మేరునగ తప్పిదం

వేలకొద్ది సంవత్సరాల చరిత్ర కలిగిన ఒకజాతి తనఅస్థిత్వాన్ని కోల్పోయి, శతాబ్ధాలపాటు బానిసత్వంలో మగ్గిన తరువాత,  ప్రపంచం నివ్వెరపోయేలా అహింసని ఆయుధంగా మలచుకుని, విషసర్పాల నడుములు విరగ్గొట్టి, తనఝెండాని రెపరెపలాడించింది. సంబరాలు మిన్నంటిన మరుక్షణమే బాలారిష్టాలు మొదలయ్యాయి. అతుకులబొంతని కాశ్మీరీ తివాచీలా మార్చేబాద్యతని పటేల్ మహాశయుడు భుజాన వేసుకుని అద్భుతాన్ని ఆవిష్కరించాడు. సర్వజనామోదమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ ప్రసాదించాడు. ప్రధమ భారత పధానిగా నెహ్రూ దూరదృష్టితో ప్రవేశపెట్టిన అనేక పధకాలు, అమలుచేసిన విధాన నిర్ణయాలు, స్థాపించిన సంస్థలు, పరిశ్రమలు ఇతర అంతర్జాతీయ విషయాలు ప్రజలకు మునుపెన్నడూ అనుభవంలేని ప్రజాస్వామ్యం అనే కొత్తవ్యవస్థ పైన గురికుదిరేలా చేశాయి.

నెమ్మదిగా ఒక్కొక ఫలితం కళ్ళముందు కనబడటం మొదలవ్వటంతో నిన్నగాక మొన్న మేల్కొన్న జాతి అంతలోనే మగత నిద్రలోకి జారుకుంది. పక్కలోనే నిప్పులుగక్కే డ్రాగన్ ఉన్నాడన్న నిజాన్ని విస్మరించి, అడపాదడపా తగిలిన ఎదురుదెబ్బలకి పెయిన్ కిల్లర్లతో సరిపెట్టి మగత నిద్రలోకి జారుకుంది. ఫలితం- ఓ తెల్లవారుఝామున ఆడ్రాగన్ భూతం విరుచుకు పడింది. తెల్లారేసరికి వందలకొద్దీ సైనికులు ( చలికి, అన్నం దొరక్క, గాయాలకి చనిపోకుండా మిగిలినవాళ్ళు) దేశంకోసం ప్రాణాలర్పించారు. ఇంకొంతమంది యుద్ధఖైదీలుగా శత్రువుల చేతికి చిక్కారు. వందల చదరపు కిలోమీటర్ల ప్రాంతం వాళ్ళ హస్తగతమైంది.బలవంతుడు వికటాట్టహాసం చేశాడు. 



ఇంత జరుగుతున్నా రాజధానికి కనీస సమాచారం లేదు. గాలివార్తలు, పుకార్లు తప్ప ప్రభుత్వం తరపునుఁచి నిర్ధిష్టమైన సమాచారం లేదు. అడపాదడపా ప్రకటనలు వెలువడినా అవి జాతిని నిలువునా మోసం చేసి దారితప్పించేవే తప్ప సరిహద్దులోని పరిస్థితిని యథాతథంగా తెలిపేవి ఒక్కటీలేవు. మనసరిహద్దులో ఏమి జరుగుతుందో సామాన్యుడికి తెలియదు. అయినా ఒకధైర్యం. ఒక నమ్మకం అతనిని నడిపించాయి. అతనికున్న ధైర్యమెల్లా సైనికుడి మీదే. నిజానికి ఆసైనికుడొక్కడే ఇతని నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. దానికోసం ప్రాణాల్ని పణంగా పెట్టాడు. కానీ అతని త్యాగమూ బూడిదలో పోసిన పన్నీరైంది.
ఇతని చేతిలో అరకొర ఆయుధాలు. శత్రువు చేతిలోనేమో అత్యాధునిక ఆటోమేటిక్ రైఫిల్లు. ఇటు మాసిన కేన్వాస్ షూస్ అటు తేలికపాటి సైనికబూట్లు. పన్నెండువేల అడుగుల ఎత్తులో మామూలు నూలు దుస్తులతో మనవాడు. ప్రత్యేకమైన పాలిస్టర్ యూనిఫార్మ్లో శత్రువు. చివరికి బలమే నెగ్గింది.

ఆక్షణం వరకు పోటాపోటీగా యుద్ధనిర్వాహక బాద్యతలకోసం కొట్టుకున్న అధికారగణం ఒక్కసారిగా తప్పించుకు పారిపోను దారులు చూసుకోసాగారు. దేశంలోని అత్యున్నత వ్యవస్థలు, అధికార కేంద్రాలనుంచి క్షేత్రస్థాయిలోని ఉద్యోగుల వరకూ అన్నిచోట్లా వ్యవస్థ కుప్పకూలింది. అన్నిస్థాయిల్లోనూ, అన్నివిభాగాల్లోనూ మొత్తం వ్యవస్థనే అస్థిరపరిచేంత ఒక్కమాటలో చెప్పాలంటే మేరునగమంత పెద్దతప్పిదం మనదేశ రక్షణకు పెట్టనికోటల్లా భావించే హిమాలయాల సాక్షిగా జరిగింది.

పజల మనసుల్లో దైవాంశసంభూతునిగా ఆదరణ పొందిన జవహర్ ప్రతిష్ట ఒక్కసారిగా అథఃపాతాళానికి జారిపోయింది. ఒక్కసారిగా అలజడి. ఆందోళన. ప్రజలు ఎవ్వరినీ విశ్వసించలేని పరిస్థితి. అయినా నపటేల్ నిర్యాణంతో ెహ్రూకి ప్రత్యామ్నన్యాయం లేకపోవడం దేశానికి మరొక సంక్షోభం. ఏ ప్రగతిపేరు చెప్పి సైనికావసారలకు డబ్బులేదన్నారో ఆప్రగతే పూర్తిగా కుంటుపడే పరిస్థితి. ప్రతి విషయంలోనూ అన్నిటా తానై కనిపించే జవహర్ ఇప్పుడు తనప్రజలముందు నిలబడలేని పరిస్థితి. ఇన్నేళ్ళూ ఒక్కొక్క ఇటుకా పేర్చుకుంటూ అంతర్జాతీయ సమాజంలో తాను నిర్మించుకున్న కోట బీటలువారడం మింగుడు పడట్లేదు. అయినా సహించక తప్పని పరిస్థితి.
యుద్ధానికి పూర్వం ఆయనకు అతిదగ్గరగా తిరిగిన ప్రతి అధికారిదీదీ, నాయకునిదీ దాదాపూ అవే అనుభవాలు. ఇంతమందిలోనూ ఒక్కడు మాత్రం ధైర్యంగా తలెత్తి నిలుచున్నాడు. తనధర్మం నిర్వర్తించేందుకు ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టిన ఆఒక్కడికే మాత్రమే తలెత్తుకుని జీవించే హక్కు ఉందన్నది దేశం మొత్తానికీ తెలుసు.

ఆఘోర తప్పిదం జరిగి 20 October 2012 కి యాభై ఏళ్ళు. శాంతి సౌబ్రాతృత్వాలే ఆలంబనగా స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్న ఒకజాతి వెన్నుపోటుకి గురై యాభై ఏళ్ళు. జాతిశ్రేయస్సుకన్నా వ్యక్తిగత ప్రతిష్టకే ప్రాధాన్యమిచ్చాడన్న అపఖ్యాతి ఈదేశ ప్రధమ ప్రధాని మూటగట్టుకుని యాభై ఏళ్ళు. శతాబ్ధాల బానిసత్వం తర్వాత ఎన్నోత్యాగాలకోర్చి సంపాదించుకున్న స్వతంత్ర్యాన్ని అపురూపంగా చూసుకుంటున్న దేశం తనచరిత్రలో మొట్టమొదటి ఆధునిక యుద్దతంత్రంలో తడబడి యాభైఏళ్ళు. సైనికావసరాలకన్నా సామాన్యుడి ప్రగతే ముఖ్యమని నమ్మిన పాలనా వ్యవస్థ నగుబాటుకి గురై యాభై ఏళ్ళు. వెరసి మేరునగమంత తప్పిదానికి యాబై ఏళ్ళు.

ఈతప్పిదానికి దారి తీసిన పరిస్థితులేవి? యుద్ధభూమిలో ఏమి జరిగింది? యంత్రాంగం ఎలా స్పందించింది? ప్రభుత్వం ఎలా వ్యవహరిఁచింది? అన్నింటికన్నా ముఖ్యంగా అసలీ తప్పిదం నుంచి జాతి ఏమి నేర్చుకుంది?  ఈదేశపౌరులుగా మనమందరం ఆలోచింకాల్సిన విషయాలివి. సైనికదళ నాయకునిగా చైనీయులతో పోరాడి, ఓడి ,శత్రువు చేతికి చిక్కి,  యుద్ధఖైదీగా శిక్షను అనుభవించి, తిరిగి స్వదేశానికి చేరుకున్న మహావీరుడు బ్రిగేడియర్ జే.పీ. దాల్వి తన అనుభవాలను HIMALAYAN BLUNDER అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించాడు. చైనా యుద్ధానికి సంబంధించి విశ్వసనీయ గ్రంధంగా ఈపుస్తకాన్ని రక్షణరంగ నిపుణులు, విమర్శకులు పేర్కోంటారు.  చైనా యుద్దం జరిగి యాభై ఏళ్ళయిన సందర్భంగా ఈపుస్తకంలోని ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ కొన్నిభాగాలుగా ప్రచురించ దలిచాను.

6 comments:

  1. ఇలాంటివి రాయటం లో మీకొక ప్రత్యేకమైన శైలి ఉంది , అలాగే ఈ పరిచయ వాక్యాలు కూడా చాల బావున్నాయి . తరవాత భాగాలు చదవటానికి ఎదురుచూస్తున్నాను !

    ReplyDelete
  2. అచ్చు తెలుగు పుస్తకాలకు ప్లీజ్ visit :

    http://www.logili.com/

    ReplyDelete
  3. నీదైన స్టైల్లో బాగా రాసావు. సరిగ్గా సంవత్సరం దాటింది బ్లాగు రాసి.. రాస్తూ ఉండు. మానకు.

    ReplyDelete
  4. "...సైనికుడొక్కడే ఇతని నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. దానికోసం ప్రాణాల్ని పణంగా పెట్టాడు. కానీ అతని త్యాగమూ బూడిదలో పోసిన పన్నీరైంది...."

    Do you know who was the Chief of Army at that time? He was related to Nehru. Manekshaw was highly critical of him openly.


    Yes, you are right only our Soldier did his duty even when looking into the eyes of death. Hats of to them is a small word and entire Nation is indebted to those great people who fought valiantly under such uneven circumstances.

    Can you please tell me whether the book you are referring (HIMALAYAN BLUNDER by బ్రిగేడియర్ జే.పీ. దాల్వి) is available for purchase now.

    ReplyDelete
  5. @shivaramaprasad:

    Yeah. I purchased it in delhi galgotia store. You may check the following link of Flipkart.

    http://www.flipkart.com/himalayan-blunder-8181581458/p/itmdyuznp5cc8gjw?pid=9788181581457&ref=ccb0cb20-b54c-42d3-a5f0-e4ac0466466e&srno=m_1_1&otracker=from-search

    ReplyDelete