిదశలో ఉన్నాయి. బీహెచ్‌ఈఎల్, కేంద్ర‌అణుశక్తిసంస్థలవంటి వాటిటొ కుదుర్చుకున్న ఒప్పందాలు, నెలకొల్పుకుంటున్న భాగస్వామ్యాలు భవిష్యత్తులో మరింతప్రగతిని సాధించేందుకు దోహదపడుతాయి.



ఒకతరంపూర్తిగా తామునడిచిన బాటలోని ముళ్లను శుబ్రంచేసిపెట్టి మేము వచ్చేసరికే జీతభత్యాల ఫలాల్నేగాక ఉద్యోగభద్రత అనే నీడని ఏర్పరచారు. ఇప్పుడు ఇచ్చినహోదా మాలాంటి కిందిస్థాయి అధికారులకి, బయటివాళ్ళకి హోదాగానే కనిపిస్తుంది. కానీ పైస్థాయి అధికారులకి అదితెచ్చిపెట్టే బాద్యత, దానితాలూకు ఒత్తిడి అనుభవించేవారికే తెలిసేది. ఇప్పటిదాకా ఏకచత్రాధిపత్యాన్ని అనుభవిస్తున్నా ఇకపై రిలయన్స్.లాంకో, టాటాలతో పోటీమరింత పెరిగే అవకాశం ఉంది. పోటీ ఆరోగ్యకరంగా ఉండి, ఆట నియమాలను పాటిస్తూ ఆడేవాళ్ళైతే ఇబ్బందిలేదు.
మహారత్నతో తెరుచుకున్న ద్వారాలు కళ్ళకు భవిష్య ఆశాకిరణాల్ని చూపిస్తున్నాయి. ఇకపై అంతర్జాతీయవేదికపై భారతకీర్తిపతాకను ఎగరవెయ్యాల్సిన బృహత్తరబాద్యత భుజస్కందాలపై ఉంచుకుని, ప్రభుత్వరంగసంస్థగా పాటించాల్సిన నియమాలు, కాపాడుకోవాల్సిన కీర్తిప్రతిష్టలను గుర్తెరిగి ముందుకెళ్ళాలి.

లిఫ్టాట

చైతన్యా! ఓసారి ఆఫోటొగ్రాఫర్ వచ్చాడేమో చూసి, వాడిని వెంటేసుకెళ్ళి స్టోర్స్, స్టీల్‌యార్డ్, ఫాబ్రికేషన్‌యార్డ్ మొత్తం ఫోటోలు తీయించు.
అలాగేసార్
****
సార్ ఫోటొలు తీయించాను.
సరే ఓసారి డైక్ దగ్గర పనెలా జరుగుతుందో చూడవయ్యా.
ఉదయమే చూసొచ్చా సార్.
ఇందాక ఏదోప్రాబ్లెం అని రాంజీ పరిగెత్తుకెళ్ళాడు ఓసారి చూసిరా.
(ఎన్నిసార్లెళ్ళాలిరా నాయనా. కాళ్లుపీకేస్తున్నాయి.)
****
చాంబర్లోంచి బయటికొచ్చి మెట్లదగ్గరకు వెళ్తుంటే ఎదురుగా లిఫ్ట్ 'ఆఆఆ..' అని నోరు తెరుచుక్కూర్చోనుంది.
ఇంతకాలానికి చిక్కావే. నేపైకెళ్లాలి అంటె బాణం కిందకి ఉంటుంది. కిందకెళ్ళాలి అంటే పైకి చూస్తుంటావ్. నీకు నార్త్ ఇండియన్ ఫీలింగెక్కువయ్యిందే. నేను తెలుగోడిని ద్రావిడుణ్ణి అని నీ రొట్టెముక్కల బుద్దిని చూపిస్తావ్. ఈరోజు నాసేవలో తరించాల్సిందే. చచ్చినట్టు నన్ను కిందకి దింపాల్సిందే అన్నానో లేదో "స్వామిరారా!" అనిపాడింది.
లోపలికెళ్ళి 'జీ'(గ్రౌండ్ ఫ్లోర్) నొక్కానో లేదో జుయ్‌మని రెండంగుళాలు కిందకి దిగింది.
నేను "ఆ.."అంటూ పైన నెంబర్లవంక చూస్తున్నా సున్నా ఎప్పుడొస్తాదా అని.
కాళ్ళుపీకట్లేదు. (ఇదేంటి కిందకి పోతుంటే కొద్దిగా పీకాలిగా)
రెండునిముషాలైనా అది రెండేచూపిస్తోంది.
అప్పుడర్థమైంది లిఫ్ట్ చెడిందని.
కెవ్వ్... కెవ్వ్... ఒసేయ్ నామీద కసి ఇలాతీర్చుకుంటావా. ఒక్కసారి బయటకి రానీ నీపన్జెప్తా.
ఒకట్రెండుసార్లు బటన్లు నొక్కా. ప్చ్
అలారం నొక్కా..లాభంలేదు.
ఇక ఇలాకాదని సెల్ తీసి బాసుకి కొట్టా.
"ఆచైతన్యా! పనెలా సాగుతుంది? అంతాఓకేనా."
నువ్వేడ దొరికావయ్యా బాబూ. త్రిలింగదేశం నుంచొచ్చి త్రిశంకుస్వర్గంలో చిక్కుకుంటే.
"సార్! లిఫ్ట్ ఆగిపోయింది. నేలోపలిరుక్కుపోయా. ఆపరేటర్కి చెప్పండి."
ఇంతలో బిపిన్ ఫోను. "చైతన్యా! లిఫ్ట్ ఇరుక్కుపోయిందా? ఇంతకీ నువ్వు లోపలున్నావా? బయటా?"
హ్మ్. టైంస్. ఇలాంటి ప్రశ్నలు మనం వేరేవాళ్లకేస్తే ఓకే. కానీ మనకేసినప్పుడే నషాలానికంటేది.
"ఒక్కనిముషం ఆగు."
పక్కన్నుంచి బాసుగొంతు." ఈడెక్కడికిపోతే వెనకాలే నేనూ పరిగెత్తాలి. ఎవడికీరాని సమస్యలు, డౌట్లు వీడికే వస్తాయి. పాతికేళ్ళుగా వాడుతున్నాం ఆలిఫ్ట్. ఎప్పుడైనా జరిగిందా."
నాటైమ్ బాబూ. ఏంచేస్తాం.
ఓపదినిముషాల్లో తలుపుబయట గొంతులినిపిస్తునాయ్.
హమ్మయ జనాలొచ్చేశారు. ఇకటెన్షన్ వాళ్ళది. వాళ్ళచావేదోవాళ్ళు చచ్చి తలుపుతీస్తారు. ఇప్పుడు గాకపోతే మరోఅరగంటకి. మరీఆలశ్యం అయితే సైటుకెళ్ళేపని తప్పిపోతుంది. అయినా ఇలాంటప్పుడుకూడా ఒక్కడినే కాకపోతే ఎవరైనా తోడుంటే ఎంతబావుండేదో."
ఇంతలో అంతరాత్మ పైన ఎక్సాస్ట్ ఫానుమీద కూర్చుని "నోర్ముసుకోరా వెథవా. లిఫ్టాట ఆడుకోను నువ్వేమైనా డెహ్రడూన్లో ట్రైనింగ్ చేశావా? నువ్వుకొడితే మైండుబ్లాక్ అవుతుందా?" అన్నాడు.
సర్లే మరీ ఊహించుకోవడకూడా తప్పేనా.
ఇంతలో ఫోను.
"మీరు ఎక్కడ ఉన్నారుసార్?"
"లిఫ్ట్లో నాయనా. ఇంతకీ నువ్వెవరు?"
"ఆపరేటర్ని సార్. మీరు ఎక్సాట్ గా ఎక్కడున్నరో చెప్పగలరా?"
"రెండో అంతస్థు"
"అక్కడీనుంచి గ్రౌండ్ ఫ్లోర్కి లెఫ్ట్ ఎందుకెక్కారు సార్?మెట్లమీద వెళ్ళిపోవచ్చుగా."
" నాఖర్మకాలి. ఒరేయ్ నాయనా నన్ను బయటకి తెప్పించావంటే మాఫ్రెమ్డుతో చెప్పి నీకు కాల్‌సెంటర్లో ఉద్యోగం ఇప్పిస్తా. నీకదే కరక్టు. ముందు నన్నుబయటకులాగేపని చూడరా."
"సార్ మీరు బాచెలర్ హాస్టల్లో ఉంటారుకదా? రవివాళ్ళ ఎదురు బిల్డింగేకదా? మీరునాకు తెలుసుసార్."
"నీకు టెంకాయకొడతా. తలుపుతీసే పని చూడరారోయ్."
"సార్ నాదగ్గర తాళం తెరుచుకోవట్లేదుసార్. వేరేదారేదైనా చూడాలి."
"హ్మ్. టైంస్."
***
బయటినుంచి బిపిన్ "చైతన్యా. భయపడకు. తెరుస్తున్నాం. తాళం వచ్చింది."
"భయంకాదు సార్. విరక్తి పుడుతుంది. ఆతాళం పనిచెయ్యదట."
"అవును. నీకెలా తెలిసింది.
"ఇప్పుడే ఫోన్‌చేసి చెప్పాడూ ఆపరేటర్ గాడు"
"సరేలే వేరేదారేదైనా ఉందేమో చూస్తున్నాం."
"నాకుతెలిసి ఒకటేదారిసార్. పైన కప్పు ఇరగొట్టుకుని తీగెపట్టుకుని పాకుతూ రావడమే."
" అంతలేదులేగానీ నోర్మూసుక్కూర్చో. నీతెలివి ఉపయోగించకు (డోంట్ యూస్ యువర్ ఓన్ బ్రెయిన్)
ఓపని చెయ్యి. మేము బయట తలుపుల్ని లాగుతాం. లోపల తలుపుల్ని నువ్వు తెరువు. అదొక్కటే దారనిపిస్తుంది"
"అలానేసార్."
గ్రేస్కల్ నాకు శక్తినిచ్చుగాక
బయటికొచ్చి చూస్తే చంద్రయాన్ చేసొచ్చిన వ్యోమగామిని చూసేందుకొచ్చినట్టు గుంపుగా జనాలు.
"మంచినీళ్ళు తీసుకో. ఏమైనా భయపడ్డావా."
"లేదుసార్. ఏముంది పదినిముషాల్లో ఎలాగోలా తెరుస్తారుగదా."
"అతను పెద్దగా భయపడ్లేదట. అక్ఖర్లేదులే."
చూస్తే గ్లాసులో ఏదో తీసుకొచ్చిన సర్వరు వెనక్కి వెళ్ళిపోతున్నాడు.
"నువ్వుమరీ భయపడుంటావేమోనని సారు ఆపిల్‌జ్యూస్ తెమ్మనాడు. నువ్వు పకపకా నవ్వుతూఉండే సరికే పంపించేశాడు. హిహిహి."
ఇక పరామర్శలు.
"అవునూ లోపల ఏబటను నొక్కావు?"
"ఆగిపోయిందని ఎలా తెలిసింది?"
"భయమెయ్యలేదా?"
"ఎంతసేపున్నావు లోపల?" (నేనేమైనా యూరీగగారిన్నా? ఎంతసేపు అంతరిక్షంలో ఉన్నానో నోట్ చేసుకోను.)
" రోజూ తిరిగేదేగదా. ఒక్కసారిగా ఆగిపోతే ఎలా అనిపిమ్చింది?"
" అన్నట్టు నీపేరు చైతన్యనా? ఇంతకాలం నీపేరు తెలీదు." (నీఎంకమ్మారేయ్.)
" మొన్న మనద్దిరం కలిసే లిఫ్ట్లో వెళ్ళాం గుర్తుందా?"
"మొత్తానికి ఈదెబ్బతో జనాలు గుట్టుగా మెట్లపై ఎక్కిదిగుతారు. కొంతమందికి పొట్టలైనా తగ్గుతాయ్."
ఇంతలో అసలీ లిఫ్టును రిపేరుచేసి ఎన్నాళ్లయింది? ఎప్పడినుంచి వాడుతున్నారు? గతంలో వచ్చిన సమస్యలు? ఇలాఇలా వాదోపవాదాలు మొదలయ్యాయి. అవి రాయకూడదు అధికార రహస్యాలు.

ఇప్పటిదాకా ఏది జరుగుతుందని భయపడ్డానో అది జరిగిపోయింది.మావానరగుంపు వచ్చేసింది. ఇక మ్యూట్ కొట్టేసి గుట్టుగా కూర్చున్నా. ఇలాంటప్పుడు మౌనమే ఉత్తమం అని అనుభవం నేర్పిన పాఠం. పైన మీకు వివరించిన యధార్థ సంఘటనలకి మసాలాదట్టించి, మంటపుట్టించి పండగ జేస్కున్నారు పింజారీకుంకలు.

సాలగ్రామ భాండాగారం 'గండకి'

విష్ణుపాదాల వద్ద జననంతో గంగకి పవిత్రత దక్కితే అవిష్ణుమూర్తినే తనలో నింపుకుని, తనఒడ్డున ఆదికావ్యానికి పురుడుపోసి పునీతమయిన నది గండకి.

హిమాలయాల్లోని నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ముస్తాంగ్ వద్ద సముద్రమట్టానికి 3900m ఎత్తులో రెండు సెలయేళ్ళ కలయికతో జన్మించిన తర్వాత సోనేపూర్ వద్ద గంగలో కలిసేవరకూ ప్రతిమలుపులో ఓనదితో స్నేహం, కొత్తస్నేహం మొదలైన ప్రతిసారీ కొత్తపేరు. ఇదీ గండకీనది గమనం.

ఓంనమఃశివాయ సీరియల్ చూసిన వాళ్లందరికీ బృందాదేవికథ గుర్తుండే ఉంటుంది. అసురరాజు నేమికి కుమార్తెగా జన్మించిన లక్ష్మీదేవి అంశ ఈమె. జలంధరుని వివాహమాడి పాతివ్రత్య ప్రమాణాలను తు.చ.తప్పక పాటించేది. జలంధరుడు బ్రహ్మవరంతో గర్వితుడై ముల్లోకాలను పీడించుకుతినడం మొదలుపెడతాడు. బృంద పాతివ్రత్యంలోనే జలంధరుని ప్రాణం ఉంటుంది. అతని దారుణాలు సహించలేని రుద్రుడు అతనితో యుద్ధానికి దిగుతాడు. అది నిజానికి పార్వతీదేవి పాతివ్రత్యానికి, బృంద పాతివ్రత్యానికి మద్య పోరాటం. జలంధరుడు తనుగెలవాలంటే గిరితనయ పాతివ్రత్యాన్ని చెడగొట్టడం ఒక్కటే మార్గమని కొన్నిదుశ్చర్యయలకు పాల్పడుతాడు. అది సహించలేని ఆమె విష్ణువును శరణువేడగా ఆయన అభయమిచ్చి "అతను తప్పుచేశాడు గనుక యుద్ధధర్మాన్ని అనుసరించి మనకు ఆస్కారమిచ్చాడు." అని చెప్పి మాయారూపంలో బృంద దగ్గరకు వెళ్ళి పాతివ్రత్యాన్ని చెడగొట్టడంతో జలంధరుడు అంతమవుతాడు. తనభార్య లక్ష్మీఅంశకు తనద్వారా పాతివ్రత్యం పోవడమేమిటో అంతా విష్ణుమాయ. ఆపై బృందకు నిజం తెలియడంతో పాషాణం కమ్మని శపిస్తుంది. బృంద గండకీనదిగా, ఆమె శిరోజాలు తులసిగా రూపాంతరం చెందాయి. ఆమె శాపాన్ననుసరించి విష్ణుమూర్తి సాలగ్రామరూపంలో పాషాణంగానూ, రావిచెట్టులో అశ్వత్థనారాయణుడిగానూ, కృష్ణతులసిగానూ, దర్భగానూ నివశిస్తున్నాడు

ఇక ప్రస్తుత భౌగోళికాంశాలను ట్టి ఆనది ప్రవాహం-

ముస్తాంగ్ వద్ద నుప్‌చ్చు-షర్‌చ్చు అనే నదులు కలవడంతో ముస్తాంగ్‌ఖోలా అనేపేరుతో ఈనది పుడుతుంది. అక్కడినుంచి వాయువ్యదిశగా ప్రవహించి కగ్బేణి వద్ద ముక్తిథామంనుంచి వచ్చే కక్‌ఖోలాను కలడంద్వారా కాలిగండకిగా పేరుమార్చుకుంటుంది.

అక్కడినుంచి దక్షిణదిశగా ప్రవహించి ధవళగిరి-అన్నపూర్ణ శిఖరాలను దాటుతుంది. ఈరెండుశిఖరాలద్యనున్న ద్రోణి ప్రపంచంలోకెల్లా అత్యంత లోతైనది. శిఖరాలకు , నది అడుగుకు మద్యనున్న వ్యత్యాసం దాదాపూ ఆరువేలమీటర్లు.
ఇక్కడినుంచి అడుగడుగునా కొత్తస్నేహాలు కలిసినప్పుడు పలకరింపులు, కొండలు అడ్డొచ్చి పాయలుగా చీలినపుడు నిట్టూర్పులు. గళేశ్వర్ వద్ద రహుత్‌ఖోలా, బేణీవద్ద మ్యాగ్దిఖోలా, కుష్మవద్ద మోడిఖోలా, రుద్రబేణివద్ద బడిగాద్ అలాఅలా.


ఆపై తూర్పుకి తనదిశను మళ్ళించి మహాభారత పర్వతశ్రేణులకు సమాంతరంగా కొంతదూరం వెళ్తుంది. ఆపర్వతాల కనుమల్లోంచి దక్షిణంగా ఉరికి దేవఘాట్ వద్ద తనప్రియసఖి త్రిశూలిని కలుస్తుంది. ఇక్కడ నారాయణిగా మళ్లీ పేరుమారిపోతుంది. అందరిలోకి తనకు ప్రియమైనవి ఏడునదులు. అందువల్ల సప్తగండకిగా కూడా పిలుస్తారు.
ఆపై హిమాలయ పర్వతపాదంగా భావించే శివాలిక్‌పర్వతాలగుండా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఉత్తరప్రదేశ్-బీహార్ సరిహద్దుల్లోని పచ్నద్, సోన్‌ నదులతో కలిసే త్రివేణి అనేప్రాంతంవద్ద మనదేశంలోకి ప్రవేశించడం ద్వారా గండకిగా పేరు మార్చుకుంటుంది. హిమాలయాల్లోంచి తనతోడు తీసుకొచ్చిన ఒండ్రును ఇక్కడ జారవిడవడంద్వారా అత్యంతసారవంతమైన భూములు ఏర్పడ్దాయి. బీహార్లోని చాంపరన్, సారంగ్, ముజఫర్‌పూర్ జిల్లాలద్వారా ప్రవహించి పాట్నా సమీపంలోని సోనేపూర్ వద్ద గంగతో సంగమిస్తుంది.

హిమాలయాల్లోని వెయ్యికిపైగా హిమానీనదాల్లోచి, ఇతరసరస్సుల్లోంచి లభించేనీటితో ఈనది ప్రవహిస్తుంది. ప్రవాహమంతా అత్యంతవాలైన పర్వతసానువుల్లోంచి కావడంతో హోరున ఉరకల పరుగులతో సాగుతుంది. అందువల్ల ఈనది వర్తక-వాణిజ్యాలకుగానీ, జలరవాణాకుగానీ పెద్దగా సహకరించదు. ఈరకమైన ప్రవాహం జలవిద్యుత్తుకు ఎంతో అనుకూలమైనది. అయినప్పటికీ మహాభారతశ్రేణుల్లోని ఒకప్రాజెక్టుతప్ప పూర్తిస్థాయిలో ఈనదిని ఉపయోగించుకునే దిశగా ప్రణాళికలు చెయ్యలేదు. మొత్తం 21000MW విద్యుదుత్పత్తికి అవకాశం ఉండగా ఇప్పటివరకు నెలకొల్పింది కేవలం 600MW. బహుశా నేపాల్ ఆర్థికస్ఠితి అందుకు కారణం అయ్యుండొచ్చు. అంతర్జాతీయ నదీజలాల ఒప్పందాలను అనుసరిమ్చి భారత్- నేపాల్ ప్రభుత్వాలు కొన్ని ఉమ్మడిప్రణాళికలు రూపొందించాయి.

నదుల అనుసంధానం ప్రాజెక్టులో ఈనది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. గంగ-బ్రహ్మపుత్ర్రనదుల మద్యభాగంలోని నదులను కలిపేప్రక్రియలొ మొదట కోసినదిని గండకీనదికి అనుసంధానం చెయ్యడం, ఆపై గండకీనదిని భారతదేశంలో ప్రవేశించేచోట బారేజిని నిర్మించి ప్రస్తుతం గంగతోకలిసే చోటుకు ఎగువన ఉత్తరప్రదేశ్లో కలిసేలా ఏర్పాటుచెయ్యలని ప్రణాళికలు చేశారు.

గండకీ ప్రవహించే హిమాలయప్రాంతం ఉపఖండామంతా విస్తరించి ఉన్నభారత టెక్టోనిక్ ప్లేటుకు, మిగతా ఆసియా మరియు యూరోపులో విస్తరించి ఉన్న యురేసియాప్లేటుకు మద్యన ఉంటుంది. వీటి కదలికల మూలంగా ఇక్కడి భూమిపొరల్లో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆఒత్తిడే హిమాలయాలు ఉద్భవించేందుకు దోహదపడ్డాయి. అందువల్ల భూస్థిరత్వం తక్కువ. అన్నపూర్ణ-ధవళగిరి మద్యన ఉన్న అత్యంతలోతైన అగాధానికి కారణంకూడా అదే. ఒత్తిడివల్ల హిమాలయాలు పెరిగినప్పటికీ వాటిపొరలు ధృడంగా లేకపోవడంతో నదిప్రవాహానికి కోసుకుపోయి అగాధాలు ఏర్పడ్డాయి. (ఒకచిన్న ఇసుకగుట్టను చేసి, దానిపైనుంచి నీటిని పోస్తే నీరు ప్రవహించే మార్గంలో ఇసుకంతా కోసుకుపోయి దారులేర్పడతాయి. అదేవిధంగా) అస్థిరమైన భూగర్భం, ప్రవాహవేగాన్ని తట్టుకునేందుకు కావల్సినంత దృడత్వంలేని పైపొరలవల్ల నదీగమనం విపరీతమైన మార్పులకు గురవుతూ వచ్చింది. గండకీమార్గం దాదాపూ ఎనభైకిలోమీటర్లు తూర్పుదిశలో జరిగింది.


ఈనదిలో దొరికే సాలగ్రామశిలలు అత్యంత పవిత్రమైనవి. వజ్రకీటమనే జీవి తనపంటితో తొలుస్తూ అందులోచేరి నివశిస్తుంది. ఆక్రమంలో వాటిపై శంకుచక్రాలు ఏర్పడుతాయి. ఈశిలలు నిజానికి సముద్రం అడుగున ఉంటాయి. మరి అంతెత్తున ఉన్న ముక్తిథామానికి ఎలా చేరుకున్నాయంటే- హిమాలయాలు ఏర్పడకముందే ఈశిలలు(అమ్మోనైట్ శిలలు) ఏర్పడ్డాయి. అప్పట్లో సముద్రమట్టానికన్నా లోతుగా ఉండేది ఈప్రాంతం. హిమాలయాలు ఎదగడంతో వాటితోపాటు ఇవీకొండెక్కాయి. ఈనది, సాలగ్రామాలు ఎంతపురాతనమో దాన్నిబట్టి అంచనావేసుకోవచ్చు. సాలగ్రామశిలలను హిందువులేగాక బౌద్ధులు సైతం పవిత్రమైనవిగా భావిస్తారు. వాళ్ళు చుమిగ్గ్యస్త (అంటే నూరుతీర్థాలు కలది అని అర్థం) అని పిలుస్తారు. ముక్తిధామం కేవలం హిందువులకేకాక బౌద్ధులకూ అత్యంతపవిత్రమైనది.

ఈనది ఒడ్డునే వాల్మీకిముని ఆశ్రమం ఉంది. ఆయన ఇక్కడే రామాయణాన్ని రచింఛాడని నమ్మకం. (తెలుగువాళ్ళు అక్కడికెళ్తే "ఇది మనఆశ్రమము ఇచట నీవు వశింపుము లోకపావనీ.." అని నాగయ్య శైలిలో పాడుకోవచ్చు.) చితావనం అనేప్రాంతంలో వన్యప్రాణి సంరక్షణకేంద్రం ఉంది. ఆర్యులు చాలాకాలం గండకీనదిని దాటి అవతలకు పోలేకపొయ్యేవాళ్ళు. ఆప్రవాహ ఉదృతికి తట్టుకుని అవతలకు చేరాలంటే అగ్నిని ఆవాహనం చేసుకోవడమే మార్గమని తలచి ఈప్రాంతాన్ని అగ్నికి సమర్పించారట. ఇవేగాక అనేక పర్యాటకస్థలాలు, వనాలు, పుణ్యక్షేత్రాలతొ ఈనది పరీవాహక ప్రాంతమంతా జీవంనింపుకుని ఉంటుంది. అనేకసాహసక్రీడలకు ఇది మంచిప్రదేశం.

విష్ణుమూర్తినే తనలో దాచుకున్న గండకి చివరకు ఆవిష్ణు పాదాలవద్ద పుట్టిన గంగలో మమేకమవడం విష్ణుమాయగాక ఇంకేమిటి?

ధనుర్మాసం సందర్భంగా ఈనది గురించి నాకు తెలిసిన విషయాలు రాశాను. ఇందులో తప్పులున్న తెలుపగలరు.
ఈరోజు మాఇంట్లో రెండు పండగలు. ఒకటి ధనుర్మాసం ఆరంభం. రెండు మాచెల్లి పుట్టినరోజు. పెళ్లయ్యాక మాబావ గరుడవాహనమెక్కించుకుని అమెరికాకి వెళ్ళడంతో ఇక్కడనుంచే పుట్టినరోజు జేజేలు బుజ్జిపాపాయి అని పాడేశా స్కైపులో. ఈటపా మాచెల్లి (మామిడిపూడి) ఉడాలి లక్ష్మిస్రవంతి కోసం.

ప్రతినిథులు

అబ్బబ్బా రోజుకి ముప్పై బహిర్గామి, ఎనభై అంతర్గామి పిలుపుల దెబ్బకి నాచెవుల తుప్పు ఒదిలిపోయింది. అదేమిటో ఈసింగ్రౌలీలో అడుగుపెట్టిన క్షణమెలాంటిదో తెలీదుగానీ ఏప్రిల్లో ఈడకొచ్చిన కాడనుంచి ఆడ జరిగే నాటకీయపరిణామాలపై చర్చించేందుకు సరైజోడీ దొరక్క నేనుపడుతున్నపాట్లు పగోడిగ్గూడా వద్దురా నాయనా.

తెలంగాణా దాదాపూ వచ్చేసినట్లే అని డిసైడైపోతే 'భిన్నత్వంలో ఏకత్వాన్ని' నిరూపించేంచుదుకు నాయకులంతా త్యాగాలకు రెడీ అయిపొయినారు. పర్లేదు ఆరేళ్ళుగా 'త్యాగమయి‌' మంచిస్పూర్తినే ఇచ్చింది. పదవుల్ని 'థూ!నాబొడ్డు' అని వదిలేస్తుంటే "పర్లేదురా మనోళ్ళు ఓటేసి గెలిపించినోళ్ళు మరీ అంత ఎదవలుకాదులే." అనుకున్నా. ఇక్కడే నాలోని అల్పజ్ఞాని బయటపడ్డాడు. ఈడ జరుగుతున్న యవ్వారాలు చూస్తే నెమ్మదిగా జ్ఞానోదయం అవుతూ ఉంది.

ఈరాష్ట్రంలో తెలంగాణా కావాలనేటోళ్ళు వద్దనేటోళ్ళు మొత్తంకలిపితే ముప్పైశాతం కూడా ఉండరు. మిగతా డెబ్బైమంది స్థితప్రజ్ఞులు( వీళ్లనే తటస్థులు అనొచ్చు). వీళ్ళకి ఎవరుచేసేది కరక్టుగా ఉంటే వాళ్లకి సపోర్ట్ ఇస్తారు. తెలంగాణాలో గొడవలు చేసినప్పుడు "ఇప్పుడింత కొట్టుకోవాల్సిన అవసరమేంది. కలిసుంటే ఏందంట ఇబ్బంది? సరే మరీ అంతలా అడుగుతుంటే ఇచ్చేస్తేపోలా." అనుకున్నోళ్ళు. తెలంగాణా ఇచ్చేయ్యండహే అనేఓడు మిగతాప్రాంతాల్లో ఉన్నారు. కలిసుంటే ఏందట ఇబ్బంది అనేఓళ్ళు తెలంగాణాలోనూ ఉన్నారు. కాకపోతే వీళ్ళు టీవీరామాయణంలో శతృజ్ఞుడిపాత్ర. పార్టీలు, మీడియా చివరికి మిగతాజనాలుకూడా వీళ్లని పట్టించుకోరు. అంటే సగటుపౌరుడన్నమాట.

మలపత్రాష్టుడు ఆమ‌'రణ‌' దీక్షతో "పరబ్రహ్మ.."పాడటంతో నాటకానికి తెరలేచింది.
నాయకులంతా పోస్టుమ్యానుల్లాగా "నీదేఊరు?" అంటూ చిరునామా అడిగిమరీ దాడిచెయ్యటంతో ఇది కిష్కిందాకాండా? యుద్ధకాండా? అర్థంకాక తలగోక్కున్నారు జనాలు. (నాకోడౌటు. అలాకొట్టించుకుణ్ణోళ్ళలో ఒక్కడైనా రియల్టర్‌గానీ, నాయకుడుగానీ కనీసం వాళ్ళచెంచాగాళ్ళైనా ఉన్నారా?)

సీనుకట్ చేస్తే...ఓవర్‌టూ డిల్లీ.
అమ్మ లెక్కలేయటం మొదలుపెట్టింది. కోస్తే ఎంత? కోయకపోతే ఎంత? మరగుజ్జులు లెక్కలేసిచ్చారు.

చిదంబరం అర్థరాత్రి అంగళ్లన్నీ మూసేసున్నా తిరిగితిరిగి రెండు నిప్పోబాటరీలు(నెల్లూర్లో తయారుచేసినాటివి) సంపాదించి రిమోట్లోవేసి అమ్మకిచ్చాడు. అసలే త్యాగమయి కదా బక్కోడి (ముక్కోడు) త్యాగాలకి ఫ్లూయిడ్లా కరిగిపోయి మీటనొక్కింది. పాపం షార్ట్ సర్క్యూట్ కొట్టింది. డామిట్! కథ అడ్డం తిరిగింది.

ఇక్కడే ప్రేక్షకులు సారీ! ప్రతినిథులు చేంజ్ కోరుకున్నారు.
రాజీనామలిచ్చేశారు. వీళ్ల అభిప్రాయాల్ని చెప్పేసినారు
కేసీఆర్‌ గొడవచేస్తున్నంతసేపు "ఆడంతయెదవా. ఇంతెదవా"అంటూ అరిచినోళ్ళ బుర్రలు ఎక్కడికెళ్ళాయో అర్థంకావట్లేదు. విడిపోదాం అన్నోడు గొడవచేశాడు, ఆస్థులు తగలబెట్టాడు అంటే అర్థం ఉంది. 'సమైక్యత‌' అనేటోళ్లకి గొడవలుచెయ్యాల్సిన అవసరం ఏంది?ఇదిఏరకంగా తెలంగాణావాళ్లకి కలిసిబతుకుదామనే భావన కలిగేలా చేస్తుంది? అంటే వాళ్ళు ఇతరులతో కలిసేబతకాలి కానీ ఇతరులకి కష్టం కలిగించేది ఏదైనా జరిగితే అదిరించో బెదిరించొ దారిలోకి తెచ్చుకుంటాం. ఈరకమైన సందేశాన్ని తెలంగాణాప్రజలకు పంపడం ఎంతవరకు సమంజసం? రాజీనామాలివ్వడం ద్వారా నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పేశాక ఈరాద్ధాంతం ఎందుకు?

అడుగడుగునా బాద్యతారాహిత్యం. కేసీఆర్ గొడవచేస్తే తెలంగాణా ఇస్తాం అని, అటుపై ఆంద్ర-సీమవాళ్లు గొడవచేస్తే గమ్ముగాఉండిపోవడం. అంటే కేసీఆర్ గొడవలేపకుంటే తెలంగాణా ఎంత వెనకబడిపోయినా పట్టించుకోనవసరంలేదు. నాయకులనుంచి వ్యతిరేకత రాకుండా ఉండుంటే ఆఆలోచన ఎంతక్రూరమైనదైనా ఒప్పుకోనుండేవాళ్ళు. అంటే ప్రజలకు ఏదిమంచో-ఏదిచెడొ చెప్పలేని స్థితిలో ఉన్నదా డిల్లీప్రభుత్వం? ప్రజలకేది మంచిదో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన బాద్యతలేదా? పార్టీకి-ప్రభుత్వానికి మద్యన సన్నని విభజనరేఖ ఉంటుంది. ఇదేమైనా పార్టీ అంతర్గతవ్యవహారమా ప్రభుత్వంలో ఎలాంటి పదవిలోనూ లేనివ్యక్తి చేత వ్యవహారం నడిపించేందుకు. కనీసం అందుకు ఎన్నుకున్నతను తటస్తుడా అంటే కాదు. నాకేమిటట అనుకునేరకం. కోతులకు పిల్లి మద్యస్థంలా జరిపించాడు.
నాటకానికి ఇంటర్వెల్ పడేసమయానికి క్లైమాక్స్ తెలిసిపోయింది.

ఈప్రజాప్రతినిథులంతా ఎవరికి ప్రాతినిద్యం వహిస్తున్నారంటారు.
రోశయ్య- బిళ్లలేని బంట్రోతుగా అమ్మకి ప్రతినిథి. ఆయనేమీ మాట్లాడకుండా గుట్టుగా కూర్చున్నా బావుండేది. ఏదోపెద్దాయన అనుకునేవాళ్లం. 'నిమిత్తమాత్రుణ్ణి‌' అనటమెందుకు.
కేసీఆర్- రాజకీయ నిరుద్యోగులకు ప్రతినిథి.
లగడపాటి- పెట్టుబడిదారులకు ప్రతినిథి.

వాళ్లవాళ్ల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకి ప్రజలమద్య చిచ్చుపెడుతున్నారు. సంబంధాలు చెడిన తర్వాత కలిసిబతకడంలో అర్థమేమిటి? అంటే డిల్లీవాళ్లకి (కాంగ్రెస్సేకాదు. ఏప్రభుత్వమైనా) విడగొడితేనే రాజకీయభవిష్యత్తు అనుకున్నరోజు ఏకేసీఆరూ అవసరంలేదు. కేక్ కోసేస్తారు. వీళ్లని నమ్ముకుని కలసుండటం అంటే కుక్కతోక- గోదారే. ఒక్కటిమాత్రం నిజం. వ్యక్తులస్వార్థానికి ప్రాంతాలమద్య అగాథాలు ఏర్పడ్డాయి. ఇప్పట్లో ఆఅగాథంపూడే అవకాశాలు మృగ్యం.
ఇప్పటికీ నేచెప్పేదొకటే -" తెలుగోడా కలిసే ఉందాం. కారణాలు అడగొద్దు. నేచెప్పలేను."

కలిసే ఉందాం

తెలంగాణా- హైస్కూల్లో చదువుకునే రోజుల్లో విన్నా మొదటిసారి ఈపదం. అప్పుడు మాసారు చెప్పాడు మనరాష్ట్రంలో మూడుప్రాంతలురా అబ్బయ్యా. కోస్తా, తెలంగాణా మరియు రాయలసీమ అని ఉన్నాయి అని మాపులో చూపెట్టాడు. ఆతరవాత మనం అరవోడినుంచి రాష్ట్రాన్ని ఎలా సాథించుకుంది తెలిసొచ్చింది. మనపుణ్యమాని మరిపదిభాషలకి సొంతగూళ్ళు ఏర్పడ్డాయి. ఇక్కడదాకా కథబానే ఉంది. మిగతాది మనకందరికీ తెలిసిందే. కాకపోతే నాకు చిన్న అనుమానాలున్నాయి. సందేహ నివృత్తి చెయ్యగలరా?


ప్రత్యేకరాష్ట్రం అడిగారు బానే ఉంది. మద్యలో పొట్టిశ్రీరాములు ఏమిచేశాడు? ఆయనని ఎందుకు కించపరచడం? ఆయన నిరాహారదీక్షని శాంతియుతంగానే చేశాడు. కాంగ్రెస్సువాడయినా అథిష్టానానికి భయపడలేదు. అన్నింటికీమించి తెలుగోళ్లకి ఏమికావాలో చెప్పాడే తప్ప తమిళుడిని పల్లెత్తుమాటన్న దాకలాలు లేవు. ఆయన చనిఫొయాకే గొప్పతనం తెలిసొచ్చింది జనాలకి. ఆతర్వాతే విగ్రహాలు వెలిశాయి. ఇవేవీ ఆయన బతుకున్నప్పుడు కోరుకుందికాదు. ఆయనచేసిన పోరాటం 'విశాలాంద్ర‌' కొరకే తప్ప తెలంగాణా విలీనం కోసంకాదు. ఆంద్రరాష్ట్రం ఆంద్రప్రదేశ్‌గా మారింది ఆయనపోయిన తర్వాత కొన్నేళ్ళకి. మరి ఆయనపై ఎందుకు ద్వేషం?


తెలంగాణా ఆంద్రలో విలీనంకాకముందు ఏంత అభివృద్ధిని సాథించింది? అక్కడికెళ్ళి ఇతరులు బాగుపడ్డారు. ఇదినిజం. మరీ అంత అసూయైతే ఎలా? ఏమి వేరేప్రాంతాలకి వెళ్ళినోళ్ళు బాగుపడకూడదా? తెలంగాణానుంచి నాగపూరు, ముంబాయికి వెళ్ళి వ్యాపారాలు చేసేవాళ్ళెంతమంది? బెంగుళూరులో ఉద్యోగాలుచేసేవాళ్లలో తెలంగాణావాళ్ళు లేరా? ఆప్రాంతం వెనకబాటుతనానికి వేరెవరోకాదు అక్కడి భూస్వామ్యవ్యవస్థే కారణం. వాళ్లు అటు మద్యతరగతివాళ్ళను ఎదగనీకుండాచేసి ఇంకోపక్క కోట్లలో పన్ను, లక్షల్లో బిల్లులు ఎగవేసి పబ్బం గడుపుకున్నారు. దానికి సామాన్యుడు బలయ్యాడు. తొంభైలకి ముందు అక్కడ సక్రమంగా బిల్లులు కట్టేవాళ్ళేంతమంది? ఇది నేను(కోస్తావాడిని) చెప్పేదికాదు. కరీంనగర్లో పుట్టిపెరిగిన నాస్నేహితుడు చెప్పిన కారణం.

.
తెలంగాణా ఎదగగలేదన్నది నిజం. కానీ దానికి ఈతరప్రాంతాలవాళ్లని బాద్యుల్ని చెయ్యడమేంటి? ఎంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు కాలేదు. మనతెలుగోడని గర్వంగా చెప్పుకునే పీవీకూడా ఈప్రాంతంవాడెకదా?(ఆయన్ని కేసీఆర్ కలిసినప్పుడు అంతగా స్పందించలేదని విన్నా అప్పట్లో)


కేసీఆర్ని తిడితే తెలంగాణాని తిట్టినట్లా? వైఎస్నో, బాబునో చివరికి మన్మోహన్ని తిట్టినా ఒకరాజకీయ నాయకుడిని తిట్టినట్లు. కానీ అదేంచిత్రమో కేసీఆర్ దగ్గరికొస్తే మేటర్ మారిపోద్ది. నిజానికి ఉద్యమానికి కేసీఆర్ ఒకగుదిబండ. రాజకీయంగా నెగ్గుకురాలేక ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న నీచుడు. వాడివల్ల నష్టపోయినోడు తెలంగాణావిద్యార్థే కదా? అలాంటప్పుడు కనీసం మాటమాత్రానికైనా మంచిచెప్పాలి కదా? చోద్యంచూస్తూ వాళ్లని వాడుకున్నాడు. ఎవడండీ ఈరోజుల్లో చదువులు పక్కనపెట్టి ఉద్యమాలంటూ తిరిగేది? ఎవడి ఒత్తిళ్ళు వాడివి. ఎవడిపోటీ వాడిది. ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణా వేరు. కేసీఆర్ వేరు. తెలంగాణా కేసీఆర్ మీద ఆథారపడలేదు. కేసీఆరే తెలంగాణాపై ఆధారపడ్డాడు.


విడిపోతాం అనుకున్నోళ్ళు విడిపోండి. దానికోసం ఇతరులపై బురదజల్లడం ఎందుకు? మద్రాసునుంచి ఇక్కడికొచ్చారు మీకోస్తావాళ్ళు అంటుంటారు కొంతమంది. అవును ఎక్కడ అవకాశాలుంటె అక్కడికొస్తాం. హైదరాబాదుకెలా వెళ్తున్నారో బెంగుళూరు, నోయిడా, గుర్గావ్ కీ అలానేవెళ్తున్నారు. కాకపోతే సమస్య ఎక్కడొచ్చిందంటే ఈసమస్య గురించి ఎవడు మాట్లాడినా వాళ్లవాళ్ళ లాభనష్తాలకు అనుగుణంగానే మాట్లడుతారు. కోస్తావాళ్లయినా, సీమవాళ్లైనా చివరికి తెలంగాణావాళ్ళయినా. ఎవడూ గతిలేక రావట్లేదు అక్కడికి.


అక్కడ అవకాశాలు సృష్టించిమ్దెవరు? ఇదినేను వాదించడానికో తగువులాటకో కాదు.వాదించుకునేందుకు రెండుపక్కలా బలమైన పాయింట్లు ఉంటాయి.లేకుండే ఇవ్వాలా వద్దా అన్న విషయంపై ఇంతనాన్చుడు జరగదు.
తెలంగాణా కావలనుకున్న వాళ్లకి తెలుగుతల్లి విగ్రహాలతో, గీతాలతో ఏం పని? వాటిలో ఎక్కడైనా తెలంగాణాని తక్కువచేసి చూపారా? ఉమ్మడి మద్రాసురాష్ట్రం నుంచి విడిపోయేప్పుడు తమిళభాషని, అక్కడి సంస్కృతిని ఎవడూ హేళనచెయ్యలేదే? మనకేమి కావాలో అడగడంలో ఒక పద్దతి ఉంటుంది. ఆపద్దతి తెలీని మూర్ఖులచేతిలోకి ఉద్యమం పోవడమే ఈవిషసంస్కృతికి మూలకారణం. వీళ్లచేతిలో తెలంగాణా ఉంటె ప్రత్యేకరాష్ట్రమైన తర్వాత దానికి ఒరిగేది శూన్యమే.




తెలంగాణాకు మించిన కరువు రాయలసీమలో ఉంది. ఉత్తరంద్రలోనూ అదేస్థితి. నెల్లూరు,ప్రకాశాలు పర్వాలేదు. అంతకుమించి కోస్తాలో ఇరగదీసేంత అభివృద్దేమీ లేదు. అసలీ గందరగోళానికి మూలకారణం కృష్ణా, గుంటూరోళ్ల నోటిజిలే కారణం. ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదినిజం. ఇక తెలుగు అనే విషయానికొస్తే నిజంగా తెలంగాణావాళ్లంత భాషాభిమానులు ఉండరు. మనఊళ్ళలోకి ఇంగ్లీషుమీడియమొచ్చి ఎన్నేళ్ళయింది. ఈమద్యలో మనభాషెంత మారింది? మరి శతాబ్దాలుగా నిజాంహుకుం మద్యన ఉర్దూలోనూ చదువుతూకూడా అక్కడ తెలుగుబట్ట కడుతుందంటే ఎవడిగొప్ప.
చివరిగా- " తెలుగోడా కలిసే ఉందాం. కారణాలు అడగొద్దు. నేచెప్పలేను."