మేరునగ తప్పిదం- 7. ఆపరేషన్ ఓంకార్

లఢాఖ్లో బాద్యతలు నిర్వహిస్తున్న దాల్వీకి సెలవుమీద డిల్లీ వచ్చే అవకాశం దక్కింది. డిల్లీలో ఉన్నప్పుడు అనుకోకుండా మిలిటరీ సెక్రటరీ జనరల్ మోతీసాగర్ను కలిశాడు. ఆయన "అస్సాంలోని 7 బ్రిగేడ్కు కమాండర్గా పనిచేస్తున్న వ్యక్తి ఆరోగ్యకారణాల రీత్యా అక్కడినుంచి వెళ్ళిపోయాడు." అని చెప్పి, "అక్కడకు వెళ్ళేందుకు సిద్దమేనా?" అని అడిగాడు. అప్పటికే లఢాఖ్లో ఉన్న పరిస్థితులతో విసిగిపోయిన దాల్వి, అస్సామే మెరుగనుకుంటూ ( దాదాపూ అందరు ఉద్యోగులు ఇలానే ఆలోచిస్తారనుకుంటా!) వెంటనే అంగీకరించాడు. 1962 జనవరిలో బదిలీ ఉత్తర్వులు అందాయి. లఢాఖ్లో కమాండర్గా ఉన్న విక్రంసింగ్ విదిలేని పరిస్థితుల్లో అందుకు ఒప్పుకున్నాడు. అప్పటిదాకా ఈశాన్యసరిహద్దు గురంచి ఎలాంటి అవగాహనా లేకపోవడంతో, డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ బ్రిగేడియర్ డీ.కే.పలిత్ను కలిసి అక్కడి సమాచారాన్ని తీసుకున్నాడు. ఆయన కూడా దగ్గర్లో యుద్ధం వచ్చే అవకాశాలు లేవన్నట్టే మాట్లాడాడు. అయితే మైదానాల్లో పనిచేసే 9 పంజాబ్ దళాన్ని చలికాలంలో అక్కడికి పంపడం పట్ల అసహనాన్ని చూపెట్టాడు. భూటాన్ సరిహద్దు కొద్దిగా సున్నితమని హెచ్చరించాడు. ఫిబ్రవరి 27న డిల్లీ నుంచి బయలుదేరి మార్చి 1న రంగియా అనే స్టేషనుకు చేరుకున్నాడు.

ఆస్టేషన్లో ఎటుచూసినా సైనికులే. కాలకృత్యాలు తీర్చుకోను కనీస వసతులు లేవు. కాంటీన్లు లేకపోవడంతో అర్దాకలితో అలమటిస్తున్నారు. అక్కడినుంచి మిసిమారిలోని ప్రధాన కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ మేజర్ జనరల్ ఆమ్రిక్ సింగ్ను కలిసి పంజాబ్ దళాన్ని ఎవరు రప్పించారు? అని అడిగితే పైనుంచి ఉత్తర్వులు అన్నారేగానీ వాళ్ళకీ ఖచ్చితంగా తెలియదు. డీ.ఎం.ఓ.తో చర్చించిన విషయాలను ప్రస్తావించగా, ఇది తూర్పుదళం కిందకు వస్తుందని, కాబట్టి తూర్పుదళం ప్రధానకార్యాలయం ఉత్తర్వులు తప్ప మరేవీ పట్టించుకోవద్దనీ చెప్పారు. ఆయన సహజ స్వభావానికి విరుధ్ధంగా చాలా అసహనంగా కనిపించాడు. ఈసంఘటన దాల్వీకి కొన్ని అనుమానాలు రేకెత్తించింది. లెఫ్టినెంట్ కల్నల్ మనోహర్ సింగ్ను కలవగా, ఆయన రాబోయే కొన్నినెలలు సరిహద్దు వెంబడి కొత్తగా పోస్టులను నెలకొల్పడమే ప్రధాన బాద్యతగా తెలుపుతూ, దానికి ఆపరేషన్ ఓంకార్ అన్న సంకేతాన్నిచ్చారు. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ను కలవగా ఆయన అక్కడి పరిస్థితులను వివరించి, కొన్ని కీలకమైన సమస్యలను తెలియజేశాడు. అక్కడ కూడా నిర్థిష్టమైన భద్రతా ప్రణాళికలు లేవని అర్థమైంది. దీంతో ఈశాన్య సరిహద్దులో పరిస్థితి లఢాఖ్ కన్నా ఏమీ మెరుగ్గాలేదనీ, పెనం మీద నుంచి కుంపట్లో పడ్డాననీ ఆయనకి తెలిసొచ్చింది. ఆప్రాంతంలో పరిశీలించగా తొవాంగ్ వైపు వెళ్తున్న దళాలు అక్కడకు తీసుకెళ్ళలేని కారణంగా భారీస్థాయిలో యుధ్దసామాగ్రిని, వాహనాలను, ఇతర ఉపకరణాలను వదిలిపెట్టేశారు.

దాల్వీ మరొక అధికారితో కలిసి మిసిమారి నుంచి తొవాంగ్కు బయలుదేరాడు. సముద్రమట్టం నుంచి 7000 అడుగుల ఎత్తులో ఉన్న చాకో అనే ప్రాంతంలో కొద్దిగా విశ్రాంతి తీసుకుని టీ తాగే సదుపాయం ఉన్నది. ఆదారిన వెళ్తున్న సైనికులందరికీ అదే ప్రధాన మజిలీ. అప్పటికే రెండేళ్ళనుంచి సైన్యం అదారిని వాడుతున్నా ఇంతకన్నా మెరుగైన సదుపాయం ఏదీలేదు. అక్కడి నుంచి డీరంగ్ అనే ప్రాంతానికి చేరుకునేసరికే సాయంత్రమైంది. ఇది సముద్రమట్టం నుంచి 5500 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడ అప్పటికే 1 SIKHSకు చెందిన ఒకబృందం కలిసింది. అక్కడ బోర్డర రోడ్స్ ఆర్గనైజేషన్ కార్యాలయానికి వెళ్ళి అక్కడీ ఇంజనీర్లను కలిశాడు. హిమాలయాల్లో రోడ్లు వెయ్యడం అంత సులువైన విషయంకాదు. కొండలను తొలుచుకుంటూ, వాలుమీదుగా రోడ్లు వెయ్యాల్సి వస్తుంది. ఒకసారి వేసిన తర్వాత కూడా తరచుగా కొండచరియలు విరిగి పడటం, మట్టి కుంగిపోవడం, వాలు వెంబడి మట్టి జారిపోవటం చాలాతరచుగా జరుగుతూ ఉంటాయి. ఒకసారి కట్టేదానికంటే వాటి మరమత్తులకే ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. ఇన్ని సమస్యల్లోనూ వాళ్ళు కొద్దిసమయంలోనే మెరుగైన రోడ్డు నిర్మించారు. అయితే రక్షణమంత్రి సభలో ప్రకటించినట్టి ఇది యుద్ధావసరాలకు సరిపోదు. చైనా రహదారులు 7టన్నులు మోయగలిగితే, ఇది కేవలం 1టన్ను మాత్రమే మోయగలదు. అదీ పొడివాతావరణంలోనే!

డీరంగ్ నుంచి బయలుదేరితే వెళ్ళేదారిమొత్తం అనేకచోట్ల మట్టికుంగిపోయి, అడుసుతో నిండిపోయి ఉంది. కొన్నిచోట్ల ఇటువైపు వాహనాన్ని వదిలి, అటువైపుకు అడుసులోనే నడుచుకుంటూ వెళ్ళి, ఇంకోవాహనంలో ఎక్కాల్సి వఛ్కింది. ఇక ఈదారిలో టాంకర్లు ఎలా వస్తాయి? సెంగె అనే ప్రాంతంలో మరొకబృందాన్ని కలిశారు. సేలా అనే ప్రాంతం చేరాక ఇక వాహనం ముందుకెళ్ళేందుకు దారిలేదు! దాంతో దాన్ని అక్కడే వదిలేసి కాలినడక వెళ్ళసాగారు. అది సముద్రమట్టం నుంచి 13000 అడుగుల ఎత్తులో ఉంది! అంటే ఇన్నిసమస్యలూ దాటి మన ఇంజనీర్లు అక్కడిదాకా రోడ్లు వేశారు. కానీ నిధుల కొరతతో అది సైనికావసరాలకు సరిపోనివిధంగా తయారయ్యింది.


సముద్రమట్టానికి 12000 అడుగుల ఎత్తునున్న నురానౌంగ్ అనే ప్రాంతానికి చేరుకునేసరికే రాత్రవడంతో అక్కడే ఆగిపోయారు. చుట్టూ ఎత్తైన పర్వతాలు ఉండటంతో ఇక్కడ సూర్యరశ్మి రోజుకు 2గంటలకన్నా ఎక్కువసేపు పడదు. దీంతో అది ఆప్రాంతంలోకెల్లా అత్యంత చల్లని ప్రదేశంగా పేరుకెక్కింది. అక్కడ జంతురవాణా ద్వారా ఉత్తరాలు బట్వాడా చేసే బృందం ఒకటి కనిపించింది. వాళ్ళు ప్రతిరోజూ ఇదేవాతావరణ పరిస్థితుల్లో సైన్యానికి ఉత్తరాలు బట్వాడా చేస్తుంటారు. కానీ వాళ్ళకు ఒకటార్పాలిన్ పట్ట తప్పించి కనీసం రగ్గు, భోజనం కూడా సరఫరా చెయ్యలేదు! ఎంత అమానుషం. తెలవారాక అక్కడినుంచి బయలుదేరి జాంగ్ అనే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ జీపులో ఎక్కి తొవాంగ్కు బయలుదేరగా, 5మైళ్ల ముందు అది అడుసులో ఇరుక్కుపోయింది. చివరికి కాళ్ళీడ్చుకుంటూ సాయంత్రానికి తొవాంగ్ చేరారు.

ఇప్పుడు దాల్వీ ప్రయాణించిన మార్గాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంటే- పర్వతపాదంలోని మిసిమారి నుంచి నిటారుగా పైకి 9000 అడుగులకు చేరితే మొదటి మజిలీ. అక్కడి నుంచి ఇంకాస్త పైకెక్కితే 1000 అడుగుల ఎత్తులో బొండిల్లా. నిట్టనిలువుగా కిందకి దిగి 5500అడుగులకు డీరంగ్. అక్కడినుంచి మళ్ళీ 13500 అడుగుల ఎత్తులో సేలాకనుమ. మళ్ళీ 5000 అడుగులకు దిగితే జాంగ్. చివరగా తొవాంగ్ చేరాలంటే 10000 అడుగుల ఎత్తుకు చేరాలి. ఒకసైనికుడు రంగియా స్టేషనుకు వచ్చి రైలు దిగాక, యుధ్దభూమికి చేరాలంటే ఇదేదారిలో వెళ్ళాలి. దాల్వీ అధికారి కాబట్టి జీపొచ్చింది. మనుశులు పలికారు. మరి మామూలు సిపాయి సంగతేంది? ఇదే దారిలో జనరల్ కౌల్ మరియూ జనరల్ సేన్ వచ్చారు. దారంతా చూసివెళ్ళారు. అయినా ఎలాంటి పురోగతీలేదు.

సైన్యం యుధ్దభూమికి చేరుకొని తమస్థానాల్లో నిలబడాలంటే కొన్ని కీలకమైన అంశాలు ప్రభావితం చేస్తాయి. దారిలో వాళ్ళ మజిలీలెక్కడ? ఎవరు ఎక్కడ ఆగాలి? ఎక్కడ ఆగకూడదు? మొత్తం సమయం ఎంత పడుతుంది? ఎన్ని బృందాలుగా పంపాలి? ఎంతెంత నిడవిలో ఒక్కొక్క బృందం బయల్దేరాలి? వంటివి. వాటికనుగుణంగా సౌకర్యాలు కల్పించాలి. మరి సౌకర్యాలన్న ఆలోచనే లేనప్పుడు ఈప్రశ్నలేవీ ఉదయించవు గదా.

ఇక తొవాంగ్ పరిస్థితుల గురించి పెద్దగా చెప్పేదేమీలేదు. అదే పాతకథ. ఒక్క వైద్యసదుపాయాల విషయంలో మాత్రం ఇది మెరుగైంది. 1960లో ఒక సర్జికల్ యూనిట్ను ఇక్కడి వైద్యబృందం మొదలుపెట్టింది. మేజర్ జయరామన్ నేతృత్వంలోని వైద్యబృందం సైనికులకేగాక, స్థానిక అధికారులు, గిరిజన తెగలకు తమదగ్గరున్న సౌకర్యాలతో మెరుగైన సేవలను అందిస్తోంది. నెమ్మదిగా అక్కడ ఒక 25 పడకల ఆసుపత్రి, ఎక్స్ రే పరికరాలను ఏర్పాటు చేశారు. కానీ ఇది ఒకేచోట ఉండి పనిచేసేది కావడంతో యుద్ధావసరాలకు ఏమాత్రం సరిపోదు.

తొవాంగ్ చాలా అందమైన ప్రాంతం. బౌద్ధారామం. ఆరవ దలైలామా పుట్టినచోటు. మంగోలుజాతి తెగలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. బయటి ప్రపంచంతో సంబంధంలేకుండా వారిదైన సాంప్రదాయ జీవనాన్ని గడుపుతున్న వారికి ఇరుదేశాల సైన్యం ఆప్రాంతంలో సంచరించటం మూలాన జీవనవిధానంలో మార్పులొచ్చాయి. ద్రవ్యాన్ని వినియోగించటం వంటివి అలవరచుకున్నారు. అక్కడి రాజకీయ అధికారి షైజాను, దుబాసీలను కలిసుకుని స్థానికి పరిస్థితులను తెలుసుకున్నాడు. అలానే ఇతర ముఖ్యులను కలిసి పరిచయం చేసుకున్నాడు. ఇక సైనిక ఆపరేషన్లను పునర్విచారణ చేసుకోవడమే మిగిలిన పెద్దపని.

ఒక పదాతిదళ నాయకునిగా అన్నికీలకమైన బాద్యతలు కమాండర్ భుజాలపైనే ఉంటాయి. ఏదైనా లోటుపాట్లుంటే కమాండింగ్ ఆఫీసర్కు తెలియజేసి, అవసరమైన మార్పులుచేర్పులు చెయ్యడం ఎంతోఅవసరం. కెమాంగ్ సరిహద్దు ప్రాంతంలో 7 INFANTRY BRIGADEకు అప్పగించిన కీలకబాద్యతలు

  1. తొవాంగ్ను రక్షించడం
  2. సరిహద్దు వెంబడి చొరబాట్లను నిరోధించడం
  3. అస్సాం రైఫిల్స్ పోస్టులు నెలకొల్పడం
  4. అస్సాం రైఫిల్సుకు మద్దతునివ్వడం

కాగితం మీద చదివేందుకు బావానే ఉన్నా బాద్యతలకు- వనరులకు మద్య ఏమాత్రం పొంతనేలేదు. మొదటి బాద్యత అయిన తొవాంగ్ను రక్షించాలంటే బలగాలన్నీ అక్కడే మోహరించాలి. కానీ పోస్టులు నెలకొల్పడం, వాటిని కాపాడాలి అంటే 350 మైళ్ళ పొడవున బలగాలను విస్తరింపచెయ్యాలి. ఇంతటి పరస్పర విరుద్ధమైన లక్ష్యాలను సాధించేంత వనరులు, సదుపాయాలు మనదగ్గర లేదు.

బలగాలన్నీ వివిధప్రాంతాలనుంచి వచ్చాయి. వాటికి ఆప్రాంతం కొత్త. ఎక్కడ ఏకొండ ఉందో? ఎక్కడ ఏగుట్ట ఉందో?  ఎవరికీ తెలియదు. పైగా అవన్నీ ఒకే దళానికి చెందినవి కావు. అనేక దళాల కలగూరగంప. ప్రతిదళానికి కొన్ని పరిమితులుంటాయి. అవేంటో తెలుసుకొని, ఒకరికొకరు సమన్వయ పరచుకుంటూ పనిచెయ్యడానికి కనీసం మూడునెలల సమయం పడుతుంది. కానీ సైనికుల్లో సింహభాగం ఇతరపనుల్లో నిమగ్నమయ్యారు. పోర్టర్లు లేకపోవడంతో హెలికాప్టర్లు వదిలిన సామాగ్రి వాళ్ళే తీసుకురావాలి. హెలీపాడ్ నిర్మించడానికి 1200మంది మూడునెలలు కష్టపడాల్సి వచ్చింది. "7000 అడుగులకన్నా ఎత్తులో మేము ఎగరలేం" అని వాయుసేన చెప్పడంతో, చేసేదిలేక రోజూ 2500 అడుగులు కిందకు వెళ్ళి పనిచేసి మళ్ళీ పైకి ఎక్కాల్సి వచ్చింది. మౌలిక సదుపాయాల నిర్వహణ కింద ఈపని BRO ఫరిధిలోకి వస్తుంది. ఇదే విషయాన్ని అక్కడి ఇంజనీరుకు చెబితే ఆయనకు చెయ్యాలని ఉన్నా పద్దుల నిర్వహణలో ఉన్న ఇబ్బందులు, నిధుల కొరత కారణంగా సందిహిస్తూనే సహాయం చేశాడు. మిగతావాళ్ళు 14000 అడుగుల ఎత్తులోనున్న పఁకెంగ్టాంగ్ అనేప్రాంతంలో షెల్టర్లు కట్టేపనిలో నిమగ్నమయ్యారు. ఇక శిక్షణ ఇచ్చేది ఎప్పుడూ? వాళ్ళ బలాబలాలను బేరీజు వేసేదెప్పుడు? వాళ్ళకు బాద్యతలు అప్పగించేది ఎప్పుడు? అదే ప్రశ్న అడిగితే "చైనాతో యుధ్ధంరాదు." అన్నదే సమాధానం. శిక్షణకు అనువైన రేంజి దొరికినా అధికారులు అనుమతివ్వరు!

ఇక్కడ ప్రధానంగా మూడు దళాలున్నాయి. ఒకటి 1/9 GORKHASని ప్రధమశ్రేణి దళంగా మంచిపేరుంది. వెళ్ళిన ప్రతిప్రాంతంలోనూ స్థానికులతో సంబంధాలను నెరపి సైన్యంపట్ల సదభిప్రాయం కలిగించడంలో వీళ్ళు సిద్ధహస్తులు. రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రఖ్యాతిగాంచిన ఇటలీ కేసినో యుద్ధంలో గెలవడంతో వీరు ప్రపంచ ఖ్యాతినార్జించారు. తరువాత కాశ్మీరులో పూంచ్ సెక్టారులో అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. కానీ ఇక్కడ రెండేళ్ళుగా శిక్షణ లేదు! అదేస్థాయికి చెందిన మిగతా రెండు దళాలు 9 PUNJAB, 1SIKHS లదీ అదేపరిస్థితి.

పెద్దపెద్ద బాద్యాతలైతే నెత్తినపెట్టారు గానీ, సైనికుల సంఖ్యమీద పరిమితిని మాత్రం సడలించలేదు. దానికి ప్రధానకారణం- 1700 మందికన్నా ఎక్కువమందికి సామాగ్రిని సరఫరా చెయ్యలేకపోవడమే. తొవాంగ్లో సంఖ్యను పరిమితం చేసినప్పుడు కనీసం అలారం వ్యవస్థను, రహదారులను మెరుగుపరుచుకోవాల్సింది. కానీ అలాంటివేమీ చెయ్యలేదు. బలగాల మోహరింపు అన్న సున్నితమైన విషయం భవిష్యత్తును ప్రమాదంలో తోసేసేలా తయారయ్యింది. ఎక్కడా అదనపు బలగాలు, అదనపు సమాగ్రి వంటివాటిని ఆలోచించలేదు. ఇక్కడికే వ్యయం పెరిగిపోతుండంటూ పైవాళ్ళు గగ్గోలుపెడుతున్నప్పుడు అదనపు అన్నమాటను వింటే చీల్చిచెండాడేలా ఉన్నారు. అదే సమయంలో చైనీయుల బలం గురించి, వాళ్ళు దాడులు చేసే దారుల గురించి రక్షణశాఖకు ఎటువంటి సమాచారం లేదు. కేంద్ర ఇంటేలిజెన్స్ వ్యవస్థ ఎలాంటి నివేదకనూ సమర్పించలేదు.

ఒకవైపు మూడూప్రధానమైన మార్గాలను, మరోప్వైపు అస్సాంరైఫిల్స్ ఆధీనంలోని పోస్టులను రక్షించాల్సిన బాద్యత అక్కడి సైన్యంపై పడీంది. ఇక్కడ ఇంకొక ప్రధానమైన సమస్య- అస్సాం రైఫిల్స్ కేంద్ర విదేశాంగ శాఖ కిందకు వస్తాయి. అంటే దాని అధికార క్రమం, ఇతర పరిపాలనా విషయాలతో సైన్యానికి ఎలాంటి సంబంధంలేదు. సైన్యం చెయ్యగలిగిందల్లా వాళ్ళని కాపాడటమే. ఇలాంటి ప్రైవేటు సైన్యాలను ఏర్పాటుచేసిన ప్రతిచోటా సమస్యలు రెట్టింపవ్వడం తప్ప సాధించిందేమీ లేదు. ఒకరి కింద ఆదేశాలు పాటిస్తూ జీతం తీసుకుంటూ, మరొకడితో పనిచెయ్యడం అన్నది ఎప్పుడూ సత్పలితాలివ్వదు.

తొవాంగ్లో పరిస్థితులు అర్థమయ్యాక, మిగతా ప్రాంతాలను చూసుకుంటూ, సరిహద్దు ప్రాంతాన్ని విశ్లేషించడానికి దాల్వీ బయలుదేరాడు. ఆప్రాంతంలో ప్రధానమైన దారులు, వంతెనలు ఇతర భౌగోళిక విషయాలు చూసుకోవడం అత్యంతకీలకం. అందరికీ కాశ్మీరు ప్రాంతంమీదున్నంత అవగాహన ఈప్రాంతంమీద లెకపోవడం కొద్దిగా కలవరపరిచే విషయం. తనకు తోడుగా లెఫ్టినెంట్ కల్నల్ అహ్లూవాలియా, మరొక స్థానికుడు తోడుగా వచ్చారు. దారిలో ఉన్న గ్రామాలను, తండాలను సందర్శిస్తూ, అక్కడి గ్రామపెద్దలతో పరిచయాలు పెంచుకున్నాడు. వాళ్ళ ఆహారపుటలవాట్లు, ఆచారవ్యవహారాలు తెలుసుకున్నాడు. సైన్యం నుంచి అందాల్సిన బకాయిలను వెంటనే అందేలా చర్యలు తీసుకున్నాడు. అక్కడున్న షక్తి, లుంపు, చోక్సన్ ప్రాంతం కీలకమైనదిగా గుర్తించారు. తిరిగొచ్చాక మరొక దిక్కువైపునున్న బూమ్లాకు బయలుదేరాడు. బుమ్లా అత్యంతపురాతన వాణీజ్యకేంద్రం. సతాబ్దాలుగా ఈదారిలో వర్తకవాణిజ్యాలు జరుగుతున్నాయి. తన పరిశీలనలను పైఅధికారులకు నివేదిస్తూ అదనపు బలగాలను కోరాడు. వాళ్ళు దాల్వీ చెప్పిన అంశాలను అంగీకరిస్తూనే అదనపు బలగాలివ్వటం కుదిరేపనికాదని తేల్చిచెప్పారు. దళాలను కూడా బృందాలుగా విడిపోయి ప్రాంతమంతా తిరగాల్సింగా ఆదఆేశించాడు. సంచార యుధ్దసామాగ్రిని ఉపయోగించడంపై పధకాలు రచించారు.

ఇక ఆపరేషన్ ఓంకర్లో భాగంగా ముఖ్యమైన పోస్టులు నెలకొల్పే పనిని మొదలుపెట్టారు. భూటాన్ మూలకు ఉన్న థాగ్లా ప్రాంతంపైన అప్పటికే చైనీయులు విబేధించి ఉన్నారు. నెహ్రూ కూడా వివాదాస్పదంకాని ప్రాంతాల్లోనే పోస్టులు ఏప్రాటు చెయ్యమన్నాడు. కానీ ఎక్కడెక్కడ పోస్టులు ఏర్పాటుచెయ్యాలన్న పట్టీలో వివాదాస్పదమై ఉన్న థాగ్లాను చేర్చారు! ఇది మొత్తం వ్యవహారానికి కేంద్రబిందువయ్యింది. కాలక్రమంలో మేరునగ తప్పిదానికి మూలమయ్యింది. అయితే మీనన్ ఈప్రశ్నకు సమాధానమిస్తూ " ఎక్కడ ఏర్పాటు చెయ్యాలనేది రాజకీయ అంశం. అది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అయితే అక్కడ పోస్టు ఏర్పాటు చెయ్యాలా? వద్దా? అన్నది సైన్యమే నిర్ణయించుకోవాలి." అంటూ విషయాన్ని మరింత వివాదాస్పదం చేశాడు. భారత్ చేస్తున్నది ఫార్వర్డ్ పాలసీకాదని. తన భూభాగాన్ని రక్షించుకోవడమేనని. చైనాయే ఫార్వర్డ్ పాలసీతో ఇటువైపు వస్తోదని. చెప్పడంతో చైనాను మరింత రెచ్చగొట్టాడు. అయితే ఈవిషయంపై జనరల్ కౌల్ ఎక్కడా సమాధానమివ్వలేదు. దాంతో ఈనిర్ణయం ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకున్నదా? లేక సైన్యం దానికి సమ్మతిని తెలిపిందా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకలేదు.

ఒకవేళ ఇక్కడీ పరిస్థితి అదుపుతప్పితే ఏఁచెయ్యాలో అర్థంకాక దాల్వీ పై అధికారుల సూచనలను, ఇతర సమాచారాన్ని కోరాడు. కానీ వాళ్ళు సమాధానమివ్వకపోగా, ఆయన సందేహాలన్నింటినీ కొట్టిపారేశారు. ఒక్క నమ్కచు పోస్టు తప్ప మిగతావన్నీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాయి. భౌగోళిక అంశాల దృశ్ట్యా ఆదేశాల్లో పేర్కొన్న ఢోలా పోస్టుకూడా సరియైనది కాదు. దానికి ముందున్న థాగ్లా పర్వతశ్రేణి ( భారత్ చెప్పినట్టు సరిహద్దు) లేదా వెనకాల ఉన్న హథుంగ్ల కనుమ పోస్టుకు అనుకూలం. అయినా పై అధికారులెవరికీ భౌగోళిక పరిస్థితులమీద అవగాహన లేకుండటంతో కష్టసాధ్యమైన ప్రాంతాల్లో పోస్టులు నెలకొల్పారు. అందుకు జాతి తగిన మూల్యం చెల్లించుకుంది.

No comments:

Post a Comment