మేరునగ తప్పిదం- 15. డ్రాగన్ బుసకొట్టింది


హఠాత్తుగా జనరల్ కౌల్ అస్వస్థతకు గురవ్వడం భారత శిబిరాలను ఆందోళనకు గురిచేసింది. చొరవ తీసుకుని ఆదేశాలు ఇవ్వగల వ్యక్తి ఎవరూ సైన్యానికి లేరు. జరుగుతున్నది సాంప్రదాయక యుద్ధమైతే అతని స్థానంలో జనరల్ ప్రసాద్ బాద్యతలు తీసుకోవాలి. యుద్ధభూమిలో నాయకుడు మరణించడం, లేదా తీవ్రంగా గాయపడి సార్ధ్యం వహించలేక పోవడం, నాయకునికి మిగిలిన బృందాలకు సంబంధాలు తెగిపోవడం అన్నది చరిత్రలో ఎన్నోసార్లు జరిగింది. ఆపద్ధర్మ నాయకునిగా ఎవరుండాలి అన్నది సైన్యం యుద్ధానికి ముందే చర్చించాలి. అధికార రహస్యాలు, యుద్ధవ్యూహాల పట్ల అతనికి పూర్తి అవగాహన ఉండాలి. యుద్దం అంటే ఏమైనా జరగొచ్చు. కానీ ఇక్కడ అలాంటి ఏర్పాట్లేవీ లేవు. నిజానికి రాజకీయ నాయకులు, సైన్యంలోని వారి అనుయూయులు తప్ప మరెవరూ సరిహద్దు వ్యవహారాల పట్ల ఆసక్తితో లేరు. ఇక వీళ్ళేమో అసలు యుద్దమే రాదన్న ఆలోచనలతో వ్యూహాలు పన్నుతున్నారు. ఈపరిస్థితిల్లో చైనా అనుకోని దెబ్బ తీసింది. సరిగ్గా ఆతర్వాతే జనరల్ కౌల్ అనారోగ్యానికి గురవ్వటం అనేక విమర్శలకు తావిచ్చింది. ప్రతిపక్షాలకు, పత్రికలకు, విమర్శకులకు, మేధావి వర్గానికి, రక్షణరంగ నిపుణూలకు, అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులకు, అన్నిటికన్నా మిన్నగా నెహ్రూ ప్రత్యర్థులకు ఇదొక ఆయుధమైంది. దురదృష్తవశాత్తూ వీరికెవరికీ వాళ్ళ చేష్టలు సైన్యం నైతికస్థైర్యాన్ని, ప్రజల స్వాభిమానాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో స్పురించట్లేదు. ఒకవేళ స్పురించినా వారివారి అవసరాలు ఈవిషయాలను వెనక్కి నెట్టేశాయి.

ఇక్కడ వ్యవహారాలు కేవలం సైనిక చర్యలకే పరిమితం కాకుండా రాజకీయ అవసరాలు తోడవ్వడంతో ఎవరూ ఈ బాద్యతను భుజానికి వేసుకోను ముందుకురాలేదనే చెప్పాలి. ఓడిపోతున్న గుర్రం మీద ఎవరు పందెం కాస్తారు? ఈపరిస్థితుల్లో అనవసర వివాదాల్లో ఇరుక్కుంటామని అందరూ గుట్టుగా ఉండిపోయారు. ఈపరిస్థితుల్లో అక్టోబరు 19న, రాజపుత్రుల దళం నాయకుడు లెఫ్టినెంట్ కల్నల్ రిఖ్ దాల్వీని కలిశాడు. చైనీయుల బలం, వాటి కదలికలను విపులంగా చర్చించాడు. తన ప్రాంతంలో గస్తీని పెంచినట్టు తెలియజేశాడు. చివరగా " సార్! మీరు దిగులు పడొద్దు. వారి బలం ఎంతున్నా సరే, రాజపుత్రులం సరిహద్దులో ఉన్నంత సేపూ దేశాన్ని తలదించుకోనివ్వం. మా తుదిశ్వాస విడిచే వరకూ శత్రువుకు ఈభూమిమీద నిలబడే అవకాశం ఇవ్వం. ఒకవేళ మీరు వెనక్కి వెళితే, మనల్ని ఇలా మద్యలో వదిలేసి, దేశం పరువుతో రాజకీయాలు చేస్తున్న వారిని విడిచిపెట్టనని మాటివ్వండి చాలు." అని వెళ్ళిపోయాడు. ఇంకొందరు వచ్చి, "అందరూ తలోదారి చూసుకుని వెళ్ళిపోతుంటే ఇక్కడున్న అధికారులకు మాత్రం ఏందుకు ఈతలనెప్పులన్నీ? మీరు రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోండి." అని తమ అధికారులకు సలహా ఇచ్చారు. కానీ ఈ పరిస్థితుల్లో సహచరులను వదిలి ఎలా వెళ్ళగలమని అందరూ పోరాడడానికే నిశ్చయించుకున్నారు.

ఇక సరిహద్దులో బలగాల పరిస్థితి చూస్తే, 12మైళ్ల దూరంలో సన్నగా విస్తరించి ఉంది. ఈ చివరి నుంచి ఆ చివరకు వెళ్ళడానికి కనీసం 5రోజులు పడుతుంది. అందరికీ కలిపి 2 పారాఫీల్డ్ తుపాకులు, 4 మోర్టార్లు, అరకొర మందుగుండు. ఆత్మరక్షణకు కనీసం కంచెకూడా లేదు! ఇక బంకర్ల సంగతి సరేసరి. యుద్ధశాస్త్రంలోని ప్రాధమిక నియమాలను పాటిస్తూ ఒక్క సదుపాయంగానీ, ఒక్క వ్యూహంగానీ, ఒక్క ఆదేశంగానీ లేదు. కౌల్ రాకతో గందరగోళానికి గురైన అధికార క్రమం తాజా పరిణామాలతో పూర్తిగా కుప్పకూలింది.
1962 అక్టోబరు 20 తెల్లవారుఝామున 5గంటలకు, మూడవ బ్రిడ్జి వద్ద ఉన్న చైనీయులు ఉన్నపళంగా భారతదళాలపై దాడి చేశాయి. కొన్ని అడుగుల దూరంలోనే ఇరుపక్షాల దాడి-ప్రతిదాడులతో హిమాలయాలు ఉలిక్కిపడ్దాయి. భారతదేశ విదేశీ, రక్షణ, ఆర్థిక వ్యవహారాల డొల్లతనానికి సాక్షులుగా నిలిచాయి. ఆ సమయంలో భారత సైన్యంలో మొత్తం 4లక్షల మంది పనిచేస్తున్నారు. కానీ శత్రువుతో పోరాడడానికి 600మంది మాత్రమే ఉన్నారు. వీరికి అతి దగ్గరలో ఉన్నదళం 1000మైళ్ళ దూరంలో ఉంది.
చైనా దళాలు వ్యూహాత్మకంగా ముందుకువెళుతూ మొత్తం ప్రాంతాన్ని కబళించసాగాయి. కానీ అందరికన్నా ముందుగా ఉండే పంజాబీదళంపై దాడి చెయ్యలేదు. వారిని దాటుకుంటూ ముందుకెళ్ళసాగాయి. లుంపు వైపుగా శత్రువు కదలుతున్నారు. ఇక మిగిలింది మూడు బృందాల రాజపుత్రులు, ఒక గూర్ఖా బృందం. ఎవరి దగ్గరా సరిపడినంత బలం లేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో తమవీరత్వంతో ప్రపంచాన్ని మైమరపించిన ఈరెండు దళాల భవిష్యత్తు ఈరోజు ఒకబలమైన శత్రువు చేతిలో ఇరుక్కుంది. ఈసమయంలో జనరల్ ప్రసాద్ ఫోన్ చేసి హీనపక్షం ఒక బృందాన్నైనా సాంగ్లేకు పంపమని, ఇది పైవాళ్ల ఆదేశమని చెప్పాడు. సైన్యాని ఏమి చెయ్యాలో పాలుపోలేదు. ఒకవేళ ఈఆదేశాలను పాటిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళెముందే శత్రువు చేతిలొ హతమవ్వడం ఖాయం.
చైనీయులు ముందుగా రాజపుత్రులు గూర్ఖాలను వేరు చేస్తూ ఒకదళాన్ని వారిరువురి మద్యనా పంపారు. మిగిలిన రెండు దళాలను ఒక్కొక్కరి మీదకు పంపారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వీరిరువురూ శత్రువును మూడుగంటల పాటు నిలువరించారు. సిగ్నల్ బంకర్ మీద దాడిచెయ్యడంతో అందులోని వారంతా మరణించారు. నాలుగవ బ్రిడ్జి దగ్గరున్న బృందం రెండుదాడులను సమర్థవంతంగా తిప్పికొట్టగా, చైనాదళాలన్నీ కలిసి సునామీలాగా విరుచుకుపడటంతో తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క పోస్టు ఎన్నివేలమందినని నిలువరించగలదు? జెమదర్ బిశ్వాస్ సారధ్యంలోని బెంగాలీదళం, మేజర్ గురుదయాళ్ సింగ్ సారథ్యంలోని పదాతిదళం దాడులతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. వీరులందరూ నేలకొరగ సాగారు. చివరకు మిగిలిన రిఖ్ ను లొంగిపొమ్మని కోరగా, అతను ఒప్పుకోలేదు. ఆయనతోపాటుగా కెప్టన్ భాటియా, భూప్ సింగ్, ఇతర సహాయకులు బంకర్లలోనే ఉండిపోయారు. చైనీయులు తమ మెచీన్ గన్లతొ బంకర్లపై గుండ్లవర్షం కురిపించారు. దాంతో భాటియా అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలతో బతికిన కొందరు బందీలయ్యారు. భాటియా సామర్థ్యాన్ని గుర్తించిన సైన్యం అతన్ని పూణేలోని శిక్షణాకేంద్రానికి బదిలీచేసింది. 20న తనబృందానికి వీడ్కోలు చెప్పి బయల్దేరాల్సిన వ్య్కతి ఈలోకానికే వీడ్కోలు చెప్పాడు.



ఈసంఘటన సైనికులను తీవ్ర ఉద్వేగానికి గురిచేసింది. తుదిశ్వాస విడిచే వరకూ తలవంచకూడదని నిశ్చయించుకున్నారు. మరోవైపు సుబేదార్ దశరథ్ సింగ్ బృందం అప్పటికే మూడుసార్లు దాడులను ఎదొర్కొన్నది. చివరికి ఏడుగురే మిగిలారు. వారివద్ద సామాగ్రి నిండుకుంది. అయినా తలొంచని రాజపుత్రులు బాకులతో ద్వంద్వయుద్దానికి దిగారు. ఈపోరాటంలో నలుగురు మరణించగా, మిగిలిన ముగ్గురూ బందీలయ్యారు. జెమదర్ బోస్ సారధ్యంలోని బెంగాలీలు మూడుదాడుల తర్వాత 10మంది మిగిలారు. అయినా పోరాడి అమరులయ్యారు.

మేజర్ బీ.కే.పంత్ సారథ్యంలోని రాజపుత్రుల బృందం అసాధ్యమని తెలిసినా శత్రువును నిలువరించేందుకు ప్రాణాలను పణంగా పెట్టడానికి వెనుకాడలేదు. సహచరులను ఉద్దేశించి "రాజపుత్రదళం చరిత్రలో ఈరోజు మనమొక నూతన అధ్యాయాన్ని లిఖించబోతున్నాం. రాజపుత్రులను సాహసానికి, వీరత్వానికి చిరునామాగా ఎందుకు పేర్కొంతారో శత్రువుకు తెలియజేద్దాం." అంటూ కాలికి తగిలిన గాయాన్ని కూడా లెక్కచెయ్యకుండా కదనరంగంలోకి ఉరికాడు. మొదటి మూడు దాడులని ఎదుర్కొనేసరికే చాలామంది గాయపడ్డారు. నాలుగవ దాడికి ఆయన పొట్టకి, రెండుకాళ్ళకి తీవ్రగాయాలయ్యాయి. అయినా లెక్కచేయకుండా వీరులభూమిలో మృత్యువుకు చోటులేదంటూ నినదించసాగాడు. "రాజపుత్రులు ఈదేశంకోసం చావడానికే పుడతారు. దేవుడు ఈరోజు ఈప్రాంతాన్ని మీకు నిర్నయించాడు. దీనికోసం పోరాడండి." అంటూ గర్జిస్తున్న ఈయన్ని చూసిన చైనీయులు ముందుకెళ్ళడానికి ఈయనే ప్రధాన అవరోధం అని కనుగొన్నారు. వెంటనే తమ వనరులన్నింటినీ అక్కడికే మళ్ళించారు. ఒక మెచీన్ గన్ పంత్ శరీరాన్ని తూట్లుతూట్లు చేసింది. విపరీతమైన రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్తూ, పిడికిలి పైకిత్తి "జై బజరంగ్ బలి" అంటూ నినాదంచేస్తూ తుదిశ్వాస విడిచాడు. వీరమరణం పొందిన ఆయన ఆత్మ స్వర్గానికన్నా వెయ్యిరెట్లు ఆనందాన్నిచ్చే భరతమాత ఒడిలోకి చేరింది. రాజపుత్రుల సాహసాలకు శత్రువు సైతం అచ్చెరువొందాడు. వారివల్ల జరిగినంత నష్టం మరెక్కడా జరగలేదని, అస్లు రాజపుత్రుల వంటి శత్రువును చైనీయులు ఇదివరకు చూడలేదని కొనియాడారు.

మరోవైపు పంజాబీలు వ్యూహాత్మకంగా దాడులు చేస్తూ శత్రువును ముప్పతిప్పలు పెట్టసాగాయి. వనరులు, సమయం, సామాగ్రి, భౌగోళికాంశాలు- ఇన్ని పరిమితుల మద్య వారు మొదటి నుంచి శత్రువును ఎదుర్కొంటూనే ఉన్నారు. వాళ్ళ నైపుణ్యానికి జోహార్లర్పిస్తూనేమో చైనీయులు ఎక్కడా వారితో నేరుగా పోరాడలేదు. వారిని మిగతాదళాలను వేరుచేసుకుంటూ, ఒంటరిగా ఉండేలా వ్యూహాలు పన్నారు. వీరు అందరికన్నా ముందు ఉండటంతో, దాడికి స్పందించే సమయం లేకపోయింది. ఎక్కువమంది ఆసమయంలోనే మరణించారు. సాంగ్లేలో ఉన్న దళాలు అదృష్టవశాత్తూ భూటాన్ వైపు మళ్ళిపోయాయి. మిగతావారికి అలాంటి దారికూడా లేకుండా పోయింది. ఉన్నా వారు పోరాటానికే దిగేవారన్నది అందరి విశ్వాసం.



ఉదయం 7:30కల్లా ధాగ్ల ప్రాంతం పూర్తిగా చైనీయుల ఆధీనంలోకి వచ్చేసింది. మూడుగంటల్లో మొత్తం తుడిచిపెట్టుకు పోయింది. దానికి చైనీయుల వ్యూహాలేవీ అంత ఆధునికమైనవీ, చేదించ సాద్యం కానివీ కాదు. అయితే వారి దగ్గర సామాగ్రి ఉత్తమనైనది. బలం ఎక్కువ. స్థానికంగా అనుకూలాంశాలు ఎక్కువ. ఉన్నతస్థాయిలో తీసుకున్న నిర్ణయాలు ప్రభావ వంతమైనవి. తమ సామాగ్రి నిండుకునేదాకా భారత సైనికుడూ శత్రువుకు లొంగలేదు. వెన్నుచూపలేదు. మృత్యువును కౌగిలించుకున్నాడు. ఇక్కడ ఆసైనికుణ్ణీ చంపింది శత్రువా? లేక అరకొర వనరులు, అస్థవ్యస్థ నిర్ణయాలు, కుళ్ళు రాజకీయాలు నిండిన అధికార వ్యవస్థా? అన్నది వారివారి విచక్షణను బట్టి నిర్ణయానికి రావచ్చు.

అక్కడి నుంచి చైనాబలగాలు సాంగధర్ లోని హెలిపాడ్ వైపు కదిలాయి. మద్యలో కొన్నిబృందాలను వ్యూహాత్మకంగా పక్కకు పెట్టాయి. అక్కడ వస్తుసరఫరా కోసం వచ్చిన హెలికాప్టర్ను కూల్చివేశారు. యుద్దం గురించి ఎయిర్ ఫోర్సుకు సమాచారం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు బలయ్యారు. మొదట్నుంచీ ఆర్మీ- ఎయిర్ ఫోర్సులోని కీలకవిభాగాల మద్య సమంవయం లేదు. ఇది అనేకసార్లు తేటతెల్లమయ్యింది. ముందురోజు జనరల్ ప్రసాద్ తాను సరిహద్దుకు వచ్చి, అక్కడి సైనికుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని మాటిచ్చాడు.  అమాటప్రకారం ఆయన బయలుదేరబోగా, కిందవాళ్ళు వారించారు. ముందు తామెళ్ళి పరిస్థితిని చూసి వస్తామని, తర్వాత వెళ్ళమని చెప్పి బయల్దేరారు. ఆహెలికాప్టర్నూ కూల్చివెయ్యడంతో ఆయువకులిద్దరూ బలయ్యారు. అప్పటికే సిగ్నల్ అధికారి బందీగా మారాడు. అతని తర్వాతి వ్యక్తి ఈఘటనలో మృతి చెండాడు. దాంతో సమాచారం పూర్తిగా స్తంభించింది.

దాల్వీ కొన్ని రహస్య పత్రాలను తగలబెట్టాక, మిగిలిన సహచరులతో కలిసి సాంగధర్ వైపు కదిలాడు. అక్కడికి చేరుకునే సరికే చైనీయులు భారీ యెత్తున దాడులు నిర్వహిస్తున్నాయి. భారత సైన్యం తమతమ శక్తిమేరా వారిని నిలువరించేందుకు యత్నిస్తున్నాయి. దూరం నుంచి వారి సాహసాన్ని చూస్తున్న దాల్వీబృందానికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. దాదాపు 4గంటలు పోరాడాక, వీరి దగ్గర కూడా నిల్వలు నిండుకోవడంతో ప్రాణాలు విడిచారు. ఇక మిగిలింది హథుంగ్లా వద్ద ఉన్న పంజాబీలు, గ్రెనేడర్లు.
సెర్ఖిమ్ వైపు వెళ్ళి వారిని కలుసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అక్కడికి చేరుకోవాలంటే 18500 అడుగుల ఎత్తులో ఉన్న శిఖరాలను దాటాలి. నిట్టనిలువుగా ఉన్న పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఈదారిలో 17000 అడుగుల ఎత్తున చిన్నగుహలో రాత్రికి తలదాచుకున్నారు. అప్పటికి 24గంటలుగా ఎవ్వరికీ అన్నం లేదు. నిద్రలేదు. నీళ్ళు తాగాలన్నా మంచువల్ల గొంతు పట్టేస్తోంది. అలానే రాత్రంతా గడిపారు. ఇంతటి కష్ట సమయంలోనూ సైనికుడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. తమ అధికారి పట్ల వారుచూపిస్తున్న గౌరవం దాల్వీని కట్టిపడేసింది.

మార్గంలో ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురవుతూ వస్తుండటంతో వారిని వదిలి వెళ్ళక తప్పలేదు. మద్యాహ్నం 1:30కు కర్పోలా మార్గానికి చేరుకునేసరికి 12మంది మిగిలారు. కాళ్ళీడ్చుకుంటూ బండరాళ్ళు, కాలువలూ, పొదలు దాటి వెళ్తూ ఎక్కడొ దారి తప్పిపోయారు. కానీ ముందుకు పోవడం తప్ప మరొక మార్గం లేదు. కాబట్టి వెళ్తూ ఉన్నారు. అప్పటికే తిండితినీ, నిద్రపోయి 60గంటలయ్యింది! చైనీయులు ఒకదాని తర్వాత మరొకటి ఆక్రమించుకుంటూ మొత్తంప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. సరిహద్దు పోస్టుల్లో భారత త్రివర్న పతాకాన్ని అవనతం చేశారు. ఇక మళ్ళీ ఎప్పటికి మనఝెండా ఎగురుతుంది అన్నది కాలమే జవాబు చెప్పాలి. ఒక దట్టమైన అడవిని చీల్చుకుంటూ ముందుకు వెళ్ళగా మొత్తం దళం చైనాబలగాల మద్యలో ఇరుక్కుంది. వారంతా అక్కడే సేదతీరుతున్నారు. మొత్తం విజయం ఒక ఎత్తైతే దళనాయకుడు బందీగా దొరకడం ఎవడికైనా అమితానందాన్ని కలిగించేది. ఆక్షణం దాన్నే చైనీయులు అనుభవించారు.

అలా ఈమట్టికోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వెనకాడకుండా సైనికుడు సాగించిన పోరాటం ముగిసింది.

మేరునగ తప్పిదం- 14.పద్మవ్యూహం

సరిహద్దు గందరగోళానికి గురై ఉండగా జనరల్ కౌల్ డీల్లీనుంచి ఎలాంటి ఆదేశాలు పంపలేదు. దళాలు రక్షణ చర్యలలో భాగంగా బంకర్లు నిర్మించడం మొదలుపెట్టాయి. కానీ అందుకు సరిపడా సామాగ్రి లేకపోవడం వారిని ఇబ్బంది పెట్టింది. కౌల్ వెళ్తూ వెళ్తూ అప్పగించిన "ప్రస్తుత స్థానాలను యధాతథంగా కొనసాగించడి." అన్న బాద్యతకు అనుగుణంగా 4మైళ్ళ పొడవున విస్తరించి ఉన్న ప్రధానప్రాంతంతో బాటు 10మైళ్ళ పొడవున విస్తరించి ఉన్న మిగతాప్రాంతాలను కాపాడటం అప్పటి బలానికి చాలాపెద్ద లక్ష్యం.

అక్టోబరు 12న లెఫ్టినెంట్ కల్నల్ హరిహర్ సింగ్ సారధ్యంలోని 4గ్రెనేడర్ బలగాలు ఒక్కొక్కటిగా సరిహద్దుకు చేరుకోవడం ప్రారంభించాయి. మిగతా దళాల మాదిరిగానే వీళ్ళుకూడా ఉన్నపళంగా మైదానాలు విడచి ఇక్కడకు రావడంతో విపరీతంగా అలసిపోయి ఉన్నారు. అంతేకాక కొత్తవాతావరణానికి అలవాటు పడటానికి సమయం పడుతుంది. వీరి రాకతో మొత్తం బలం 2500కు చేరుకుంది. అక్టోబరు 16కు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వారి పోర్టర్లు 450మంది సమకూరారు. సంఖ్యపెరిగిపోవడంతో సరకులనిల్వలు 2రోజులకు పడిపోయింది.

అక్టోబరు 11న డిల్లీ చేరుకున్న కౌల్, ఉన్నతస్థాయి సామావేశంలో పాల్గొన్నాడు. అన్నిరకాలుగా చైనీయులు మనకన్నా మెరుగైన స్థానంలో ఉన్నారని చెప్పాడు. అక్కడ చైనీయులను ఎదుర్కోవడం అసాధ్యమని, ధోలానుంచి బలగాలను ఉపసంహరించాలని వాళ్లకు నివేదించాడు. వారికి మూడు ప్రత్యామ్నాయలను ప్రతిపాదించాడు. ఒకటి- సరిహద్దులో బలాన్ని పెంచుకుని చైనాపై దాడి చెయ్యడం. రెండు- దాడి చెయ్యకుండా యదాతథ స్థానాలలో కొనసాగించడం. మూడు- ప్రస్తుత స్థానలకన్నా మెరుగైన ప్రాంతాలకు బలగాలను పంపడం. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో మూడవది, అంటే అక్కడ్నుంచి బలగాలను వేరేచోటకు పంపడం, తప్ప వేరేవేవీ కుదిరేవి కావు. కానీ మూడింటినీ చెప్పడం కౌల్ చేసిన ఘోరతప్పిదం. దాడి చేసేంత బలం మనకు లేదన్నది సుస్పష్టం. బలమైన శత్రువుకు ఎదురుగా, ఎలాంటి రహస్య కార్యకలాపాలనూ కొనసాగించలేని చోట బలగాలను ఉంచి ఏమిలాభం? వాళ్ళకు రక్షణ ఎలా? రాజకీయ కోణంలోంచి చూస్తే బలగాలను అక్కడే కొనసాగించడ మొక్కటే సరియైనది. అలా చేస్తేనే ప్రభుత్వం ప్రజలకు, పార్టీ ప్రతిపక్షానికి జవాబు చెప్పగలదు. కాబట్టి యదాతథ స్థానాలను కొనసాగించమని ఉత్తర్వులు జారీచేసింది. సైన్యం తనకుతానుగా ఇచ్చిన ప్రత్యామ్నాయలలో ఇది ఉంది కాబట్టే వాళ్ళు దాన్ని ఎంచుకున్నారు.

13న నెహ్రూ కొలంబో బయలుదేరుతూ చైనీయులను తరిమికొట్టమని ప్రభుత్వం సైన్యాన్ని ఆదేశించిందని పత్రికలకు చెప్పాడు. ఇది చైనీయుల గుండెలు భగ్గుమనేలా చేసింది. రేడియోలో ఈవార్తలను విన్న సరిహద్దుదళాలు గందరగోళానికి గురైయ్యాయి. ఎట్టకేలకు కౌల్ నుంచి ఆదేశాలు అందాయి. వాటిననుసరించి- దళాలు యదాతథ స్థితిని కొనసాగించాలి. కానీ అందుకు అవసరమైన అదనపు వనరులు, ప్రణాళిక, పాలనావిషయాలేవీ చర్చించలేదు. అంతకుమునుపు వచ్చిన ఉత్తర్వుల్లానే ఇదికూడా ఒక నినాదంగా మిగిలిపోయింది.

మరోవైపు చైనా నెహ్రూ ప్రకటనను సాకుగా చూపించి, భారీ యెత్తున సన్నాహాలు మొదలుపెట్టింది. కొరియాయుద్దంలో నాయకత్వం వహించిన వ్యక్తికి దీనిబాద్యతలు అప్పగించింది. దళాలన్నీ చురుగ్గా పనులు చెయ్యడం మొదలుపెట్టారు. వారి కదలికలను గమనించడానికి భారతసైన్యం 25 అబ్జర్వేషన్ పోస్టులను నెలకొల్పింది. సరిహద్దుకు అవతల మనలను లక్ష్యంగా చేసుకుని చైనా చేపడుతున్న యుద్దసన్నాహాలను మూగగా చూస్తూ ఉండటం కన్నా భారత జవాను చెయ్యగలిగింది ఏమీలేదు! అరకొర సదుపాయాలు, పనిముట్లతో దాడిసంగతి దేముడెరుగు కనీసం ఆత్మరక్షణకు కూడా ఏర్పాట్లు సరిపోవు. ఆసమయంలో నాలుగు తుపాకులను పంపగా, అందులో రెండు హెలికాప్టర్లు జారవిడిచేటప్పుడు ముక్కలయ్యాయి. మనదగ్గరున్న అతిపెద్ద ఆయుధం సామర్థ్యం చైనీయుల సంచార ఆయుధాల సామర్థ్యంకన్నా తక్కువ. పర్వత ప్రాంతం కావడంతో వాటి పరిమితి మరింతగా పెరిగిపోయింది.

మరొకవైపు వైద్యసదుపాయాలు యుద్దావసరాలకు ఏమాత్రం సరిపోవు. పంజాబీదళం ఎలాంటి వైద్యసదుపాయం లేకుండానే పోరాడుతోంది. ఉన్నపళంగా సైన్యాన్ని సరిహద్దుకు పంపడంతో దానికనుగుణంగా వైద్యశిబిరాలను ఏర్పాటు చెయ్యటం గందరగోళానికి గురైంది. మొదట లుంపులో నెలకొల్పాల్సిన శిబిరాన్ని కౌల్ ఆదేశాలతో సరిహద్దుకు మార్చాల్సి వచ్చింది. ఇన్ని సమస్యల్లోనూ వైద్యబృందం అహర్నిశలూ కృషిచేసి రోజుకు నలభైమందికి వైద్యాన్నిచ్చింది. కేసుల్లో సింహభాగం చలినుంచి సరైన రక్షణలేకపోవడంవల్ల, అలవాటులేని పర్వతప్రాంతంలో ఉండవలసినందువల్ల ఏర్పడినవే. రోగులను తరలించడం తలకుమించిన భారమైంది. రోగులను ఎనిమిదిగంటలపాటు మోసుకుంటూ పర్వతాలను దాటి ఆసుపత్రిలో చేర్చాలి. తిరుగుప్రయాణంలో అక్కడినుంచి సామాగ్రి మోసుకురావాలి.

ఇలాంటి ప్రతికూల సమయాల్లోనూ కెప్టెన్ బీ.బీ.కూలే సారధ్యంలోని వైద్యబృందం రోజుకు 40మందికి పైగా రోగుల్ని చూసేవారు. అందులో కనీసం పదిమంది పరిస్థితి అపాయకరంగా ఉండేది. ఎయిర్ ఫోర్సుకు చెందిన స్కాడ్రన్ లీడర్ విలియమ్స్ ధైర్యసాహసాలతో విమానాన్ని నడిపి రోగులను ప్రధాన కేంద్రానికి చేర్చేవాడు. తెల్లవారుఝామున మొదలైన విమానం పొద్దుగూకే వరకూ తిరుగుతూనే ఉండేది. ఒకరోజు 23 రౌండ్లు తిరిగిన ఈయన సాహసాన్ని గౌరవిస్తూ, వైద్యబృందం యుద్దవీరుల అవార్డుకు ఈయన్ని నామినేట్ చేసి గౌరవించింది. మద్యలో జనరల్ కౌల్ ఉత్తర్వులు వీరిని కొంత అసహనానికి గురిచేశాయి. వైద్యుల సలహాను తీసుకోకుండానే ఆయన ఒకబృందాన్ని సరిహద్దుకు పక్కనే ఏర్పాటు చెయ్యమన్నాడు. దాడిజరిగితే అది ధ్వంసమయ్యే ప్రమాదాన్ని ఆయన గమనించలేదు. అలానే ఇంకొక బృందాన్ని ఎత్తైన ప్రాంతంలో ఏర్పాటు చెయ్యగా ఆక్సిజన్ వసతులు లేకుండా 9000అడుగులకన్నా ఎత్తులో ఆపరేషన్ చెయ్యడం కుదరని కారణంగా దాన్ని విరమించుకున్నారు. విసుగెత్తిన మేజర్ జయరామన్ తన పైఅధికారి కల్నల్ మైత్రాకు పిర్యాదు చేశాడు. ఆయన తనబృందానికే మద్దతునివ్వడంతో వాళ్ళు ఊపిరిపీల్చుకున్నారు.

ఇక వస్తురవాణా పరిస్థితి నానాటికీ తీసుకట్టుగా తయారవసాగింది. ఒకవైపు అవసరాలు పెరిగిపోతుండగా, మరొకవైపు వస్తువులను జారవిడిచేందుకు ఎన్నుకున్న ప్రాంతం ఇరుకైనది కావటాన మూడోవంతు మాత్రమే సైన్యానికి అందసాగింది. మిగతాది అక్కడినుంచి దొర్లి లోయల్లో పడిపోతున్నాయి. అలానే సామాగ్రిని నిల్వచేయను చాలినంత గోదాములూ లేవు. సైన్యానికి అవసరమైన సామాగ్రి ఏమిటీ? వాటి ప్రాధాన్యతా క్రమం ఏమిటీ? అవసరానికి తగినట్టు అందుతున్నాయా? పదాతిదళానికీ వాయుసేనకు మద్య సమాచారం సరిగా అందుతుందా? వంటి కీలకమైన ప్రశ్నలకు జవాబిచ్చే స్థితిలో సైనికాధికారులు లేరు.

ఇక సమాచార వ్యవస్థ- 4డివిజను సిగ్నల్ రెజిమెంట్ వాళ్ళు ఒక టెలిఫోన్ లైనును ఏర్పాటు చేశారు. అది కాస్తా సాధారన యుద్ధనియమాలకు విరుద్ధంగా సరిహద్దుకు సమాంతరంగా, చెనీయుల వాకిట్లో ఏర్పాటుచేస్తారు. సరిహద్దు- ప్రధానకేంద్రం మద్యన సమాచాఅం శత్రువు దయాదాక్షిణ్యాలమీద ఆధారపడినట్లైంది. ఆప్రాంతానికి లైను వెయ్యాలంటే అంతకన్నా వేరేమార్గం లేదు. అలాంటి ప్రాంతాన్ని ఎంచుకున్నాం కాబట్టి అనుభవించక తప్పదు. మనవ్యవస్థలు, సదుపాయాలు అన్నీ శత్రువు కళ్లకెదురుగానే ఉంచాం. దాంతో సైనిక సన్నాహాల్లో కీలకమైన గుట్టు ఇక్కడ రట్టైంది.

ఇన్ని సమస్యల మద్యలో, జనరల్ కౌల్ పానకంలో పుడకలాగా పైనుంచి ఊడిపడ్డాడు. మొత్తం అధికారక్రమంలో ఆయన స్థానమేంటి అన్నది అందరికీ అస్పష్టమే. దాంతో ఆయన తనతోపాటు కొందరు ఉద్యోగులను తనవెంట తీసుకొచ్చి,  వాళ్ళందరికీ తలో హోదా కల్పించి ఖాళీల్లో ఇరికించాడు. ఖాళీలు లేకుంటే సృష్టించాడు. వీళ్లందరికీ పని ఇవ్వాలు. ఫర్నీచర్ ఇవ్వాలి. ఇతర సదుపాయాలు కల్పించాలి. అదొక వింతసమస్య!

ఇంత జరుగుతున్నా మనప్రభుత్వం సైనికులతో చదరంగం ఆడటం ఆపట్లేదు. అన్నివైపులనుంచీ విమర్శలు తారాస్థాయికి చేరుకుంటూ ఉండటంతో దీనికి జవాబిచ్చేలా ఏదైనా చెయ్యాలని ప్రభుత్వం యోచించింది. సాంగ్లే అనే ప్రాంతం ఆయాచితవరంగా మననాయకులకు లభించింది. ఇది భూటాన్ మూలన ఉంటుంది. నమ్కాచు నది అవతల ఉండటంతో ఇది చైనా భూభాగమవుతుంది. అక్కడకు మనసైనికులను పంపి ఆప్రాంతాన్ని మన ఆధీనంలో ఉండేలా చేస్తే అందరికీ జవాబివ్వొచ్చు అని భవైంచింది. అయితే అక్కడకు సైన్యాన్ని పంపడంలో గల పరిమితులను, వస్తురవాణాలోని ఇబ్బందులను, సైన్యం ఆత్మరక్షణకు గల ఇబ్బందులను పట్టించుకోలేదు. ఒకవైపు ఇప్పుడు కాపలాకాస్తున్న ప్రాంతమే తలకుమించిన భారమయింది. ఇక ఈకొత్తప్రాంతాన్ని కూడా కాపలాకాయాలంటే అస్సలు కుదిరేపనే కాదు. ఒకవేళ దాన్ని కాయాలంటే ఇక్కడ కొంతబరువును తగ్గించుకోవాలి. ఇంతా చేసి అక్కడకు వెళ్ళినందువల్ల ఏమైనా ప్రయోజనమా అఁటే అదీలేదు. అక్కడికెళ్ళడే పెద్దతలనొప్పి. సరైన దారిలేదు. మద్యలో ఉన్న పర్వతశిఖరం మంచుతో కప్పబడి, దాటడానికి దుస్సాధ్యంగా ఉంటుంది. రానున్న శీతాకాలంలో పరిస్థితి మరింత విషమిస్తుంది. అక్కడికెళ్ళెవాళ్లకి తప్పనిసరిగా చలికాలపి దుస్తులు ఇవ్వాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఏముంది. అప్పటికే వాటిని వాడుతున్న పంజాబీదళం నుంచి తీసుకుని సరఫరా చెయ్యాల్సి వచ్చింది. ఇది ఎంత దారుణమైన సంఘటన? కనీసం నోరుమెదపని జవానుకు మనం ఏమిస్తే ఋణం తీర్చుకోగలం? సైనికాధుకారులు ఎంత మొత్తుకున్నా మీనన్ ముందు చెవిటివాడి చెవిలో శంఖం పూరించిన చందమే. మరొకవైపు నెహ్రూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇస్తున్న ప్రకటనలు చైనీయులను మరింత రెచ్చగొట్ట సాగాయి.

అక్టోబరు 16న జనరల్ ప్రసాద్ ఫోన్లో కలిశాడు. పైవాళ్లను ఒప్పించలేక పోయానని, నవంబరు 1కల్లా చైనీయులను తరిమికొట్టాలన్నది రక్షణమంత్రి ఆదేశమని చెప్పాడు. దీంతో దాల్వీకి అరికాలిమంట నడినెత్తికెక్కింది. అది కుదిరేపని కాదన్నది ఇద్దరి అభిప్రాయం కాబట్టి పైవాళ్లకు దాన్ని తెలియజేయమన్నాడు. ఈపరిస్థితుల్లో రాజీనామా ఇవ్వడమొక్కటే దారి. అయినా పై అధికారులెవరూ ఆయనతో విబేధించట్లేదు. ఆయన అభిప్రాయాన్ని జనరల్ కౌల్ సహా అందరూ ఒప్పుకున్నారు. కానీ రాజకీయ అవసరాలు అన్నింటికన్నా ఎక్కువ ప్రధానమయ్యాయి. దాంతో ఎవరికీ ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.

అక్టోబరు 17న ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్కాచులో సైన్యాన్ని ఉంచే ప్రశ్నేలేదు. వెంటనే వెనక్కి పిలిపించమని దాల్వీ ప్రసాదును కోరాడు. పైవాళ్లకు తెలియజేస్తానన్ని చెప్పడం మినహా ఆయన చేసిందేమీ లేదు. అక్టోబరు 18నాటికి చైనా సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఆరాత్రి కొందరు చైనీయులు భారత భూభాగంలోకి చొరబడ్డారని గ్రెనేడర్ దళం వారు పిర్యాదు చేశారు. వారిమార్గాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సిగ్నల్ కమాండర్ కే.కే.తివారి సమాచార వ్యవస్థను తనిఖీ చెయ్యడానికి వచ్చాడు. త్వరలోనే దళాలను ఇక్కడినుంచి ఉపసంహరించుకోవచ్చు అని తెలియజేశాడు. ఎలాంటి ఆధునిక పరికరాలూ లేకుండానే ఈయన సిగ్నల్స్ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాడు. తమ సామర్థ్యానికి మించిన కార్యక్రమాలనూ ఎలాంటి విసుగూ ప్రదర్శించకుండా నిర్వహించాడు.

అక్టోబరు 19కల్లా భారత సైన్యం పూర్తిగా చైనీయుల పద్మవ్యూహంలో చిక్కుకుపోయింది. వారి కదలికలను చూసినవారు ఎవరైనా పెద్దదాడికి సిద్దమవుతున్నారని సులువుగా గ్రహించగలరు. ఈసమయంలో జనరల్ ప్రసాద్ ఫోన్ చేసి మిగిలిన గూర్ఖాలను సాంగ్లేకు పంపమని చెప్పాడు. ఈసమయంలో దళాలను అక్కడకు పంపితే మార్గమద్యంలోనే చైనీయులు హతమార్చే ప్రమాదం ఉందని ఆయనకు చెప్పాడు. అడ్డమైన రాజకీయాలకు యుద్దభూమి వేదికగా నిలిచింది. ఎవరెవరో చేసిన పాపాలను కడుక్కునేందుకు సైన్యాన్ని బలిపశువుగా నివేదిస్తున్నారు. నోటిమాటలతో విసిగిపోయానని  ఇకపై ఏఉత్తర్వులనైనా రాతపూర్వకంగా ఇస్తేనే చేస్తానని ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పటికే చైనీయులు యుద్దానికి సిద్దమైపోయారని, వాళ్లదాడిని నిలువరించాలంటే వీలైనంత తక్కువ ప్రాంతంలో బలగాలను మోహరించాలని చెప్పాడు. ప్రస్తుతం బలగాలు సన్నగా 10మైళ్ళ దూరంలో విస్తరి6చి ఉన్నాయని, దాడిని నిలువరించే శక్తి వాటికి లేదని చెప్పాడు.

అప్పుడు ప్రసాద్ తీరిగ్గా ఒక నిజాన్ని బయటపెట్టాడు. హిమాలయ వాతావరణం పడక జనరల్ కౌల్ అస్వస్థతకు గురయ్యాడు! దానివల్లే దళాలకు తాజా ఉత్తర్వులేవీ అందట్లేదు. కౌల్ బాద్యతలు నిర్వర్తించలేని సమయంలో జనరల్ ప్రసాద్ ఇన్ చార్జ్ అవుతాడు. కానీ ఆబాద్యత తీసుకునేందుకు ఆయన సిద్దంగా లేడు. అంతేగాక ఇన్నేళ్ళుగా ఆయన పని అటు ప్రధాన కార్యాలయానికీ ఇటు సరిహద్దుకీ మద్యన పోస్టుమాన్ పాత్ర పోషిస్తూ వచ్చాడు. కిందవాళ్ళ నివేదిక పైవాళ్ళకు చేరవేయడం. పైవాళ్ళ ఆదేశాలు కిందకు పంపడం మినహా ఆయన చేసిందేమీలేదు. సర్వీసు ప్రకారం సీనియర్. అలాగని నిర్ణయాలు తీసుకునేంత సీనియర్ కాదు. కిందవాళ్ళతో కలవగలిగినంత జూనియరూ కాదు. ఆయన పరిస్థితి ఇటు ఉట్టికీ అటు స్వర్గానికీ కాకుండా ఉంది. ఆయన నిర్లిప్త ధోరణికి చికాకుపడ్డ దాల్వీ ఫోన్లో కొంచెంఘాటుగానే విమర్శించాడు.సైనికుల పరిస్థితి ఏమిటో తెలిసినందువల్ల ఆయన దాల్వీ మాటలతో ఏకీభవిస్తూ, అవసరమైతే తానూ యుద్దభూమికి వచ్చి సైనికులతోనే ఉంటానని చెప్పాడు.

ఒకవైపు శత్రువు సన్నాహాలు వాయువేగంతో పూర్తవుతుండగా, మనం మాత్రం సైనికుణ్ణి బలిపశువును చేసి, రాజకీయాల్లో మునిగి తేలుతున్నాం. వాటి ఫలితంగా మనసైన్యం శత్రువు పద్మవ్యూహంలో చిక్కుకుంది.