మేరునగ తప్పిదం- 5. సైనికులతో చదరంగం

సైన్యాన్ని మరింతముందుకు పంపాలని ప్రభుత్వంనుంచి ఒత్తిడి వచ్చినప్పుడల్లా జనరల్ తిమ్మయ్య మొండిగా వ్యవహరించడం నాయకులకు అసహనాన్ని తెప్పించింది. తూర్పుదళానికి నాయకత్వం వహిస్తున్న జనరల్ థాపర్ కూడా ఆయనకు మద్దతిస్తూ భౌగోళికంగానూ, ఆర్థికపరంగానూ మనకున్న పరిమితులను వివరిస్తూ సుదీర్ఘ నివేదిక ఇవ్వడంతో చేసేదేమీలేక గుట్టుగా ఉండిపోయారు. తిమ్మయ్య పదవీ విరమణ చెయ్యడంతో ఆయనకు వారసుణ్ణి వెతకాల్సిన పని ప్రభుత్వంమీద పడింది. జనరల్ థాపర్ తిమ్మయ్యతో ఏకీభవించినవాడు కావడంతో ఆయనకు పెన్షన్ ఇచ్చి పంపేసింది. లఢాఖ్లో దళాలకు నాయకత్వం వహిస్తున్న జనరల్ వర్మను పక్కన పెట్టడంతో మనస్తాపంచెంది ఆయన రాజీనామా సమర్పించాడు. జనరల్ థొరట్ కూడా మాటవినేరకం కాదని ఆయన అభ్యర్థిత్వాన్ని బుట్టలోపడేశారు. అలా నిబద్దత, నిజాయితీతోపాటు సర్వీసు ఉన్న అధికారులను పక్కన పెట్టడంద్వారా నాయకులు తమ అడుగులకు మడుగులొత్తే వ్యక్తిని ఆస్థానంలో కూర్చోబెట్టేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. అలా జనరల్ బీ.ఎం.కౌల్ సైన్యాధ్యక్షుడుగా బాద్యతలు చేపట్టాడు. 


జనరల్ కౌల్ వచ్చీరావడంతోనే 'ఫార్వర్డ్ పాలసీ'ని భుజంమీదవేసుకుని తిరగటం మొదలుపెట్టాడు. నెహ్రూ- కౌల్, థాపర్, మీనన్లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఒకమ్యాపులో చైనా ఆక్రమించుకున్న ప్రాంతాలను చూపెడుతూ "మనము కూడా వీలైన చోట పోస్టులను ఎందుకు ఏర్పాటు చెయ్యకూడదు? చైనా చేస్తున్నప్పుడు మనము చెయ్యకూడదా?" అని అడిగాడు. అందుకు థాపర్ బదులిస్తూ మనకున్న ప్రతికూలాంశాలను వివరించాడు. "సరిహద్దు ప్రాంతానికి సరైన మౌలికసదుపాయాలు లేవు. ఒకవేళ మనం ఎక్కడైనా పోస్టును ఏర్పాటు చేస్తే చైనా దాన్ని ఆక్రమించుకొనే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే మరింత అభాసుపాలవుతాం. సైన్యం ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది." అని తెలియజేశాడు. దానికి నెహ్రూ ప్రతిస్పందిస్తూ " చైనా మనమీద యుద్ధం చేస్తుందని నేను అనుకోను. నాకు ఆవిషయంలో నమ్మకముంది. మనకున్న పరిమితుల కారణంగా చైనాతో పోటీపడి పోస్టులను నిర్మించలేము. కానీ ఎలాంటి వివాదంలేని, మనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో పోస్టులను కడదాం. వాళ్ళు ఒకచోట ముందుకొస్తే మనం ఇంకొకచోట ముందుకెళదాం.మనం ఈరకంగా చదరగం ఆడదాం. ఇది చైనాకు మహా అయితే చికాకు తెప్పిస్తుంది. అంతకన్నా ఇంకేమవ్వదు." అన్నాడు. ఇంతకీలకమైన విషయం గురించి నెహ్రూ పార్లమెంటుకుగానీ, క్యాబినెట్టుకుగానీ, సర్వసైన్యాధ్యక్షుడైన రాష్ట్రపతికిగానీ, రక్షణ మండలికిగానీ సమాచారమివ్వకుండా ఏకపక్షంగా తీసుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిది. ఆయన ఆలోచనలన్నింటికీ మూలం "చైనా యుద్ధం చెయ్యదు." అన్న ఒక్కఊహ. అదికాస్తా అబద్దం అని తేలినప్పుడు బలయ్యింది సైనికుడు. పరువు పోగొట్టుకున్నది భరతజాతి.

జనరల్ కౌల్ గౌహతీలో సైనికాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ ఫార్వర్డ్ పాలసీని నెహ్రూ అభిప్రాయంగా చూపెట్టి వాళ్ళ అభిప్రాయాన్ని కోరాడు. అప్పటీకే దానికి నెహ్రూట్యాగ్ పడిపోవటంతో మిగతావన్నీ లాంచనప్రాయమయ్యాయి.  
అయితే రక్షణరంగ నిపుణుల అభిప్రాయం వేరేగా ఉంది. జనరల్ కౌల్ తెలివిగా అటు బయటి వాళ్లకి నెహ్రూపేరు చెప్పి ఒప్పించి, ఇటు నాయకులకు సైనికాధుకారులు సమ్మతిని తెలియజేశారని చెప్పడంతో తన పని పూర్తిచేసుకున్నాడు. దీనివల్ల ఒకవేళ ఇది విజయవంతమైతే సైన్యాధ్యక్షునిగా ఎనలేనిపేరు. పోనీ వైఫల్యం చెందిందా ఆచెడ్డపేరు నెహ్రూకి. కొన్ని సందర్భాల్లో సైనికులు విధిగా ఆచరించే అధికారక్రమాన్ని కూడా పక్కనబెట్టి కిందిస్థాయివారితో నేరుగా కలవడాన్ని చూసిన ప్రతి ఒక్కరికీ ఫార్వర్డ్ పాలసీ ఈయన స్వంతనిర్ణయమనే అనుమానం చాలా బలంగా కలిగింది.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 4 INDIAN DIVISION ను పంజాబ్ నుంచి అస్సాం సరిహద్దుకు వెళ్ళాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే- ఈదళం మైదానాల్లో పోరాడటానికి తర్పీదు పొందింది. ఎవ్వరికీ పర్వతాల్లో పోరాడిన అనుభవంలేదు. వాళ్ళ దగ్గరున్న సామాగ్రి అందుకు తగినదీ కాదు. పర్వతాలకు మైదానాలకు మద్య ఉన్న కొన్ని ముఖ్యమైన బేధాలు- మైదానాల్లో యుద్ధం ఆరుబయట జరుగుతుంది. దళం గుంపులుగా విడిపోయి ఒకేసారి అనేకచోట్ల దాడి చేస్తుంది. పర్వతాల్లో అనుకూలమైన ప్రాంతాలు కొన్నే ఉంటాయి. ముందు వాటిని చేజిక్కించుకుని, గుహల్లో దాక్కుంటూ దాడి చెయ్యాలి. మైదానాల్లో రవాణా పెద్ద ఇబ్బందికాదు. అదే పర్వతాల్లో పూర్తిగా వాతావరణంమీద ఆధారపడాలి. రవాణాకోసం కంచరగాడిదలవంటి జంతువులమీద, హెలికాప్టర్లమీద ఆధారపడాలి. అలానే మైదానాల్లో సామాగ్రిని పెద్దపెద్దడబ్బాల్లో తీసుకొస్తారు. అదే పర్వతాల్లో వాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నచిన్నభాగాలను తీసుకెళ్ళి బిగించుకుంటారు. వ్యూహాత్మకంగా పర్వతాల్లో పోరాడాలంటే అన్నింటికన్నాముందు వీలైనంతప్రాంతాన్ని నియంత్రించగలిగిన ప్రదేశాన్ని కనుక్కొని దాన్ని చేజిక్కుంచుకోవాలి. ఇలాంటి వ్యూహాత్మకవిషయాల్లో తర్పీదు చాలా కీలకం. 4 INDIAN DIVISION వారివెంట తెచ్చుకున్న చాలావరకు సామాగ్రి భారీవి కావడంతో హిమాలయ పర్వతపాదాల వద్ద వదిలి వెళ్ళాల్సి వచ్చింది.

తరువాత 1/9 గూర్ఖాదళంనుంచి రెండుకంపెనీలను సిమ్లానుంచి పంపగా అవి రెండునెలల తర్వాతగానీ చేరుకోలేక పొయ్యాయి. వీటికి మాత్రం హిమాలయాల్లో పనిచేసిన అనుభవం ఉంది. 4 INDIAN DIVISIONకు భూటాన్ నుంచి బర్మా వరకు గల 360మైళ్ళ సరిహద్దును కాపాడాల్సిన బాద్యతను అప్పగించారు. ఆసరిహద్దు వెంబడి రోడ్లు లేకపోవడంతో ఒకప్రాంతం నుంచి మరొకప్రాంతానికి వెళ్ళాలంటే పర్వతాలను దిగి బ్రహ్మపుత్రలోయలోకి వచ్చి తర్వాత మరొకపర్వతాన్ని ఎక్కాలి! ఇక్కడ ఎలాంటి నివాసాలుగానీ, జంతురవాణాగానీ లేవు. కానీ డిల్లీలోని నాయకులు మాత్రం ఏర్పాట్లను చూసి సంతుష్టులయ్యారు. సభలో సమాధానం ఇవ్వడానికొక అనుకూలాంశం దొరికింది. కానీ ప్రజలకు మాత్రం మరొక ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. సైనికులని అక్కడకు పంపడం మినహా పంపిన తర్వాత చేపట్టాల్సిన ప్రణాళికలు రూపొందించడంగానీ, లక్ష్యాలను నిర్దేశించడంగానీ జరగలేదు.

ఒకదళం పంజాబ్ నుంచి అస్సాంకి వస్తుందన్న సంగతి స్థానిక అధికారులకు తెలియనే తెలియదు. తీరా అక్కడికి వెళ్ళాక "మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారు? మీ అవసరం ఏమీలేదు. చైనా మనమీద యుధ్ధం చెయ్యదు." అని చెప్పసాగారు. అక్కడ పరిపాలన అంతా NEFA Administration చూసుకుంటుంది. ఇది విదేశాంగశాఖ కింద పనిచేస్తుంది!! ఆప్రాంతాన్ని మనదేశంలో భాగంగా మనం చెబుతున్నప్పుడు అక్కడ మిగతాప్రాంతాలమాదిరిగానే రాష్ట్రప్రభుత్వమో, గవర్నర్ పాలనో, స్థానికసంస్థలో ఉండాలి. ఒకవేళ సున్నితమైన ప్రాంతం అనుకుంటే దాన్ని కేంద్రహోంశాఖకు అప్పగించాలి. అంతేగానీ మద్యలో విధేశాంగశాఖ ఎక్కడినుంచి వచ్చింది! అలాగే అక్కడి రక్షణ వ్యవాహారలన్నీ చూసుకునే అస్సాం రైఫిల్స్ కూడా రక్షణశాఖకింద కాకుండా విదేశాంగశాఖకింద పనిజేస్తుంది! కానీ ఈరెండింటికీ పొసగదు. కానీ సైన్యం ఇక్కడకు రావడం వీటికి ఇష్టంలేదు. ఈఒక్క విషయంలో మాత్రం అక్కడ భారత పరిపాలనా వ్యవస్థ ఉంది అని బలంగా నమ్మొచ్చు! ఏచిన్న సహాయంకోసం స్థానిక అధికారులదగ్గరకు వెళ్ళినా "ఇక్కడ మీ అవసరంలేదు. వెళ్ళిపోండి."అన్న నిర్లక్ష్యపు సమాధానమే సైనికాధికారులకు ఎదురైంది.

గూర్ఖాదళంలో ఒకకంపెనీని బొండిల్లా అనే ప్రాంతానికీ, మరొక కంపెనీని తొవాంగుకు పంపారు. ఆరెండు కంపెనీలు అనేక ప్రాంతాలు మారుతూ చివరికి ఆగష్టు 1960 నాటికి ఈరెండూ తొవాంగులో కలిశాయి. అంటే ప్రధాని సభలో ప్రకటన చేశాక ఒక్కసంవత్సరానికి సైన్యం అక్కడికి చేరుకో గలిగింది. మొదట చేరుకున్న కంపెనీకి ఒక నివాసప్రాంతం, ఒక బంగళా దొరకగా రెందవ దానికి అవికూడా ఏర్పాటు చెయ్యలేకపోయారు. ఎవరి అశక్తత వారిది.

సైన్యం స్వయంగా కార్యాలయము, గిడ్డంగులు,  ఇళ్ళు కట్టుకునేందుకు సంకల్పించగా వారికి స్థలం దొరకడం గగనమైంది. తొవాంగ్లోనే కట్టుకునేందుకు పూనుకోగా అక్కడీ స్థానికులు ససేమిరా అన్నారు. సైన్యం మరికొన్ని ప్రాంతాలు సూచించగా ప్రతిదానికీ ఇక్కడ రిసార్ట్ కట్టబోతున్నాం, అక్కడ కాలేజీ వస్తుంది, మరోచోట అమ్యూజ్మెంట్ పార్క్ వస్తుంది అంటూ బ్లూప్రింట్ ముందుపెట్టి అరచేతిలో స్వర్గం చూపించసాగారు. దీంతో విసుగెత్తిన బ్రిగేడియర్ రణబీర్ సింగ్ అనే రాజపుత్రుడు ఒకరోజు ఉదయాన్నే తమదళం ఝెండా అయిన అరుణ గరుడపక్షిని ఎగరేసి ఇదే మాసైనికపోస్టు అని ప్రకటించడంతో అధికారులంతా మిన్నకుండిపోయారు.

తూరుదళానికి జనరల్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్ అయిన జనరల్ థోరట్ అక్కడి వాస్తవ పరిస్థితుల మీద యధాతధ నివేదిక (appreciation) తయారు చేశాడు. ఆయన చెప్పిన దానిప్రకారం మొత్తం ప్రాంతానికి అత్యంత కీలకమైన ప్రాంతం బొండీల్లా. అస్సాంలోకి శత్రువు చొచ్చుకుపోవాలంటే ఏదారిలోంచి వచ్చినా దీన్నిదాటి రావాల్సిందే. అంటే దీన్నిదాటి ముందుకెళ్ళాలంటే సరిపడినంత బలగాల్ని ముందు ఇక్కడ పెంచుకోవాలి. మక్ మహోన్ రేఖను రక్షించుకోవాలంటే దానిదగ్గరకు వెళ్ళి పోరాడటం సాధ్యంకాదు. దానికి ముందు ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉందో అక్కడ మనబలం పెంచుకున్నప్పుడు అది తనకు తానుగా మన ఆధీనంలోకి వస్తుంది. ఇది పర్వతాల్లో పోరాటానికి మూలసూత్రం. పర్వతప్రాంతాల్లో ఇలాంటి కీలకప్రాంతాలు సరిహద్దురేఖల దగ్గర ప్రతిసారీ ఉండవు. నిజానికీ సరిహద్దు దగ్గరగా ఉండకుండా రెండుదేశాలూ ప్రయత్నిస్తాయి.

కానీ దురదృష్టవశాత్తూ మన నాయకులకి ఇలాంటివి బోధపడవు. తమ రాజకీయావసరాలకు అనుగుణంగా లేనప్పుడు అది ఎంత కీలకమైన అంశమైనా తుక్కు కిందే లెక్క. సరిహద్దును రక్షించడం అంటే ప్రతి అంగుళాన్నీ జయించడం అన్నది అసాధ్యం. అందునా పర్వతాలమద్యన చైనా వంటి బలమైన శత్రువును ఎదుర్కొనేటప్పుడు అది కుదరదు గాక కుదరదు. మనం చెయ్యగలిగిందల్లా చొరబాట్లను అరికట్టడమే. అందువల్లనే థోరట్ కేవలం ఒక్క కంపెనీని మాత్రమే సరిహద్దుకు దగ్గరగా ఉండే తొవాంగ్ దగ్గర పెట్టి మిగతావారిని వెనకాల ఉంచాడు. అక్కడక్కడా మన పోస్టులను నెలకొల్పినా వాటిని కేవలం ఆప్రాంతం మనది అని చాటుకోవడానికి వాడుకోవాలి. అంతేగానీ వాటికోసం ఎక్కువ వనరులను ఖర్చు పెట్టగూడదు. అందుకనుగుణంగా జనరల్ థోరట్ తయారు చేసిన ప్రణాళికకు ఆయన పై అధికారుల సమ్మతి అయితే లభించిందిగానీ ప్రభుత్వానుమతి మాత్రం దొరకలేదు! ప్రభుత్వం పదేపదే చైనాయుధ్ధంరాదని చెబుతూ సైన్యాన్ని సరిహద్దు దగ్గరగా తీసుకుని వెళ్లమని ఒత్తిడీ చెయ్యసాగింది. తమ రాజకీయ మనుగడకు ఇదితప్ప వేరేదారి లేదని నాయకులు బలంగా విశ్వసించసాగారు. "సైన్యం అక్కడ ఉంటే చాలు. పోరాడవలసిన అవసరంలేదు. ఒకవేళ చైనా గీతదాటి లోపలకి వస్తే ఇవతల మాసైన్యంకూడా ఉంది అని చూపించగలిగితే చాలు. ఇంతకన్నా పెద్ద లక్ష్యాలు సైన్యానికి మేము నిర్దేశించబోము." అని సాక్షాత్తూ రక్షణమంత్రే పేర్కొంటే ఇక మాట్లాడెదేముంది.

1944లో జపాన్ బలగాలు బర్మా సరిహద్దు దగ్గర దాడూలకు పాల్పడినప్పుడు భారత సైన్యం వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గింది. జపాన్కు అనుకూలమైన ప్రాంతం లభించక వెనుతిరగాల్సి వచ్చింది. ఇలాంటి ఉదాహరణలు చరిత్రలో కోకొల్లలు ఉన్నా భారత నాయకులకు యుద్దాల మీద అవగాహన శూన్యం. చైనీయులకు టిబెట్ పీఠభూమి రూపంలో అనువైన ప్రాంతం వరంలాగా దొరికింది. మనసైన్యం మాత్రం పూర్తిగా పర్వతప్రాంతాల్లో, విపరీతమైన వర్షపాతం, చలి మద్య గడపాల్సి వస్తుంది. పసలేని నిర్ణయాలు పైనుంచి ఉత్తర్వులుగా వెలువడుతూ ఉండటంతో అధికారులు వాటిని అమలుపరచాల్సి వస్తుంది. రాజధాని రాజకీయాలు అర్థం చేసుకోలేని సైనికుడు తానిప్పుడు చదరంగంలో పావునని, ఎప్పుడైనా ఎరగా వేస్తారని తెలియక సణుగుతూనే అధికారుల ఆదేశాలు పాటిస్తున్నాడు.

భారతదేశంలోని నాయకులెవరికీ యుధ్దవ్యూహాలపై అవగాహనలేదు. వాళ్ళు అప్పటీదాకా చూసినవన్నీ అల్లర్లు మాత్రమే. చైనావంటి బలమైన శత్రువుతో పూర్తిస్థాయి యుద్ధం గురించి ఊహాచిత్రాన్ని గీసుకునే సామర్థ్యంకూడా వాళ్ళ మస్తిష్కాలకు లేవు. అలాంటి సమయంలో తీసుకునే నిర్ణయాల్లో ఏదైనా వ్యూహాత్మక తప్పిదాలుంటే తెలియజెయ్యాల్సిన బాద్యత సైనికాధుకారులది. కానీ వాళ్ళమాటలు నాయకులు వినరు. అడ్దంగా వాదించి నోరుమూయిస్తారు. వాళ్ళకు ఆక్షణంలో కావలసింది వారివారి రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవటం. ప్రజలు చెయ్యగలిగిన పని వాళ్లకి ఓటువెయ్యడం. ప్రజల పరిమితి- వీళ్ళు తప్ప మరెవరూ ప్రత్యామ్నాయం లేకపోవడం.

2 comments:

  1. చాలా బాగా వివరిస్తున్నారు ధన్యవాదములు

    ReplyDelete